Share News

Pulp Mills: గుజ్జు పరిశ్రమల వద్ద ఉద్యోగ బృందాలు

ABN , Publish Date - Jun 10 , 2025 | 02:38 AM

మామిడి రైతులకు న్యాయం చేసేందుకు మద్దతు ధర అమలు విషయాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Pulp Mills: గుజ్జు పరిశ్రమల వద్ద ఉద్యోగ బృందాలు
మామిడి కాయలు

ఒకట్రెండు రోజుల్లో ర్యాంపుల వద్దా బృందాల నియామకం

బయటి కాయలు రాకుండా చెక్‌పోస్టుల్లోనూ ప్రత్యేక అధికారులు

చిత్తూరు, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): మామిడి రైతులకు న్యాయం చేసేందుకు మద్దతు ధర అమలు విషయాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి రైతుకూ మామిడి గుజ్జు పరిశ్రమలు ఇచ్చే రూ.8తో పాటు ప్రభుత్వం ఇచ్చే రూ.4 సబ్సిడీ కచ్చితంగా అందాలనే లక్ష్యంతో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతోంది. ఇప్పటికే జిల్లాలో మామిడి కొనుగోళ్లు ప్రారంభమవగా, మంగళవారం నుంచి జిల్లాలోని 35 ఫ్యాక్టరీల వద్ద ఇప్పటికే నియమించిన ప్రభుత్వ ఉద్యోగుల బృందాలు పనిచేయనున్నాయి. రైతుల వివరాలు ఎలా నమోదు చేసుకోవాలి.. ఎలా పర్యవేక్షణ చేయాలి.. వంటి అంశాలపై సోమవారం కలెక్టరేట్‌లో అవగాహన కల్పించారు.

రెండు షిఫ్టుల్లో పనిచేసేలా..

జిల్లాలోని 70 శాతం మంది రైతులకు తమ కాయల్ని ఫ్యాక్టరీలకు తరలించడం అలవాటు. ర్యాంపులకు, మార్కెట్‌ యార్డులకు తీసుకెళ్లేవారి సంఖ్య తక్కువ. అందుకే తొలి విడతలో ఫ్యాక్టరీల వద్ద సిబ్బందిని నియమించారు. ఒకట్రెండు రోజుల్లో ర్యాంపుల వద్దా నియమించనున్నారు. ఫ్యాక్టరీల వద్ద నియమించిన ఉద్యోగులు రెండు విడతలుగా పనిచేస్తారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓ బృందం, అప్పటి నుంచి రాత్రి 8 గంటల వరకు మరో బృందం పని చేయనుంది.ఈ బృందంలో ఓ వీఆర్వో, ఓ అగ్రికల్చర్‌/హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ ఉంటారు. ఫ్యాక్టరీల వద్ద రోజంతా నమోదు చేసుకున్న వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు వీరు నివేదించాల్సి ఉంటుంది.

నాలుగు మండలాలకు ప్రత్యేక అధికారులు

ఫ్యాక్టరీల వద్ద రోజంతా పర్యవేక్షణ చేయడానికి అగ్రికల్చర్‌/హార్టికల్చర్‌ ఆఫీసర్లు, డిప్యూటీ తహసీల్దార్‌, ఈవోపీఆర్డీ, ఏఈ.. వంటి మండల స్థాయి అధికారులను నియమించారు. అలాగే ప్రతి మండలానికీ ఓ జిల్లా అధికారిని స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించారు. ఎక్కువ ఫ్యాక్టరీలున్న మండలాలకు కీలకమైన జిల్లా అధికారుల్ని కేటాయించారు. తవణంపల్లె మండలానికి జడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు, జీడీనెల్లూరుకు డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, గుడిపాలకు చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు, పూతలపట్టుకు డీపీవో సుధాకర్‌లను నియమించారు.

సరిహద్దు చెక్‌పోస్టుల్లోనూ సిబ్బంది నియామకం

మన జిల్లాలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోకి చెక్‌పోస్టుల్లో మామిడి సీజన్‌ అయిపోయే వరకు పనిచేసేలా సిబ్బందిని నియమించారు. రెవెన్యూ, పోలీసు, ఫారెస్టు, మార్కెటింగ్‌ శాఖల సిబ్బంది ఆయా చెక్‌పోస్టుల్లో పనిచేసి, బయటి ప్రాంతాలనుంచీ మామిడి కాయలు రాకుండా అడ్డుకుంటారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాల కాయల్ని మాత్రం అనుమతిస్తారు.

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

మద్దతు ధర అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను కూడా ఏర్పాటుచేశారు. ఇక్కడ హార్టికల్చర్‌ డీడీ మధుసూదన రెడ్డి, డీఎల్‌డీవో రవికుమార్‌, డీఆర్‌డీఏ ఏపీడీ రవిలతో పాటు ఆడిట్‌ బృందం ఇక్కడ పనిచేస్తుంది. రోజువారి మామిడి కాయల రాక, అమ్మకాలను ఫాలోఅప్‌ చేసి, రైతుల సమస్యల్ని కూడా నోట్‌ చేసుకుంటారు.


పక్వానికి రాని కాయల్నీ తరలిస్తున్న రైతులు

ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించడంతో చాలామంది రైతులు కాయలు పక్వానికి రాకముందే కోసి ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. సోమవారం రెండు ఫ్యాక్టరీల నుంచి హార్టికల్చర్‌ అధికారులకు ఫిర్యాదులు అందాయి. సబ్సిడీ అనేది ఈ సీజన్‌ అయిపోయేవరకు అమలులో ఉంటుంది. దీంతో దశల వారీగా కాయల్ని కోయాలని ఆయా అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

ఫ్యాక్టరీల వద్దకు రైతులే వెళ్లాలి

ఇంతకాలం కాయల్ని ఫ్యాక్టరీలకు తరలించేటప్పుడు రైతులు తెలిసినవాళ్లను పంపించేవారు. ఇప్పుడుప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండడంతో రైతులే స్వయంగా ఫ్యాక్టరీల వద్దకు వెళ్లి అక్కడి ప్రభుత్వ ఉద్యోగుల వద్ద తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పేరు, ఆధార్‌, బ్యాంకు అకౌంట్‌, ఎన్ని టన్నుల కాయలు.. వంటి వివరాలను ఎంటర్‌ చేయించాలి. ఒక్కో ట్రాక్టర్‌లో 5 టన్నుల కాయలుంటాయి. వివరాలు నమోదు చేసుకోకుంటే కిలోకు రూ.4 సబ్సిడీ చొప్పున రూ.20 వేలు నష్టపోతారు.

ఈ 15 రోజులు కీలకం: కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఈ మామిడి సీజన్‌లో రానున్న 15 రోజులు చాలా కీలకమని, ప్రభుత్వం తోతాపురి మామిడికి మద్ధతు ధర ప్రకటించిన నేపథ్యంలో పర్యవేక్షణకు నియమించిన అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జేసీ విద్యాధరి, డీఆర్వో మోహన్‌కుమార్‌, ఉద్యానశాఖ అధికారి మధుసూదన్‌తో కలిసి ప్రాసెసింగ్‌ కంపెనీల వద్ద విధులు కేటాయించిన అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర పూర్తిస్థాయిలో రైతులకు న్యాయం జరిగేలా జిల్లాయంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపడుతోందన్నారు.ప్రభుత్వం ప్రకటించిన రూ. 4 మద్ధతు ధర వివరాలను ప్రాసెసింగ్‌ కంపెనీల దగ్గర బోర్డుల్లో ప్రదర్శించాలన్నారు.ఫ్యాక్టరీలకు వచ్చిన మామిడి రకం తోతాపురియా కాదా అని పరిశీలించడంతో పాటు ప్రాసెసింగ్‌ కంపెనీలకు వచ్చిన రైతుల పూర్తి వివరాలు, గ్రామం, మండలం, వాహన నెంబరు, క్వాంటిటీ, ఆధార్‌ నెంబరు, బ్యాంకు ఖాతా నెంబరు, ఫోన్‌ నెంబరు తదితర వివరాలను ప్రొఫార్మాలో పూర్తిచేసి ఫ్యాక్టరీ యాజమాన్యాలకు అందించాలన్నారు.ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఉద్యాన, రైతుసేవ, రెవిన్యూ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 02:38 AM