Housewarming Ceremony: నేడు కుప్పంలో బాబు గృహప్రవేశం
ABN , Publish Date - May 25 , 2025 | 05:06 AM
మూడున్నర దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గ ప్రజల అభిమానంతో కూడిన సీఎం చంద్రబాబు, శివపురం గ్రామంలో కొత్త ఇంటి గృహప్రవేశం జరుపుకోబోతున్నారు. భువనేశ్వరి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, ఆదివారం కుటుంబసభ్యులతో కలిసి కొత్త ఇల్లు వద్ద గడుపుతున్నారు.

రోజంతా కొత్త ఇంటికే పరిమితం కానున్న సీఎం.. ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న భువనేశ్వరి
కుప్పం, మే 24(ఆంధ్రజ్యోతి): మూడున్నర దశాబ్దాలుగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదరిస్తున్నారు. వారికి మరింత చేరువయ్యేందుకు వీలుగా ఆయన అక్కడ ఇంటి నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం గ్రామ పరిధిలోని రెండు ఎకరాల స్థలంలో నిర్మించుకున్న గృహ ప్రవేశానికి ఆదివారం ముహూర్తంగా నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు వారం రోజుల నుంచి ముమ్మరంగా సాగుతున్నాయి. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆదివారం మధ్యాహ్నానికే కుప్పం చేరుకుని నూతనగృహం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మంత్రి లోకేశ్, బ్రాహ్మణి దంపతులు, కుమారుడు దేవాన్ష్తో కలసి కుప్పం చేరుకున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత సీఎం చంద్రబాబు కుప్పం చేరుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు, టీడీపీ శ్రేణులకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి.పార్టీనాయకులు సొంత కార్యంగా భావించి స్వయంగా వెళ్లి చంద్రబాబు తరఫున ప్రజలను ఆహ్వానించారు. ఆదివారంఉదయం టిఫిన్తోపాటు మధ్యాహ్నం సుమారు 30వేల మందికి విందు భోజనాలు సిద్ధం చేస్తున్నారు. గృహ ప్రవేశం పూర్తిగా ప్రైవేటు కార్యక్రమం కావడంతో ఇతరత్రా ఎటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు కానీ, ఆయన ఇతర కుటుంబ సభ్యులు కానీ పాల్గొనే అవకాశం లేదని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఆదివారం మొత్తం కుటుంబసభ్యులతో కలసి సొంత ఇంటిలోనే చంద్రబాబు బస చేస్తారని ఈవర్గాలు వెల్లడించాయి.