CM Chandrababu On Pensions: పెన్షన్పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ABN , Publish Date - May 31 , 2025 | 02:44 PM
CM Chandrababu On Pensions: ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం పేదలకు కనీవినీ ఎరుగని రీతిలో సేవ చేసిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రూ.34 వేల కోట్లు పింఛన్ల కోసం ఇచ్చామని తెలిపారు. దేశంలో ఎక్కడా తమ ప్రభుత్వం ఇచ్చినట్లు పెన్షన్లు ఇవ్వడం లేదని అన్నారు.

కోనసీమ,మే 31: జిల్లాలోని చెయ్యేరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పర్యటన కొనసాగుతోంది. కాట్రేనికోన మండంలం చెయ్యేరులో లబ్దిదారులకు సీఎం పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఒక రోజు ముందుగానే రాష్ట్రంలో పెన్షన్లు పంపిణీ చేశామని.. ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లోనే పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. ఇదీ.. పేదల కోసం ప్రభుత్వం పనిచేసే తీరు అని చెప్పుకొచ్చారు. హామీ ఇచ్చిన ప్రకారం అధికారంలోకి రాగానే పెన్షన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచామని అన్నారు. 64 లక్షల మందికి ప్రతినెల 1వ తేదీనే పెన్షన్లు అందిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే 90 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి అయినట్లు వెల్లడించారు. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం పేదలకు కనీవినీ ఎరుగని రీతిలో సహాయం చేసిందన్నారు. రూ.34 వేల కోట్లు పింఛన్ల కోసం ఇచ్చామని తెలిపారు. దేశంలో ఎక్కడా తమ ప్రభుత్వం ఇచ్చినట్లు పెన్షన్లు ఇవ్వడం లేదని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పేదల కోసం ఆలోచించాలన్నారు. భగవంతుడు కనికరిస్తే భవిష్యత్తులో పింఛన్లు పెంచుతామని ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వం వితంతు పింఛన్లు ఇవ్వలేదని.. తాము వచ్చాక 71,380 మందికి పెన్షన్ ఇచ్చామన్నారు. ధనిక రాష్ట్రం మహారాష్ట్రలో పెన్షన్ రూ. 1000, తెలంగాణలో రూ.2500 మాత్రమే పింఛన్లు ఇస్తున్నారన్నారు.
అధిక పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీ అని తెలిపారు. 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే అవకాశం ఇచ్చామన్నారు. మెగా డీఎస్సీతో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఉద్యోగం చేస్తున్నారని తెలిపారు. ఉచిత సిలెండర్ల కోసం నాలుగు నెలలకోసారి అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. రూ.1200 కోట్లతో రాష్ట్రంలో రోడ్లు రిపేర్ చేశామన్నారు. 203 అన్నా క్యాంటీన్లో భోజనం అందిస్తున్నామన్నారు. రూ.1674 కోట్లు పాత ధాన్యం బకాయిలు చెల్లించామని తెలిపారు. నియోజకవర్గంలో 10 వేల సోలార్ కనెక్షన్లు ఏర్పాటు చేయకపోతే ఎమ్మెల్యే పవర్ కట్ చేస్తామని హెచ్చరించారు.
గంజాయి, డ్రగ్స్ చాలా ప్రమాదకరమన్నారు. వైసీపీ ప్రభుత్వంలో విచ్చల విడిగా లభ్యమయ్యాయని మండిపడ్డారు. శాటిలైట్ డ్రోన్స్ ద్వారా గంజాయి నిర్మూలన చేస్తున్నామన్నారు. స్కూళ్లు తెరిచేలోగా ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు. దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోయిందని.. రాష్ట్రంలో జనాభా పెరగాలన్నారు. జూన్ నుంచి అన్నదాత సుఖీభవ అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. కడప మహానాడులో తన జీవితంలో చూడని స్పందన చూశానని అన్నారు. ఎప్పటికీ ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే బాధ్యత ప్రజలదే అని చెప్పారు. మరో రెండు నెలల్లో అన్ని ప్రభుత్వ సేవలు వాట్సాప్ గవర్నెన్స్లో అందుబాటులోకి వస్తాయన్నారు.
కోనసీమలో 1996 తుఫాన్ బీభత్స రోజులను గుర్తు చేసుకున్న సీఎం.. నాడు తాను స్వయంగా చేపట్టిన సహాయక చర్యల గురించి వివరించారు. అందరికీ సామాజిక న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ చేస్తామని.. భవిష్యత్తులో జిల్లాల స్థాయిలోనూ రిజర్వేషన్లు ఉంటాయన్నారు. రాజకీయాలు చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. బాబాయి హత్యలోనూ రాజకీయం చేశారని... ఇప్పుడు కూడా అలాగే చేయాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. టీటీడీలో అరాచకాలు చేస్తూ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పాలని చూశారని.. టెక్నాలజీ వాడి తప్పులు బయటకు తీస్తామని వార్నింగ్ ఇచ్చారు.
రాయలసీమలో ఎన్నికలు వస్తే బాంబులు అడిగేవారని.. ఇప్పుడు ముఠాలు లేవన్నారు. కోనసీమలో అంబేద్కర్ విగ్రహాలను దెబ్బ తీస్తూ.. విగ్రహాల రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కోనసీమ అనంతపురం కంటే వెనుకబడిపోయిందని అన్నారు. త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. రేషన్ వాహనాల పేరుతో అరాచకం చేశారని మండిపడ్డ సీఎం.. జూన్ 1నుంచి రేషన్ షాపుల్లో బియ్యం సరఫరా చేయనున్నట్లు తెలిపారు. పేరుకు మాత్రమే డోర్ డెలివరీ అని.. ఆ బియ్యాన్ని అక్కడే తీసుకుని కాకినాడ పోర్టుకి ఎగుమతి చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో మాఫియా చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రానికి నేర చరితులు వచ్చారని.. దానికి రాజకీయ ముసుగు తొడిగారని వ్యాఖ్యలు చేశారు. ఆర్ధిక ఉగ్రవాదులు సమాజాన్ని అతలాకుతలం చేయాలని అనుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు
కలెక్టరేట్లో కరోనా.. ఐసోలేషన్కు ఉద్యోగులు
Read Latest AP News And Telugu News