Rains: రెండ్రోజులపాటు భారీ వర్షాలు
ABN , Publish Date - Jun 10 , 2025 | 08:05 PM
బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

అమరావతి, జూన్ 10: ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ వెల్లడించింది. వాయువ్య ఉత్తర్ ప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ ఉత్తర మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్గఢ్.. మధ్య ఒడిశా మీదుగా సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో బుధ, గురువారాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అలాగే గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. ఈ మేరకు హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర ప్రజలు నిలబడవద్దని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోతతోపాటు ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పింది. ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. రేపు అంటే.. బుధవారం నాడు విజయనగరం, పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో 40 నుంచి 41 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందంది.
ఇక రానున్న మూడు రోజులు వాతావరణం కింది విధంగా ఉండనుందని వివరించింది..
జూన్ 11, బుధవారం:
ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
జూన్ 12, గురువారం:
నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
జూన్ 13, శుక్రవారం:
తూర్పుగోదావరి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురవచ్చు.
మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి మన్యం జిల్లా సాలూరులో 43 మి.మీ., శ్రీకాకుళంలో 42.7 మి.మీ., విశాఖ జిల్లా ఆనందపురంలో 37.5 మి.మీ. వర్షపాతం రికార్డు అయ్యింది.
ప్రకాశం జిల్లా వేమవరంలో 40, కొనకనమిట్లలో 39.9, తిరుపతి జిల్లా మంగ నెల్లూరు 39.9, కడప జిల్లా ఎర్రగుంట్లలో 39.8 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ తెలిపింది.
ఇవి కూడా చదవండి
కొమ్మినేని రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు..
ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్లీ హాట్ కామెంట్స్
Read latest AP News And Telugu News