Kalamkari: ‘కలంకారీ మోహన్’కు రాష్ట్రపతి అభినందన
ABN , Publish Date - Jun 30 , 2025 | 01:35 AM
కలంకారీ కళాకారుడిగా విశేష గుర్తింపు పొందిన తలిశెట్టి మోహన్, ఆయన మనవడు వేహాంత్ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందించారు.

శ్రీకాళహస్తి, ఆంధ్రజ్యోతి: కలంకారీ కళాకారుడిగా విశేష గుర్తింపు పొందిన తలిశెట్టి మోహన్, ఆయన మనవడు వేహాంత్ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందించారు. శ్రీకాళహస్తిలోని కంఠావీధికి చెందిన మోహన్ కలంకారీ చిత్రాలు రూపొందించడంలో ప్రసిద్ధులు. 2023లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కలంకారి విభాగంలో అవార్డు అందుకున్నారు. గత నెలలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వివిధ హస్తకళలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇందులో భాగంగా కలంకారిలో 50 మందికి మూడు రోజులు పాటు శిక్షణ ఇవ్వాలని మోహన్ను అధికారులు ఆహ్వానించారు. ఆయన మనవడు వేహాంత్ అమెరికాలో తల్లిదండ్రుల వద్ద ఉంటూ వారసత్వంగా ఈ కళలో ప్రావీణ్యం పొందాడు. చిన్నతనం నుంచే కలంకారీ చిత్రాలు గీయడంలో పట్టు సాధించాడు. ఆరో తరగతి చదువుతున్న ఈ బాలుడు అమెరికా నుంచి ఇటీవల ఇండియాకు వచ్చి తాతతోపాటు రాష్ట్రపతి భవన్లో జరిగిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈక్రమంలో శనివారం రాష్ట్రపతి భవన్లో అభినందన కార్యక్రమం జరిగింది. కలంకారీ శిక్షణ ఇచ్చిన మోహన్ను, బాల్యంలోనే ప్రతిభ చాటుతున్న వేహాంత్ను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అభినందించారు.