AP Weather Alert: ఏపీలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు ఇవే
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:43 AM
ఏపీలో ఈనెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.
అమరావతి, నవంబర్ 25: రాష్ట్రంపై మరోసారి వరణుడు తన ప్రతాపం చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఈనెలాఖరున (నవంబర్) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మలక్కా జలసంధి ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. రాగల 6 గంటల్లో ఇది పశ్చిమ - వాయవ్య దిశగా కదులుతూ అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది.
ఆ తదుపరి 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఉపరితల ఆవర్తన ప్రభావంతో కొమోరిన్, నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఇప్పటికే కేంద్రీకృతమై ఉన్నట్లు చెప్పింది. రాబోయే 24 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు (నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2) కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు... పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపింది.
హెచ్చరికలు...
ఈనెల 27 (గురువారం) నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని అధికారులు సూచించారు. వర్షాల నేపథ్యంలో రైతులకు కూడా వాతావరణ అధికారులు కీలక సూచనలు చేశారు. మరో మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తమై వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
కత్తులతో ఇంటి యజమానిని భయపెట్టాలని చూశాడు.. చివరకు
ఆనందం ఆవిరి.. ఒక్కసారిగా పతనమైన కొబ్బరి ధర
Read Latest AP News And Telugu News