AP Weather: భానుడి సెగలు.. వడగాడ్పులు
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:48 AM
రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలతో ఎండ తీవ్రత కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు మరియు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

బలహీనంగా రుతుపవనాలు
వరుసగా రెండో రోజూ జంగమహేశ్వరపురంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత
విశాఖపట్నం, అమరావతి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): పడమర గాలులతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్నిచోట్ల వడగాడ్పులు వీచాయి. రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో ఎక్కువ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంది. జంగమహేశ్వరపురంలో వరుసగా రెండో రోజూ 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల మాత్రం ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, మంగళవారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రతతో ఉక్కపోతగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 39-40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతతో ఉక్కపోతగా ఉంటుందని పేర్కొంది. మన్యం, అల్లూరి, కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వివరించింది.