Jagan Legal Trouble: ఇక బ్రదర్ జగన్ వంతేనా
ABN , Publish Date - May 07 , 2025 | 03:48 AM
గాలి జనార్దనరెడ్డి కేసులో 7 సంవత్సరాల కఠిన శిక్ష పడినప్పటికీ, జగన్పై 11 సీబీఐ కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. 43 వేల కోట్ల అక్రమాలకు సంబంధించి సీబీఐ, ఈడీ విచారణ కొనసాగుతుంది

గాలికి శిక్షతో సర్వత్రా ఇదే చర్చ.. ఒక్క కేసులోనే జనార్దన్రెడ్డికి ఏడేళ్ల కఠిన శిక్ష
జగన్పై 11 సీబీఐ కేసులు.. 12 ఏళ్లుగా సీబీఐ కోర్టులో పెండింగ్.. అదే కోర్టులో ఇప్పుడు
గాలికి దండన.. వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన గాలి
జగన్ తన బ్రదర్ అంటూ అప్పట్లో వ్యాఖ్యలు
సోదరబంధంతోపాటు అక్రమ వ్యాపార బంధమూ!
త్వరలో అదీ బయటపడుతుందంటున్న న్యాయ నిపుణులు
నేతలపై కేసుల్లో విచారణ వేగవంతానికి సుప్రీం ఆదేశం
గాలి కేసును పర్యవేక్షించిన సర్వోన్నత న్యాయస్థానం
ట్రయల్ పూర్తయితే జనార్దన్ చెంతకే జగన్!
ఎంతటి రాజకీయ బలశాలి అయినా, ఎంత పెద్ద కార్పొరేట్ సామ్రాట్ అయినా, అధికార మదంతో ఎంతగా విర్రవీగినా.. సమయం వచ్చినప్పుడు వారందరినీ ధర్మరథ చక్రాలు నలిపేస్తాయనేందుకు గాలి జనార్దనరెడ్డి కేసే నిదర్శనం. వ్యవస్థలను దుర్వినియోగం చేస్తే ఏమవుతుందో గాలి కేసులో నిరూపించిన న్యాయస్థానంలోనే జగన్పై 11 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసుల్లో సగం రుజువైనా జగన్ రాజకీయ జీవితానికి శాశ్వతంగా తెర పడినట్టేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గాలి కేసును సుప్రీంకోర్టు నేరుగా పర్యవేక్షించింది. ప్రజాప్రతినిధులపై కేసులను వేగంగా పరిష్కరించాలంటూ ఇప్పటికే అనేకసార్లు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఇదంతా గమనిస్తున్నవారు... తర్వాత జగన్ వంతేనా....అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
(అమరావతి- ఆంధ్రజ్యోతి)
మాజీ సీఎం జగన్ను తన బ్రదర్గా చెప్పుకొన్న కర్ణాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డికి ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో ఏపీ రాజకీయాల్లో కలకలం మొదలైంది. ఒక్క కేసులోనే గాలికి ఏడేళ్ల కఠినశిక్ష పడితే.. 11కేసుల్లో నిందితుడైన జగన్కు ఇంకెన్నేళ్లు శిక్ష పడుతుందోనంటూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఏపీ, కర్ణాటక సరిహద్దులోని ఓబుళాపురం మైనింగ్ కేసులో 884 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు సీబీఐ తేల్చిన కేసులో ఇంత శిక్ష పడింది. అయితే జగన్ ఏకంగా రూ.43వేల కోట్ల విలువైన అక్రమాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ లెక్కన ఆయనపై నేరాలు రుజువైతే జీవితకాలం జైలు పాలే.. అనే చర్చ బలంగా జరుగుతోంది. ఉమ్మడి ఏపీ సీఎంగా వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉన్నప్పుడు గాలి జనార్దనరెడ్డి ఒక వెలుగు వెలిగారు. జగన్ను బ్రదర్ అని సంబోధిస్తూ వైఎస్ హయాంలో తన వ్యాపార విస్తరణకు అడ్డదారులు తొక్కారు. ఆయనకు అప్పట్లో 69 హెక్టార్ల భూమి అనంతపురం జిల్లాలో కేటాయించారు. కడప జిల్లాలో స్టీలు ప్లాంటు ఏర్పాటు పేరుతో పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందించారు. ఈ వ్యవహారంలోనే గాలికి సీబీఐ శిక్ష వేయించింది. ఈ కేసులో జగన్ను నేరుగా ప్రాసిక్యూట్ చేయలేదు. కానీ, గాలిని దండించిన సీబీఐ కోర్టులోనే జగన్ కేసులు ఉన్నాయి.
నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కంపెనీలతో క్విడ్ ప్రో కో ఒప్పందాలను జగన్ కుదుర్చుకున్నారనేది ప్రధాన అభియోగం. భూములు, మైనింగ్ లీజులు, అడ్డగోలు అనుమతుల ద్వారా రాజశేఖరరెడ్డి హయాంలో లబ్ధి పొందిన సంస్థలు ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లో వేల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టాయని సీబీఐ నిగ్గుతేల్చింది. ఈ వ్యవహారంలో జగన్ దురాశకు సహకరించిన ఆరోపణలపై అప్పట్లో ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది ఐఏఎస్లను సైతం సీబీఐ నిందితుల జాబితాలో చేర్చింది. జగన్ పై సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లలో 43వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్టు తేల్చింది. వాటి ఆధారంగా ఈడీ నమోదు చేసిన మరో ఆరు మనీలాండరింగ్ కేసులు సైతం విచారణలో ఉన్నాయి. 2012 మే చివరి వారంలో జగన్ పదహారు నెలల (2013సెప్టెంబరు దాకా) పాటు జైలు పాలవ్వడానికి కారణమైన ఈ కేసుల్లో తీర్పు వెలువడితే పదహారేళ్లకు పైగా జైలుకే అంకితమయ్యే అవకాశం ఉందనే వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి.
గాలి కేసులో తీర్పు.. జగన్ కేసుల్లో మలుపు
అధికారాన్ని అడ్డంపెట్టుకొని దోచుకోవడంలోగాలి జనార్దనరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక తరహా వ్యక్తులని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. వైఎస్ ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఈ ఇద్దరి మధ్య వ్యాపార, ఇతర అక్రమ లావాదేవీల సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని జైలు పాలైన రాజకీయ నాయకులు దేశంలో చాలా మందే ఉన్నారు. కానీ వారంతా ఒకటో, రెండో కేసుల్లో మాత్రమే జైలుపాలై రాజకీయ జీవితానికి స్వీయ సమాధి కట్టేసుకున్నారు. జగన్ తరహాలో ఏకంగా 11 అక్రమాస్తుల కేసులు, ఆరు మనీ లాండరింగ్ కేసులు, మొత్తం 38కేసుల్లో నిందితుడిగా ఉన్న నేత దేశంలోనే మరెవరూ కనిపించరు. 2011 ఆగస్టు 10న హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంతో ఆగస్టు 17న జగన్పై కేసు నమోదైంది. నేరపూరిత కుట్ర, మోసం, నేరపూరిత నమ్మక ద్రోహం, లెక్కలు తారుమారు చేయడం, క్రిమినల్ మిస్ కండక్ట్తో పాటు అవినీతి నిరోధక చట్టాల కింద ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదయింది. జగన్తోపాటు మాజీ ఎంపీ వి.విజయసాయి రెడ్డిని ఈ కేసులో ప్రధాన నిందితునిగా సీబీఐ పేర్కొంది. ఆ తర్వాత దర్యాప్తులో మొత్తం 71మందిని ఈ కేసుల్లో చేర్చింది. వాన్పిక్కు భూముల కేటాయింపు కేసులో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను అరెస్టుచేసి అప్పట్లో జైల్లో పెట్టింది. 2012మే చివరి వారంలో అరెస్టై పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్, ఆ తర్వాత నుంచి బెయిల్ మీద బయటే ఉన్నారు. పన్నెండేళ్లుగా ఈ కేసుల విచారణ కొనసాగుతూనే ఉంది.
ఈడీ కేసులు...
1. పెన్నా గ్రూప్
2. ఇందూ టెక్ జోన్
3. ఇండియా సిమెంట్స్
4. రాంకీ ఇన్వెస్టిమెంట్స్
5. హెటిరో అరబిందో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్
6. జగతి పబ్లికేషన్స్
ఈ వార్తలు కూడా చదవండి..
PAN Card: పాన్ కార్డులో ఎవరికైనా తండ్రి పేరే ఉంటుంది.. ఎందుకో తెలుసా..
Security Mock Drill: హైదరాబాద్లోని ఆ నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్.. ఎప్పుడంటే..
India - Pakistan war: యుద్ధానికి సిద్ధమా.. తర్వాత పరిస్థితి ఏమిటి
Minister Satya Kumar: వైద్యులపై హెల్త్ మినిస్టర్కు ఫిర్యాదు.. విచారణకు ఆదేశం
CM Chandrababu: ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్
For Andhrapradesh News And Telugu News