Teachers: టీచర్ల బదిలీల, పదోన్నతుల్లో అభ్యంతరాలు
ABN , Publish Date - May 30 , 2025 | 12:45 AM
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భాగంగా ఉత్పన్నమైన సమస్యలు, వాటి పరిష్కార వ్యవహారం గురువారం డీఈవో వరలక్ష్మి, ఫ్యాప్టో నాయకుల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది.

చిత్తూరు సెంట్రల్, మే 29 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భాగంగా ఉత్పన్నమైన సమస్యలు, వాటి పరిష్కార వ్యవహారం గురువారం డీఈవో వరలక్ష్మి, ఫ్యాప్టో నాయకుల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది.పాఠశాల విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఈనెల 21న టీచర్ల బదిలీలు, పదోన్నతులు ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు డీఈవో కార్యాలయం పక్కనే ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను నిర్వహిస్తున్నారు. హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్ల దరఖాస్తుల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ సందర్భంగా టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఫ్యాప్టో నాయకులు లేవనెత్తిన సమస్యల్లో చాలావరకూ డీఈవో వరలక్ష్మి పరిష్కరించారు.సర్వీసు అంశాలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సిన ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ తయారీ క్రమంలో ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీసు 33ఏ ప్రకారం ప్రస్తుత క్యాడర్, పీరియడ్, డేట్ ఆఫ్ బర్త్, మేల్, ఫిమేల్ సీనియారిటీ, 2021 బదిలీల్లో అర్హత సాధించి, రీఆపోర్షన్(షిఫ్టెడ్)కు గురైన టీచర్లకు పాత స్టేషన్ పాయింట్లు వర్తింపజేయాలనే దానిపై డీఈవోకు, ఫ్యాప్టో సంఘం నేతలకు మధ్య వాదనలు చోటు చేసుకున్నాయి. ఇతర జిల్లాల్లో పాటిస్తున్న విధానమే ఇక్కడా అమలు చేయాలని ఫ్యాప్టో నాయకుల పట్టుబడుతూ డీఈవో వరలక్ష్మిని చుట్టుముట్టారు.పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నుంచి వివరణ తీసుకుని సమాధానం ఇస్తామని డీఈవో చెబుతున్నా తిరుపతి జిల్లా ఫ్యాప్టో నాయకుడు,రామచంద్రాపురం మండలం అనుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన పీడీ సురేష్ ఆమెను ఏక వచనంతో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ఇక్కడే నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించడంతో పక్కనే ఉన్న చిత్తూరు జిల్లా ఫ్యాప్టో నాయకులు అవాక్కయ్యారు.మహిళ అని కూడా చూడకుండా అమర్యాదగా ప్రవర్తించడాన్ని డీఈవో కార్యాలయ సిబ్బంది తీవ్రంగా ఖండించారు. సమస్య జటిలం కావడానికి జీడీ నెల్లూరు మండలం అగ్రహారం ఎంపీయూపీఎస్ పాఠశాల ఎస్జీటీ పి.విజయ్కుమార్ కారణమని విద్యాశాఖ అధికారులు కమిషనర్ విజయరామరాజుకు ఫిర్యాదు చేశారు.మూడు రోజులుగా డీఈవో కార్యాలయం చుట్టూ తిరుగుతూ పలు అంశాలపై ఉపాధ్యాయ సంఘాల నేతలను రెచ్చగొడుతున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా బదిలీలకు సంబంధించి ఫ్యాప్టో నాయకులు లేవనెత్తిన అంశాల్లో ఒకటైన, ఉపాధ్యాయుల బదిలీల క్రమంలో 2021 అర్హత సాధించిన వారికి రీఅపోర్షన్ కింద 2025లో పాత స్టేషన్ పాయింట్లు వర్తిస్తాయని డీఈవో వరలక్ష్మి వివరణ ఇచ్చారు. ఫ్యాప్టో నాయకులు జీవీ రమణ, మణిగండన్, మునీర్ అహ్మద్, మునాఫ్, గోపినాథ్, సోమశేఖర నాయుడు, మదనమోహన్రెడ్డి, చెంగల్రాయమందడి తదితరులు పాల్గొన్నారు.
167మంది హెచ్ఎంల బదిలీ
ప్రధానోపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగిసింది. జిల్లా పరిషత్ యాజమాన్యంలో 155 మంది, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఐదుగురు, మున్సిపాలిటీల్లోని ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు ఏడుగురు బదిలీ అయ్యారు.
ఎస్ఏలకు మొదలైన పదోన్నతి కౌన్సెలింగ్
స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) నుంచి గ్రేడ్-2 హెచ్ఎంల పదోన్నతి కౌన్సెలింగ్ గురువారం చిత్తూరులో మొదలైంది. జడ్పీ యాజమాన్యంలో 155, మున్సిపల్ కార్పొరేషన్లలో ఐదు, మున్సిపాలిటీల్లో ఐదు పోస్టులకు గాను 1:3 రేషియోలో 500 మంది ఎస్ఏలను పిలిచారు.