Palla Simhachalam Demised: పల్లా శ్రీనివాస్కు పితృవియోగం
ABN , Publish Date - Jun 08 , 2025 | 04:55 AM
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (86) శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన స్థానిక రాజేంద్రనగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

మాజీ ఎమ్మెల్యే సింహాచలం కన్నుమూత
పల్లాకు చంద్రబాబు, పవన్, లోకేశ్ పరామర్శ
విశాఖపట్నం/అమరావతి, జూన్ 7(ఆంధ్రజ్యోతి): టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (86) శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన స్థానిక రాజేంద్రనగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సింహాచలంకు భార్య మహాలక్ష్మి, కుమారులు శంకరరావు, శ్రీనివాసరావు, కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. వీరిలో రెండో కుమారుడైన శ్రీనివాసరావు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, గాజువాక ఎమ్మెల్యేగా ఉన్నారు. గాజువాకకు చెందిన పల్లా సింహాచలం కార్మిక నాయకుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత 1974లో గాజువాక సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆ పదవిలో చాలాకాలం కొనసాగారు. 1985 ప్రాంతంలో టీడీపీలో చేరారు. 1994 ఎన్నికల్లో విశాఖపట్నం-2 నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సింహాచలం అంత్యక్రియలు ఆదివారం గాజువాకలో నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
పల్లాకు ఫోన్లో పరామర్శ
సింహాచలం మృతి విషయం తెలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రి లోకేశ్ పల్లా శ్రీనివాసరావును ఫోన్లో పరామర్శించారు. కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. విశాఖపట్నం-2 నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేగా ఆయన చాలా కృషి చేశారని సీఎం కొనియాడారు. సింహాచలం దశాబ్దాలుగా పార్టీకి సేవలందించారని లోకేశ్ పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతాపం తెలిపారు.