CM Chandrababu: టూరిజం కాన్క్లేవ్లో సీఎం చంద్రబాబు కీలక సూచన
ABN , Publish Date - Jun 27 , 2025 | 01:12 PM
విజయవాడ వేదికగా రెండు రోజులుపాటు జరుగుతున్న టూరిజం కాన్క్లేవ్లో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్వాన్ను ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

అమరావతి, జూన్ 27: సామాన్యులకు అందుబాటులో ఉండేలా కార్వాన్ పర్యాటకం ఉండాలని టూరిజం కాన్క్లేవ్ నిర్వాహకులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శుక్రవారం విజయవాడలోని ఒక హోటల్లో జీఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్ జరిగింది. ఈ సదస్సుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నడిచే హోటల్ రూములతో రూపొందించిన కార్వాన్ను ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం కార్వాన్లను వారు పరిశీలించారు.
పర్యాటక రంగంలో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ఈ టూరిజం కాన్క్లేవ్ జరుగుతోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదాను రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కాన్క్లేవ్ వేదికగా.. సీఎం చంద్రబాబు సమక్షంలో రూ.10, 039 కోట్ల విలువైన పెట్టుబడులపై రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకోనుంది. అలాగే పర్యాటకుల కోసం విశాఖపట్నం, రాజధాని అమరావతి, ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కొత్తగా హోటళ్ల నిర్మాణం కోసం ఒప్పందాలు చేసుకోనున్నారు. ఈ కాన్క్లేవ్లో రాష్ట్ర పర్యాటక రంగంపై వీడియోను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, విజయవాడ తూర్పు నియోజక వర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పలువురు పారిశ్రామిక వేత్తలతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు సైతం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాబా రామ్దేవ్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రగతికి, ఆనందానికి, యోగానికి భగవంతుడు పంపిన వరమని అభివర్ణించారు. తన నుంచి ఏ విధంగా యోగా నేర్చుకుంటారో.. అదే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు నుంచి మన దేశ రాజకీయ నాయకులు రాజకీయాలు నేర్చుకుంటారని ఆయన ఆకాంక్షించారు. అందరికి ఆర్గానికి, లాంగివిటీ, ఇమ్యూనిటీ ఫుడ్ను అన్ని హోటల్స్లో అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని బాబా రామ్దేవ్ స్పష్టం చేశారు. అలాగే యోగా, ఆయుర్వేదం, నేచురోపతి సర్వీసులు ఉచితంగా అందిస్తామన్నారు. హార్సలీ హిల్స్ నుంచి అరకు, రాజమండ్రి, సూర్యలంక తదితర ప్రాంతాల్లో తాను పర్యటించానని తెలిపారు. ఈ సేవలకు ఆ ప్రదేశాలు సరిపోతాయని వివరించారు. అయితే తాను దేశ విదేశాల్లో పర్యటించానని.. వీటన్నింటి కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత అందంగా ఉందన్నారు.
గతంలో తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చానని.. కానీ ఈ దృష్టితో ఎప్పుడు చూడలేదని చెప్పారు. ఏపీలో గోదావరి నది, సముద్రం ఉన్నాయని.. అలాగే దిండిలో హౌస్ బోట్ సైతం ఉందని వివరించారు. రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ వివాహం సైతం ఏపీలో చేయాల్సిందన్నారు. ఏపీలో అన్ని ఉన్నాయని చెప్పారు. ఏపీ వెడ్డింగ్ డెస్టినేషన్ అవుతుందని ఆయన ఆకాంక్షించారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. సనాతన ధర్మంలో వివాహం ఎలా చేసుకోవాలో ఇక్కడ ఏర్పాటు చేద్దామని బాబా రామ్దేవ్ పేర్కొన్నారు. దీంతో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ వెండ్డింగ్ డెస్టినేషన్ అవుతుందని ఆకాంక్షించారు. అందుకోసం తాను ఉచితంగా ప్రచారం నిర్వహిస్తానన్నారు. ఇలాంటి కొత్త ఐడియాలు అందరికీ రావాల్సి ఉందని పేర్కొన్నారు. తాను పతాంజలి కోసమే కాదని.. భారతదేశం కోసం సైతం పని చేస్తానని వివరించారు.
తన వయస్సు 65 ఏళ్లని బాబా రామ్దేవ్ గుర్తు చేశారు. అయితే మానసిక వయస్సు మాత్రం 25గా ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు బయోలాజికల్ ఏజ్ సైతం తగ్గుతుందన్నారు. మ్యాన్ ఆఫ్ హోప్ అంటే చంద్రబాబు నాయుడు అని అభివర్ణించారు. ఆయనకు సూపర్ కంప్యూటర్ లాంటి తెలివి ఉందని బాబా రామ్దేవ్ వివరించారు. హర్సలీ హిల్స్ను సైకియాట్రిక్ వెల్నెస్ సెంటర్గా ప్రపంచపటంలో నిలుపుతానని ఈ సందర్భంగా ప్రకటించారు.
ఏపీ టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్ కావడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఏపీ ఇంత అందంగా ఉంటుందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసునన్నారు. గుజరాత్, మహారాష్ట్రతోపాటు హిందీ మాట్లాడే రాష్ట్రాలకు వెళ్లి... ఆంధ్రప్రదేశ్ గురించి వివరిస్తానని తెలిపారు. ప్రపంచం మొత్తానికి ఏపీ టూరిజంను పరిచయం చేస్తానన్నారు. ఏపీని వెల్నెస్లో ప్రపంచంలోనే గొప్పగా చేస్తానని హామీ ఇచ్చారు. హర్సిలీ హిల్స్, అరకులో వాతావరణం చాలా బావుంటుందన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల వాతావరణాలు ఉన్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఎగ్జిక్యూషన్ విషయంలో మరెవరు లేరన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేడు 3 జిల్లాలకు సీఎం చంద్రబాబు
విజయవాడలో మరో భారీ మోసం.. రంగంలోకి దిగిన పోలీసులు
For More AndhraPradesh News And Telugu News