Vijayawada:పెళ్లయిన ఆమెకు మళ్లీ పెళ్లి
ABN , Publish Date - Jun 16 , 2025 | 03:59 AM
ఆమెను ‘అద్దె’కు తెచ్చి ఆయనకు ముడేశారు. అప్పటికే పెళ్లయి ఐదేళ్ల కుమారుడు ఉన్న ఆమెకు డబ్బు ఆశ చూపించి మరో మూడు ముళ్లు వేయించారు. అయితే, ‘నన్ను నా పుట్టింటికి పంపండి’ అని ఆమె పదేపదే అడుగుతుండటంతో...

పెళ్లికుమారుడికి బ్రోకర్ల టోకరా
రూ.3.50 లక్షలు లాగేశారు
ఒక కొడుకు ఉన్న ఆమెకు డబ్బాశ చూపి మూడు ముళ్లు వేయించిన వైనం
బెజవాడలో ముగ్గురి అరెస్టు.. ఒకరు పరార్
విజయవాడ, జూన్ 15(ఆంధ్రజ్యోతి): ఆమెను ‘అద్దె’కు తెచ్చి ఆయనకు ముడేశారు. అప్పటికే పెళ్లయి ఐదేళ్ల కుమారుడు ఉన్న ఆమెకు డబ్బు ఆశ చూపించి మరో మూడు ముళ్లు వేయించారు. అయితే, ‘నన్ను నా పుట్టింటికి పంపండి’ అని ఆమె పదేపదే అడుగుతుండటంతో అనుమానం వచ్చి పెళ్లికుమారుడు నిలదీస్తే అసలు గుట్టు బయటపెట్టింది. దీంతో అవాక్కయిన అబ్బాయి కుటుంబం విజయవాడ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. ఆయన పేరు దుర్గాప్రసాద్. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు చెందిన ఈయనకు పెళ్లి వయస్సు వచ్చింది. ఏ సంబంధం వచ్చినా కుదరట్లేదు. ఎంతోమంది అమ్మాయిలను చూశాడు. వాళ్లందరూ దుర్గాప్రసాద్కు నచ్చినా ఆయన మాత్రం వాళ్లకు నచ్చలేదు. పెళ్లి వయస్సు దాటిపోవడంతో తనకు సంబంధం చూడమని రాయచూర్కు చెందిన శ్రీదేవి అనే మహిళకు ఆయన చెప్పారు. ఆమె రాజమహేంద్రవరానికి చెందిన తాయారు అనే పెళ్లిళ్ల బ్రోకర్కు విషయం చెప్పింది. విజయవాడకు చెందిన ఆటోడ్రైవర్ మురార్జీ అనే వ్యక్తికి తాయారు విషయం తెలియజేసింది. మురార్జీ ఆటోడ్రైవర్గా పనిచేస్తూనే పెళ్లిళ్ల బ్రోకర్గా వ్యవహరిస్తున్నాడు.
అతడు తనకు పరిచయమున్న విజయవాడ వాంబేకాలనీలోని షాలిని, భవాని అనే మరో ఇద్దరికి చెప్పాడు. వీరంతా కలిసి గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఆమని అనే మహిళను ఎంపిక చేశారు. ఆమెకు కొన్నాళ్ల క్రితం వివాహమైంది. భర్త ఎటో పోయాడు. ఐదేళ్ల కుమారుడితో ఆమని ఉంటోంది. డబ్బు ఆశ చూపి ఆమెను పెళ్లికూతురులా తయారుచేశారు. ‘కొన్నిరోజులు కాపురం చేసి వచ్చేయ్.. రూ.పది వేలు ఇస్తాం’ అని చెప్పి ఆమనిని బ్రోకర్లు ఒప్పించారు. రూ.50 వేలు ఖర్చుల కింద దుర్గాప్రసాద్ నుంచి ఫోన్పే చేయించుకున్నారు. ఈనెల5న పెళ్లి చేసి ఆమనిని ఆయన వెంట కర్ణాటకకు పంపించారు. పెళ్లి ఖర్చుల కింద రూ.3 లక్షలు బ్రోకర్లు లాగేశారు. కాపురానికి వెళ్లాక పుట్టింటికి రావడానికి ఆమె ప్రయత్నించింది. ప్రతిసారీ ‘నేనూ తోడు వస్తాడు’అనిదుర్గాప్రసాద్ అని అంటుండటంతో ఆమని అసలునిజం చెప్పేసింది. దుర్గాప్రసాద్ విజయవాడకు చేరుకుని మధ్యవర్తులను నిలదీ యగా, వారు తమ మోసాన్నిఅంగీకరించారు. దీంతో దుర్గాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమని సహా ముగ్గురిని పోలీసులు అరెస్టుచేశారు.