Share News

Ganga Jatara: చిత్తూరు గంగ జాతరకు తరాల చరిత్ర

ABN , Publish Date - May 11 , 2025 | 01:12 AM

ఏటా వైశాఖ మాసంలో చిత్తూరులో నిర్వహించే నడి వీధి గంగమ్మ జాతరకు తరాల చరిత్ర వుంది.భక్తులు ఎంతో నిష్టతో అమ్మవారికి పొంగళ్ళు పొంగించి అంబలిని నైవేద్యంగా సమర్పిస్తారు.జాతర చాటింపు వేశాక దూర ప్రాంతాలకు వెళ్లడం మానేస్తారు.

Ganga Jatara: చిత్తూరు గంగ జాతరకు తరాల చరిత్ర
చిత్తూరు బజారు వీధిలో గంగజాతర నిర్వహణకు ఏర్పాటు చేసిన చలువ పందిళ్ళు- నడివీధి గంగమ్మ మూలవర్లు

చిత్తూరు కల్చరల్‌, మే 10 (ఆంధ్రజ్యోతి) : ఏటా వైశాఖ మాసంలో చిత్తూరులో నిర్వహించే నడి వీధి గంగమ్మ జాతరకు తరాల చరిత్ర వుంది. భక్తులు ఎంతో నిష్టతో అమ్మవారికి పొంగళ్ళు పొంగించి అంబలిని నైవేద్యంగా సమర్పిస్తారు. జాతర చాటింపు వేశాక దూర ప్రాంతాలకు వెళ్లడం మానేస్తారు. పూర్వకాలంలో చిత్తూరు కుగ్రామంగా వున్నప్పుడు ఒక వేసవి కాలంలో అంటు వ్యాధులు ప్రబలి ప్రజలు అధిక సంఖ్యలో చనిపోయారు. అప్పటి గ్రామపెద్దలందరూ కలిసి ఇందుకు గ్రామ దేవత గంగమ్మ ఆగ్రహమే కారణమని భావించి జాతర నిర్వహణతో ఆమెను శాంతింపజేయాలని తీర్మానించారు. ఊరంతా వేపమండలు కట్టి, ఇంటింటా ముందర పసుపునీళ్లు కల్లాపు చల్లి రోజుకొక అలంకారంతో గంగమ్మకు ఆరు రోజుల పాటు పూజలు చేసి ఏడవ రోజు జాతర మహోత్సవం నిర్వహించారు. తరువాత అంటు రోగాలు నశించి , సమృద్ధిగా వర్షాలు కురవడంతో అప్పట్నుంచీ ఏటా మే నెలలో గంగజాతర నిర్వహిస్తున్నారు. తరాలుగా గంగజాతరను రెడ్డి, కరుణీకర్‌ సామాజికవర్గాలు నిర్వహిస్తుండగా, చాకలి, బెస్త, కుమ్మరి కులస్తులు మిరాశీదారులుగా వ్యవహరిస్తున్నారు. జాతర ఉత్సవాలను ప్రస్తుతం వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు కుటుంబ సభ్యులతో పాటు హేమంత్‌కుమార్‌ వంశస్థులు నిర్వహిస్తున్నారు. వైశాఖ మాసంలో చివరి మంగళవారం ముందు మంగళవారం చాటింపు కార్యక్రమం నిర్వహిస్తారు. నగరవాసులంతా ఇళ్ల ముందర వేపమండలు కట్టి రోజూ ఇంటి ముందర పసుపు నీళ్ళు కల్లాపు చల్లి అమ్మవారికి పొంగళ్ళు పెట్టి అంబలి నైవేద్యంగా సమర్పిస్తారు. చివరి రోజు అమ్మవారికి జంతుబలులిచ్చి, మహా కుంభంతో ఘనంగా జాతర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నగరంలో ప్రతి ఇల్లూ బంధువుల సందడితో పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. మరుసటి రోజు అమ్మవారిని మేళతాళాలతో ఊరేగిస్తూ కట్టమంచి చెరువులో జల ప్రవేశం చేయించడంతో జాతర ముగుస్తుంది.


గంగమ్మ ఊరేగింపులో వీపులకు కొక్కీలు గుచ్చుకుని క్రేన్ల ద్వారా పూలమాలలు సమర్పించే ఓం శక్తి భక్తుల విన్యాసాలు ఆకట్టుకుంటాయి.అలాగే గాన కచ్చేరి తదితర సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించనున్నాయి. గతంలో చిత్తూరులో నడి వీధి గంగజాతర బజారు వీధిలో మాత్రమే జరిగేది. రాన్రానూ గిరింపేట, కొంగారెడ్డిపల్లె, కట్టమంచి, మురకంబట్టు, సంతపేట, తేనెబండ, ప్రశాంత్‌ నగర్‌, మంగసముద్రం,ఎస్టేట్‌ ప్రాంతాల్లో ప్రజలు అమ్మవారి జాతరను నిర్వహించుకుంటున్నారు. ఈ నెల 13, 14తేదీల్లో నిర్వహించనున్న నడివీధి గంగమ్మ జాతరకు బజారు వీధిలో చలువ పందిళ్ళు ఏర్పాటు చేశారు.అమ్మవారికి భక్తితో సమర్పించే అంబళ్లు పోయడానికి దాదాపు 12పెనాలు ఏర్పాటు చేశారు.గంగజాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి మున్సిపల్‌, పోలీసు శాఖలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - May 11 , 2025 | 01:12 AM