Share News

Podili Protest: జగన్‌ పర్యటనలో వైసీపీ మూక అరాచకం

ABN , Publish Date - Jun 12 , 2025 | 04:27 AM

శాంతియుత నిరసన చేపట్టిన మహిళలపై వైసీపీ కార్యకర్తలు అరాచక వాదులుగా విరుచుకుపడ్డారు. రాళ్ల వర్షం కురిపించారు. మహిళలనే కనీస జ్ఞానం లేకుండా చెప్పులు విసిరారు. బూతులు, దుర్భాషలతో రెచ్చిపోయారు. ఈ దాడుల్లో పలువురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి.

Podili Protest: జగన్‌ పర్యటనలో వైసీపీ మూక అరాచకం

  • జగన్‌కు నిరసన సెగ

  • మహిళలపై రాళ్లు, చెప్పులు

  • బూతులు, దుర్భాషలతో వీరంగం

  • అమరావతి మహిళలకు జగన్‌ క్షమాపణలు చెప్పాలనడమే నేరం

  • ప్లకార్డులు, నల్ల బెలూన్లతో నిరసన తెలపడమే అతివల పాపం

  • పొదిలిలో రెచ్చిపోయి మరీ దాడులు

  • ఓ కానిస్టేబుల్‌తోపాటు మహిళలకు గాయాలు.. డీఎస్పీని తాకిన చెప్పులు

  • స్పృహ తప్పి పడిపోయిన సీఐ

  • ఇవేవీ పట్టించుకోని జగన్‌.. సర్కారుపై చిందులు

పొదిలి, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): శాంతియుత నిరసన చేపట్టిన మహిళలపై వైసీపీ కార్యకర్తలు అరాచక వాదులుగా విరుచుకుపడ్డారు. రాళ్ల వర్షం కురిపించారు. మహిళలనే కనీస జ్ఞానం లేకుండా చెప్పులు విసిరారు. బూతులు, దుర్భాషలతో రెచ్చిపోయారు. ఈ దాడుల్లో పలువురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. కానిస్టేబుల్‌ తలకు బలమైన గాయమైంది. వైసీపీ అల్లరి మూక విసిరిన చెప్పులు డీఎస్పీపైనా పడ్డాయి. దీంతో ప్రకాశం జిల్లా పొదిలిలో బుధవారం జరిగిన జగన్‌ పర్యటన వైసీపీ అరాచక శక్తుల దాడితో రణరంగమైంది. జగన్‌కు చెందిన సాక్షి మీడియాలో అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించడాన్ని వ్యతిరేకిస్తూ.. ఈ వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేయడమే మహిళలకు శాపంగా మారింది.

అసలు ఏం జరిగింది?

మాజీ సీఎం జగన్‌ ప్రకాశం జిల్లా పొదిలిలో బుధవారం పర్యటించారు. అయితే.. సాక్షి టీవీ డిబేట్‌లో అమరావతి ప్రాంత మహిళలను దారుణంగా కించపరచడం పట్ల జగన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక రథం రోడ్డులో మహిళలు శాంతియుత నిరసనకు దిగారు. ‘‘జగన్‌ గో బ్యాక్‌’’, ‘‘మహిళలకు క్షమాపణ చెప్పని జగన్‌ షేమ్‌.. షేమ్‌!.’’ అంటూ నినాదాలు చేశారు. ‘సాక్షి చానల్‌ మాకొద్దు’ అని రాసున్న ప్లకార్డులతో నిరసన తెలిపారు. అయి తే.. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ రౌడీ మూక లు రెచ్చిపోయాయి. నిరసన తెలుపుతున్న మహిళలపై రాళ్లు, చెప్పులతో విరుచుకుపడ్డారు. దీంతో భయ భ్రాంతులకు గురైన మహిళలు ప్లకార్డులు, బెలూన్లు అక్కడే వదిలేసి తలోదిక్కుకు పరుగులు తీశారు. మహిళలు పారిపోతున్నా వదిలి పెట్టకుంటా.. వైసీపీ అల్లరి మూక వెంటబడి మరీ వారిని తరుముతూ రాళ్లు రువ్వింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌ తలకు తీవ్రగాయం కాగా.. పలువురు మహిళలు కూడా గాయపడ్డారు. అయితే, ఇవేవీ పట్టనట్టుగా జగన్‌ తన పర్యటనను కొనసాగించారు.


అలజడి కోసమే పోరుబాట!

పొదిలి పొగాకు రైతుల సమస్యలపై ‘పోరుబాట’ పేరుతో జగన్‌ ఈ కార్యక్రమం చేపట్టినా.. వైసీపీ కార్యకర్తలు మాత్రం అలజడి సృష్టించడమే లక్ష్యంగా రెచ్చిపోయారు. తొలుత దర్శి రోడ్డులోని హెలిప్యాడ్‌ నుంచి పట్టణంలోని పొగాకు వేలంకేంద్రం వరకు జగన్‌ కారులో ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీగా వచ్చారు. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలు ‘సీఎం, సీఎం’ అంటూ అరుపులు కేకలతో రెచ్చిపోయారు. అదేసమయంలో రథం రోడ్డు పక్కనే కొంతమంది మహిళలు శాంతియుతంగా నిరసన తెలిజేస్తున్నారు. ప్లకారులు చూపుతూ నల్లబెలూన్లను పట్టుకొని నిరసన తెలిపారు. దానిని చూసిన వైసీపీ శ్రేణులు ‘సీఎం, సీఎం’ అని నినాదాలు చేస్తూ ఆవేశంతో ఒక్క ఉదుటున అక్కడకు చేరుకుని మహిళలపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిని అడ్డుకున్న పోలీసులపైనా రాళ్లు, చెప్పులు పడ్డాయి. విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ జీవీ రత్నం తలకు తీవ్రగాయమైంది. దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణపై అల్లరి మూకలు విసిరిన చెప్పులు పడ్డాయి. విధుల్లో ఉన్న పొదిలి సీఐ వెంకటేశ్వరరావు కూడా సృహతప్పి పడిపోయారు. గాయపడిన కానిస్టేబుల్‌ను వెంటనే పోలీసులు సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ దాడిలో పొదిలికి చెందిన రాజ్యలక్ష్మి, కంబాలపాడు గ్రామానికి చెందిన అలేఖ్య, పొదిలికి చెందిన అమూల్య, ఖయ్యూం అనే వారికి గాయాలయ్యాయి. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మహిళలపై అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ వైసీపీ అల్లరిమూకలు దాడి చేయటంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పొదిలి పొగాకు వేలం కేంద్రం లోపలికి జగన్‌ వెళ్లిన సమయంలో కూడా ఆయన వెంట వచ్చిన వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. కేంద్రం ప్రఽధాన గేటును తోసుకుని, పోలీసులను కూడా లెక్కచేయకుండా లోపలికి చొచ్చుకుపోయారు. వేలంలో ఉంచిన పొగాకు బేళ్లను తొక్కేశారు. ‘సీఎం, సీఎం’ అని కేకలు పెడుతూ అల్లరిచేయటం తప్ప రైతులను పట్టించుకోలేదని కొందరు ఆరోపించారు.


జగన్‌ వెంట రౌడీ మూకలు: ఎస్పీ

పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ మూకల రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ తెలిపారు. బుధవారం రాత్రి ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడుతూ.. మహిళలపై చెప్పులు, రాళ్లు వేయడంతోపాటు పోలీసుల విధులకు కూడా ఆటంకం కలిగించారని చెప్పారు. మాజీ సీఎం జగన్‌ పాల్గొన్న కార్యక్రమంలో రౌడీమూకలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. వైసీపీ నిర్వహించిన ర్యాలీలో అరాచకశక్తులు ఉన్నట్టు గుర్తించామన్నారు. వీడియో ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తున్నామని, నిందితులందరినీ గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. దాడి నేపథ్యంలో విధి నిర్వహణలో ఉన్న ఇరువురు మహిళా కానిస్టేబుళ్లు, మరో కానిస్టేబులు గాయపడ్డారని తెలిపారు. అలాగే మరో ముగ్గురు నిరసనకారులకు గాయాలయ్యాయని చెప్పారు.


రైతులను ఆదుకోవడంలో బాబు విఫలం

మా పాలన స్వర్ణయుగం.. జగన్‌ సెల్ఫ్‌గోల్‌

పొగాకు రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ అధినేత జగన్‌ విమర్శించారు. పొదిలి పొగాకు వేలం కేంద్రం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పాలన రైతులకు స్వర్ణయుగంలా ఉందని, అదే కూటమి ప్రభుత్వంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని సెల్ఫ్‌గోల్‌ చేసుకున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇటీవల పర్చూరు, కొండపి నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. వైసీపీ పాలనలో పొగాకు క్వింటాకు రూ.36,600 అత్యధిక ధర లభించగా, ఈ ఏడాది కేవలం రూ.26 వేలు మాత్రమే లభించడం ఈ ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. మార్కెట్‌ సానుకూలంగా ఉంటుందని రైతులను పొగాకు బోర్డు అధికారులు మభ్యపెట్టారన్నారు. ‘‘ఈ రోజు నేను పర్యటనకు వస్తున్నందున రూ.28 వేల అత్యధిక ధర ఇచ్చారు. అదేవిధంగా ప్రతిరోజు ధరలు కల్పించాలి.’’ అని డిమాండ్‌ చేశారు. మిర్చి రైతులను ఆదుకోవడంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. రూ.11,700లకు మిర్చిని కొనుగోలు చేస్తామని చెప్పిన చంద్రబాబు మాటతప్పారన్నారు.

క్వింటాళ్లకు, కిలోలకు తేడా తెలీదా!

గణాంకాలు వివరించడంలో జగన్‌ గజిబిజి అయ్యారు. పొగాకు క్వింటాకు రూ.36,600 తన ప్రభుత్వంలో దక్కిందని చెప్పే సందర్భంలో తడబడి కేజీ రూ.36,600లు పలికిందన్నారు. ఈ ఏడాది పొగాకు బోర్డు అధికారికంగా 11 మిలియన్‌ కిలోల పొగాకు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించగా 220 మిలియన్‌ క్వింటాళ్లు పండించారంటూ మాట్లాడటం ఆయన అవగాహన లేమిని వెల్లడించింది. తమ ప్రభుత్వంలో రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటుచేసి కేంద్రం ప్రకటించిన పంట ఉత్పత్తులనే కాకుండా టమోటా, పసుపు, మిర్చికి మద్దతు ధర ఇచ్చానని చెప్పడం రైతులను అసహనానికి గురిచేసింది. కింటాళ్లకు, కిలోలకు తేడా తెలియకుండా జగన్‌ మాట్లాడారని రైతన్నలు పెదవి విరిచారు.

Updated Date - Jun 12 , 2025 | 04:27 AM