Share News

Coastal Afforestation Project: తీరానికి పచ్చతోరణం

ABN , Publish Date - Jun 03 , 2025 | 04:05 AM

కోస్తా తీరంలో 975 కిలోమీటర్లపాటు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రకృతి విపత్తులు, సునామీ, తుఫానుల నుంచి భూమిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నేతృత్వంలో మొక్కల పెంపకంతో సముద్ర తీరంలో పర్యావరణ సమతుల్యత సాధించడానికి ప్రణాళికలు రూపొందించారు.

Coastal Afforestation Project: తీరానికి పచ్చతోరణం

  • 975 కిలోమీటర్ల మేర సముద్ర తీరంలో వనాలు

  • ఉపాధి హామీ, అటవీ నిధులతో తీరం వెంబడి మొక్కల పెంపకం

  • బాపట్ల జిల్లా నుంచి మొదలు

  • ఎల్లుండి ప్రారంభించనున్న ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి

అమరావతి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): కోస్తా తీరంలో పర్యావరణ పరిరక్షణకు, భూమి కోతను నిరోధించేందుకు, సునామీ, తుఫానుల బారి నుంచి రక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ నేతృత్వంలోని అటవీ, గ్రామీణాభివృద్ధిశాఖల ఆధ్వర్యంలో సముద్రతీర ప్రాంతంలో హరిత వనాన్ని(గ్రీన్‌ కారిడార్‌) ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్రంలో 975 కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్న సముద్రతీర ప్రాంతం వెంబడి పలు రకాల మొక్కలను పెంచునున్నారు. తద్వారా ప్రకృతి విపత్తుల నుంచి భూమిని, సముద్ర తీర గ్రామాలను రక్షించనున్నారు. ఈ నెల 5న ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ సందర్భంగా సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ బాపట్ల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఐటీసీ భద్రాచలం సౌజన్యంతో బాపట్లలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు అటవీ శాఖ ద్వారా మొక్కలు పంపిణీ చేసి, ఉపాధి హామీ శ్రామికులతో వాటిని పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా పలు రకాల మొక్కలు పెంచుకునే వెసులుబాటు ఉండటంతో ఈ పథకాన్ని సముద్ర తీర ప్రాంతంలో విరివిగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ప్రతి 10 కిలోమీటర్లకు ఒక నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలు.. చెట్లుగా పెరిగే వరకు వాటిని సంరక్షించనున్నారు. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి అటవీశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలను సంసిద్ధం చేశారు. దీనికి సంబంధించి అటవీశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా చేపట్టేందుకు వ్యూహాలు రచించారు.


పర్యావరణ సమతుల్యత

మనరాష్ట్రానికి 975 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతం ఓ వరం. దీనిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ప్రకృతి విపత్తులు, తుఫానులు, సునామీల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. పర్యావరణ సమతుల్యం కూడా సాధించవచ్చని భావిస్తున్నారు. ఈ వనాల ద్వారా ఇసుక కోత నిరోధించడం, తుఫానులు, సునామీ, ఆటుపోట్లును తట్టుకునేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మొక్కల పెంపకం ద్వారా కార్బన్‌ డై ఆక్సైడ్‌ పీల్చుకుని వాతావరణ సమతుల్యం సాధించవచ్చని పేర్కొంటున్నారు. కోస్తా ప్రాంతంలోని మడ అడువులను మరింత విస్తరించడం ద్వారా తీరమంతా పచ్చతోరణంగా మారుతుందని భావిస్తున్నారు. అదేవిధంగా చేపలు, పక్షులు, పలు సముద్ర ఆధారిత జీవులకు ఆశ్రయం కల్పించినట్లువుతుందని పేర్కొంటున్నారు. చేపలు పెరగడం ద్వారా మత్స్యకారుల జీవనాధారం మరింత మెరుగవుతుందని భావిస్తున్నారు. ఎకో టూరిజం పెరిగి స్థానికులకు జీవనోపాధి కలుగుతుందని అంచనా వేశారు. తీరం వెంబడి ఏ ప్రాంతానికి అనువైన మొక్కలను ఆ ప్రాంతంలో పెంచనున్నారు. ఈ మొక్కల పెంపకంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజలను కూడా భాగస్వామం చేయనున్నారు.


ప్రాంతానికి అనువుగా మొక్కలు

సముద్ర తీర ప్రాంతంలో ఉప్పునీరు కారణంగా మొక్కలు బతికే అవకాశం తక్కువ. అయితే, ఆయా ప్రాంతాల్లో సముద్ర వాతావరణాన్ని తట్టుకుని బతికే మడ, సరుగుడు, జీడిమామిడి, కొబ్బరి, కోకో, సముద్రపు గడ్డి తదితర మొక్కలు నాటాలని నిర్ణయించారు. 10 కిలోమీటర్లకు ఒక నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఏ గ్రామపరిధిలో ఆ గ్రామ ఉపాధి శ్రామికులు పనిచేసేలా అవకాశం కల్పిస్తారు.

ఖర్చు తక్కువ-ప్రయోజనం ఎక్కువ

ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తన శాఖకు సంబంధించి తక్కువ నిధులతో ఎక్కువ ప్రయోజనం పొందేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి తీసుకున్న పలు సంస్కరణలు కూడా ఈ కోవలోకి వస్తాయి. తాజాగా పర్యావరణ సమతుల్యం కోసం మొక్కలు నాటి వాటి ఫలాలు అందుకోవడం ద్వారా 975 కిలో మీటర్ల సముద్రతీర ప్రాంత వాసులకు జీవనోపాధిగా ఈ పథకాన్ని తీర్చిదిద్దనున్నారు. కేంద్రనిధులను వినియోగించుకుని పేదలకు జీవనోపాధి కల్పించే ఈ ప్రాజెక్టుకు అటవీ,గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు రూపకల్పన చేస్తున్నారు.

Updated Date - Jun 03 , 2025 | 04:07 AM