Liquor Scam: మద్యం స్కామ్పై ఈడీ కేసు
ABN , Publish Date - May 09 , 2025 | 03:49 AM
వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కాం కేసులో ఈడీ రంగంలోకి దిగింది. దుబాయ్, ఆఫ్రికాకు హవాలా మార్గంలో డబ్బులు వెళ్లినట్లు గుర్తించి షెల్ కంపెనీల గుట్టును ఛేదించేందుకు కేంద్ర సంస్థ సిద్ధమవుతోంది

హవాలా గుట్టు తేల్చేందుకు రంగంలోకి..
అప్పట్లో దుబాయ్, ఆఫ్రికాకు సొమ్ములు
షెల్ కంపెనీల్లోకి భారీగా డబ్బు మళ్లింపు
వీటన్నింటి ‘లెక్క’ తేల్చనున్న కేంద్ర సంస్థ
కేసును వేగంగా ఛేదిస్తున్న సిట్
33 మందిని నిందితులుగా తేల్చిన వైనం
మద్యం కేసు వివరాలివ్వాలంటూ సిట్కు ఈడీ రహస్య లేఖ
సంచలన చర్యలకు రంగం సిద్ధం!
తాడేపల్లి ప్యాలెస్కు ఇక వణుకే
అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన రూ. వేల కోట్ల మద్యం ముడుపుల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో హవాలా ఆర్థిక లావాదేవీల మూలాలను వెలికితీయడం కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. 33 మందిని నిందితులుగా చేరుస్తూ హైదరాబాద్లో కేసు నమోదుచేసింది. ఢిల్లీ మద్యం స్కామ్నూ మించిపోయిన ఈ దందాలో డబ్బులను హవాలా మార్గంలో దుబాయ్, ఆఫ్రికాకు తరలించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిపై ఈడీ లోతుగా దృష్టి సారించనుంది. దీంతో లిక్కర్ స్కామ్ పాత్రధారులు, సూత్రధారులందరికీ ఉచ్చు బిగిసినట్టేనని భావిస్తున్నారు. ఈ పరిణామాలు తాడేపల్లి ప్యాలెస్ను వణికిస్తున్నాయి. స్కామ్ వివరాలు ఇవ్వాలంటూ ఈ నెల 6న విజయవాడ పోలీస్ కమిషనర్(లిక్కర్ కేసు సిట్ చీఫ్)కు ఈడీ అధికారులు రహస్య లేఖ రాశారు.
సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది సెప్టెంబరు 23న నమోదు చేసిన ఎఫ్ఐఆర్తో(21/2024)పాటు ఇప్పటి వరకూ దర్యాప్తులో గుర్తించిన వివరాలు, నిందితుల బ్యాంకు అకౌంట్లు, ఆస్తుల వివరాలు, రిమాండ్ రిపోర్టులు, చార్జిషీట్లు(ఫైల్ చేసి ఉంటే), కుంభకోణానికి సంబంధించిన అదనపు డాక్యుమెంట్లు, సమాచారం ఏది ఉన్నా ఇవ్వాలని కోరారు. మనీలాండరింగ్ చట్టం కింద తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయబోతున్నామని లేఖలో ఈడీ పేర్కొంది. జగన్ హయాంలో(2019-24) ప్రభుత్వ మద్యం షాపుల్లో రూ.99వేల కోట్ల మద్యం విక్రయాలు జరిగితే రూ.690కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరగాయి. రూ.20,356 కోట్ల విలువైన మద్యం విక్రయాలను గోప్యంగా ఉంచారు. దీనిపై అందిన ఫిర్యాదులు ఈడీ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈడీ లేఖపై సిట్ వెంటనే స్పందించి కేసు డాక్యుమెంట్లు పంపింది.
ప్రతి అక్రమ లావాదేవీపైనా ఆరా..
మద్యం కుంభకోణంపై విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలను ఈడీ పరిశీలిస్తోంది. మరోవైపు ఈ స్కామ్పై కేంద్ర హోం మంత్రి అమిత్షాకు టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు చేసిన ఫిర్యాదులోని అంశాలను కూడా అధ్యయనం చేస్తోంది. ప్రతి నెలా రూ.60 కోట్ల చొప్పున వసూలు చేసిన మద్యం ముడుపులు ఎవరికి చేరాయి.. ఆ డబ్బును వైట్ మనీగా మార్చేందుకు ఎంచుకున్న అక్రమ మార్గాలు.. 2019 తర్వాత పుట్టుకొచ్చి 2024లో మూతబడిన షెల్ కంపెనీలు.. డిస్టిలరీస్ కొనుగోలు చేసిన వందల కిలోల బంగారం.. అట్టపెట్టెలు, రెడీమేడ్ దుస్తులు కొన్నట్లు చూపించిన బిల్లులు.. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోకి చేరి లాభాలు చూపించిన తీరు..ఏపీలో ఒక సిమెంటు కంపెనీకి చేరిన డబ్బులు.. ఇలా ప్రతి లావాదేవీనీ ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.
తప్పించుకోలేరు..
నిజానికి ఇప్పటికే లిక్కర్ మాఫియా అక్రమాలన్నీ సిట్ దాదాపుగా తేల్చేసింది. 2019లో మద్యం పాలసీ రూపకల్పన నుంచి ఉత్పత్తి, సరఫరా, విక్రయాలతోపాటు ముడుపులు అందుకున్న వైనాన్ని పసిగట్టింది. పాలసీ రూపొందించినప్పటి నుంచి వేల కోట్ల రూపాయల వసూళ్ల వరకూ ప్రతి అడుగులోనూ చక్రం తిప్పిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి(రాజ్ కసిరెడ్డి)తో పాటు 33మందిని నిందితులుగా చేర్చింది. ముడుపులిచ్చుకున్న మద్యం వ్యాపారుల నుంచి నోట్ల మూటలు తీసుకుని గమ్యానికి చేర్చిన వ్యక్తుల వరకూ పలువురిని విచారించింది. రాజ్ కసిరెడ్డితోపాటు ఐదుగురిని అరెస్టు చేసింది. వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, ఓఎస్డీ సత్యప్రసాద్ తదితరుల వాంగ్మూలాలు నమోదు చేసింది. రాజ్ కసిరెడ్డి అనుచరులు ఇచ్చిన సమాచారంతో అంతిమ లబ్ధిదారు ఎవరో నిర్ధారణకు వచ్చింది. నాడు సీఎంవోలో ఐదేళ్లు చక్రం తిప్పిన సీఎం కార్యదర్శి ధనుంజయ్రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డిలను విచారించి అత్యంత కీలక గుట్టును తీయబోతోంది. ఈ నేపథ్యంలో ఈడీ కూడా రంగంలోకి దిగడంతో సూత్రధారులు ఇక తప్పించుకోలేరని భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో.. రూరల్ టూరిజం ప్రమోట్..
ఆపరేషన్ సిందూర్పై చైనా, అమెరికా స్పందన
For More AP News and Telugu News