Liquor Mafia in AP: మద్యంలో మరో లీల
ABN , Publish Date - May 23 , 2025 | 05:11 AM
32 వేల జీతం అందుకునే కాఫీషాప్ వర్కర్ పురుషోత్తం వరుణ్ కుమార్ ఐదేళ్లలో రూ.459 కోట్లకు పైగా అక్రమ సంపాదన చేశాడు. మద్యం మాఫియాలో ఉన్న పెద్దవారితో కలిసి చెత్త బ్రాండ్ల అమ్మకాలను నడిపించి, ప్రభుత్వం మారగానే పారిపోయాడు.

కాఫీ షాపు వర్కర్ ‘లిక్కర్ కథ’ ఇదీ
32 వేల జీతం.. 459 కోట్ల అక్రమార్జన!
అందులో అత్యధికం నాటి ప్రభుత్వ పెద్దలకే
ఎన్ఆర్ఐ డాక్టర్ ద్వారా మద్యం మాఫియాలో
లీలా డిస్టిలరీ్సలో చేరి.. ఏపీ ఇన్చార్జిగా ఎదిగి!
మాఫియా అండతో చెత్తబ్రాండ్ల అమ్మకాలు
ప్రభుత్వం మారగానే పరార్.. గాలిస్తున్న సిట్
ఒక కాఫీ షాపులో 32 వేల జీతానికి పనిచేసే యువకుడు ఐదేళ్లలో ఏకంగా రూ.459 కోట్లు సంపాదించాడు! ఇది కలా...సినిమా కథా... అనుకుంటున్నారా!? ఇవేవీ కాదు! జగన్ హయాంలో జరిగిన మద్యం ‘లీల’ల్లో ఇదీ ఒకటి. బాగా నడిచే ‘లీల డిస్టిలరీ్స’ను నాడు చెరబట్టారు. ఆ తర్వాత... తమ చెత్త బ్రాండ్ల ఉత్పత్తులకు దానిని కేరా్ఫగా మార్చారు. ఆ డిస్టిలరీస్ ఏపీ ఇన్చార్జిగా కాఫీషాప్ వర్కర్ను నియమించారు. అతని పేరే... పురుషోత్తం వరుణ్ కుమార్! ప్రస్తుతం అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఒక సాధారణ యువకుడిని తెరపైకి తెచ్చి... అతని ద్వారా వేలకోట్ల వ్యాపారం చేయించి... వందల కోట్లు ఆర్జించి... అందులో అత్యధికం తామే మింగేయడం! ఇది... లిక్కర్ స్కామ్లో మరో కోణం. ఇందుకు... హైదరాబాద్కు చెందిన పురుషోత్తం వరుణ్ కుమార్ అనే యువకుడిని వాడుకున్నారు. గత ప్రభుత్వంలో ఓ డిస్టిలరీ బాధ్యతలు అప్పగించడంతో అతను చెలరేగిపోయాడు. ఐదేళ్లలో వరుణ్ ఏకంగా రూ.459 కోట్లు ఆర్జించాడు. ఇందులో చాలా వరకూ అప్పటి అధికార పార్టీ పెద్దలకు, మద్యం మాఫియాకు చేరింది. వరుణ్ ప్రస్థానం హైదరాబాద్లోని బంజారాహిల్స్ నుంచి మొదలై పాండిచ్చేరి, గోవా మీదుగా ముంబై దాకా వెళ్లింది. అక్కడి నుంచి విదేశాలకు వెళ్లిపోయినట్లు అనధికారిక సమాచారం.
డాక్టర్ పరిచయంతో...
వరుణ్ 2016లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగాన్వేషణలో చతికిలపడి బంజారాహిల్స్లోని ఒక కాఫీ షాపులో రూ.32 వేల జీతానికి పనికి చేరాడు. అమెరికాలో స్థిరపడ్డ డాక్టర్ రమేశ్రెడ్డి అనే తెలుగు ఎన్ఆర్ఐ 2019 ఎన్నికలకు ముందు హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ వరుణ్ పరిచయమయ్యాడు. అమెరికా వెళ్లి లక్షలు సంపాదించే ఉద్యోగం చేయాలన్నది తన లక్ష్యమని వరుణ్ ఆయనకు చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత ఢిల్లీకి రమ్మంటూ రమేశ్రెడ్డి నుంచి ఫోన్ రావడంతో వరుణ్ వెళ్లాడు. అయితే ఒక మద్యం కంపెనీలో మంచి ఉద్యోగం ఉందంటూ డాక్టర్ ఆఫర్ చేశారు. అప్పటికి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వంలో మద్యం మాఫియాకు కమీషన్లు ఇవ్వలేక, వ్యాపారం సవ్యంగా చేసుకోలేక లీలా డిస్టిలరీస్ అనే కంపెనీ ఇబ్బంది పడుతోంది. దీన్ని లిక్కర్ మాఫియా స్వాధీనం చేసుకుంది. పాండిచ్చేరిలో లీలా డిస్టిలరీస్ ఉత్పత్తుల వ్యవహారాలు చూసుకునే ఉద్యోగంలో వరుణ్ను నియమించారు. అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో ఆ కంపెనీకి ఇన్చార్జిని చేశారు. అతడితో రూ.వందల కోట్ల విలువైన మద్యం వ్యాపారాలు చేయించారు. విజయవాడలోని అజిత్సింగ్ నగర్లో ఆఫీసు తెరిచారు. మద్యం ఉత్పత్తి నుంచి రిటైల్ విక్రయాల వరకూ మద్యం మాఫియా అన్నీ తమ చేతుల్లోకి తీసుకుంది. వారి సూచనలకు అనుగుణంగా పనిచేస్తూ లీలాస్ బ్రిలియంట్ బ్లెండ్ విస్కీ లాంటి కొన్ని చెత్త బ్రాండ్లను పంపిణీ చేశాడు. కమీషన్లు ఇచ్చేందుకు నిరాకరించిన పెరల్స్ డిస్టిలరీస్, బీవీఎస్ డిస్టిలరీ, ఇతర మద్యం ఉత్పత్తి సంస్థలు రాజ్ కసిరెడ్డి, ఇతర గ్యాంగ్ దెబ్బకు కుదేలయ్యాయి. కసిరెడ్డి సూచనల మేరకు వైసీపీ నాయకులకు కొంత అందజేసిన వరుణ్ మిగతా మొత్తాన్ని షెల్ కంపెనీల ద్వారా మళ్లించేశాడు. ఏపీలో మద్యం కుంభకోణంపై విచారణకు ఆదేశిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన వెంటనే వరుణ్ దేశం వదిలి పారిపోయాడు. అమెరికాలో స్థిర పడేందుకు వెళ్లాడా అనే కోణంలో సిట్ అధికారులు విచారించగా, దుబాయ్ వెళ్లినట్లు కొంత సమాచారం లభించింది. నిర్ధారణ కాకపోవడంతో టెక్నాలజీ సాయంతో అన్వేషించారు. వరుణ్ జాడ తెలియరాలేదు. అతడు క్షేమంగానే ఉన్నాడా... లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అమాయకుడి పేరు వాడేశారు...
గుంటూరుకు చెందిన ఒక మైనారిటీ యువకుడూ మద్యం మాఫియా వలలో పడి విలవిల్లాడుతున్నాడు. బీర్లు ఉత్పత్తి చేసే ఒక కంపెనీ నుంచి ఏపీ డీలర్షిప్ను ఆయన పేరుతో మాఫియా నడిపించింది. ఆయనకే తెలియకుండా ఆయన పేరు ఎక్కడెక్కడ అవసరమో అక్కడ వాడేశారు. ఏపీలో ఆ యువకుడి పేరుతో వందల కోట్ల బీర్ల వ్యాపారం చేసి... వచ్చిన సొమ్మును విదేశాలకు మనీలాండరింగ్ ద్వారా చేరవేసినట్లు సిట్ గుర్తించింది. ఈ విషయం చెప్పడంతో బాధితుడు గగ్గోలు పెడుతున్నట్లు తెలిసింది.