AP Secretariat: ఆగస్ట్ 10 నుంచి ఏపీ సచివాలయంలో నో ప్లాస్టిక్ బాటిల్స్..
ABN , Publish Date - Aug 01 , 2025 | 04:00 PM
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ఆగస్ట్ 10 నుంచి ప్లాస్టిక్ బాటిళ్ల నిషేధాన్ని విధించింది. ఒక్కో స్టీల్ వాటర్ బాటిల్ సచివాలయంలోని ఉద్యోగులందరికీ ఇస్తామని ప్రకటించింది.

అమరావతి: ప్లాస్టిక్ అనేది మానవాళి జీవితంలో భాగమైందని అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు, చర్యలు తీసుకున్నా జనాలు ప్లాస్టిక్ వాడటం మాత్రం మానడం లేదు. దానికి కారణం మనం ప్లాస్టిక్కు అలవాటు పడిపోవడమే. అయితే.. ఈ ప్లాస్టిక్ నిషేధంపై ఏపీ ప్రభుత్వం తనదైన రీతిలో కొత్త కార్యచరణ మొదలుపెట్టింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న తీరులో ప్లాస్టిక్ నిషేధాన్ని ఏపీ సచివాలయం నుంచి మొదలుపెట్టనుంది.
ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ఆగస్ట్ 10 నుంచి ప్లాస్టిక్ బాటిళ్ల నిషేధాన్ని విధించింది. ఒక్కో స్టీల్ వాటర్ బాటిల్ సచివాలయంలోని ఉద్యోగులందరికీ ఇస్తామని ప్రకటించింది. అన్ని శాఖలకు రీ యూజబుల్ బాటిళ్లు అందిస్తామని తెలిపింది. సచివాలయానికి ఎవరు కూడా బయట నుంచి వాటర్ బాటిళ్లు తేకూడదని స్పష్టం చేసింది.
గతంలో సీఎం చంద్రబాబు సే నో టు ప్లాస్టిక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏపీలోని ముఖ్య నగరాలను ప్లాస్టిక్ రహితంగా మార్చాలన్నది. అయితే ఈ కార్యక్రమం పూర్తిగా కార్యరూపం దాల్చకపోవడంతో సే నో టు ప్లాస్టిక్ అనేది కేవలం నినాదంగానే మిగిలిపోయింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిర్మూలించాలన్న ఆదేశాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. కాగా, ఏపీ సచివాలయంలో ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం చూస్తుంటే మరోసారి ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధాన్ని సీరియస్ గా తీసుకుందని తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కోవూరులో ఉద్రిక్తత.. క్షమాపణలు చెప్పాలంటూ మహిళల డిమాండ్