Share News

Housewarming Ceremony: అంగరంగ వైభవంగా సీఎం చంద్రబాబు గృహప్రవేశం..

ABN , Publish Date - May 25 , 2025 | 08:39 AM

చిత్తూరు జిల్లా కుప్పంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలసి ఆదివారం తెల్లవారుజామున గృహప్రవేశం చేశారు. ఈ నేపథ్యంలో కుప్పంలో ప్రతి ఇంటా సందడి నెలకొంది. సొంత కుటుంబ సభ్యుడే గృహప్రవేశం చేస్తున్నట్లు కుప్పం వాసులంతా సంతోషం వ్యక్తం చేశారు.

Housewarming Ceremony: అంగరంగ వైభవంగా సీఎం చంద్రబాబు గృహప్రవేశం..
CM Chandrababu Naidu housewarming

చిత్తూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) గృహప్రవేశం అంగరంగ వైభవంగా(Housewarming Ceremony) జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పం(Kuppam)లో కుటుంబసభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు గృహప్రవేశం చేశారు. ఆదివారం తెల్లవారుజాము 4:30 గంటలకే గృహప్రవేశ పూజా కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం ఉదయం 10 గంటలకు టీడీపీ కుటుంబ సభ్యులు, ప్రజలను చంద్రబాబు దంపతులు కలవనున్నారు. ఈ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలపనున్న వారి కోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. ఈ శుభ కార్యక్రమానికి వచ్చే వారందరికీ పసందైన పలు రకాల విందు వంటకాలూ సిద్ధం చేశారు.

chandrababu.jpg


కాగా, కుప్పంలోని కొత్త ఇంటి గృహప్రవేశం నేపథ్యంలో సీఎం చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులందరూ శనివారం రాత్రికే కుప్పం చేరుకున్నారు. చంద్రబాబు తరఫున ఆహ్వానాలు అందుకున్న నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు ముఖ్యమంత్రి మాత్రమే కాదు.. ఎమ్మెల్యే కూడా. అంతమాత్రమేనా.. నిరంతరం వారి క్షేమ సమాచారాలు కనుక్కుంటూ బాగోగులు చూసే సొంత కుటుంబ సభ్యుడు. అందుకే కుప్పంలో ఈ హడావుడి.

Also Read: శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి


పసందైన వంటకాలు..

కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ పరిధిలోని శివపురం వద్ద రెండెకరాల స్థలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన గృహాన్ని నిర్మించుకున్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శనివారం మధ్యాహ్నమే కుప్పం చేరుకుని పీఈఎస్‌ వైద్య కళాశాల అతిథి గృహంలో బస చేశారు. నూతన గృహానికి వెళ్లి, అక్కడి గృహప్రవేశ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు కుమారుడు దేవాన్ష్‌తో కలిసి శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో కుప్పం చేరుకున్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధరాత్రి తర్వాత కుప్పం వచ్చారు.

bhuvaneswari.jpg

మరోవైపు గృహప్రవేశ ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. సుమారు 25 వేలమందికి భోజనాల ఏర్పాట్లు చేశారు. ఇందుకు అవసరమైన ప్రత్యేకమైన షెడ్లను నూతన గృహ పరిసరాలలో నిర్మించారు. శనివారం రాత్రి ఇంటి వద్ద బంధుమిత్రులకు, వీఐపీలకు భోజనాలు చేసి వడ్డించారు. ఆదివారం మధ్యాహ్నం వేల సంఖ్యలో జనం భోజనాలు చేయనున్నారు. వీవీఐపీ, వీఐపీ, సాధారణ గ్యాలరీలను ఇందుకోసం సిద్ధం చేశారు. శనివారం మధ్యాహ్నం నుంచే వంట ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. నారా భువనేశ్వరి దగ్గరుండి మరీ వంటకాలను సిద్ధం చేయించడమే కాక, అవసరమైన ఏర్పాట్లు చూసుకుంటున్నారు. 25 వేలమంది సాధారణ ప్రజలకు, 2 వేలమంది వీఐపీలకు భోజనాలు సిద్ధం చేస్తున్నారు.


అందరికీ ఆహ్వానాలు...

lokesh.jpg

ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం నుంచీ కనీసం ఒక్కరైనా గృహప్రవేశానికి వచ్చి భోజనం చేసి వెళ్లేలా ఆహ్వానం పలకాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. సామాజిక మాధ్యమాల్లో డిజిటల్‌ ఆహ్వాన పత్రికలు పెట్టడంతోపాటు, పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామగ్రామానికి వెళ్లి ముద్రించిన పత్రికలను పంచి గృహప్రవేశానికి ఆహ్వానించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులకు సైతం ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌ పి.ఎస్.మునిరత్నం, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ బి.ఆర్‌.సురేశ్‌బాబు, కుప్పం మండల టీడీపీ అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌, మున్సిపల్‌ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌లతోపాటు మిగిలిన రెండు మూడు మండలాల అధ్యక్షులు ఆహ్వానం పలుకుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో మెసేజ్‌లు పెట్టారు. కుప్పం మండల అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌.. శనివారం నాడు మండలంలోని పలు గ్రామాలకు వెళ్లి ఆహ్వాన పత్రికలు పంచి, పసుపు కుంకుమలు ఇచ్చి మరీ మహిళలను సంప్రదాయబద్ధంగా గృహప్రవేశానికి ఆహ్వానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వల్లభనేని వంశీకి విచారణ భయం...

జూన్‌లో ఒకేసారి 3నెలల రేషన్‌

For More AP News and Telugu News

Updated Date - May 25 , 2025 | 09:20 AM