CM: సీఎం పర్యటనకు సర్వం సిద్ధం
ABN , Publish Date - May 21 , 2025 | 01:24 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటనకు సర్వం సిద్ధమైంది. కుప్పంలో జరుగుతున్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాలలో చివరి ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనం బుధవారం జరగనుంది.

కుప్పం, మే 20 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటనకు సర్వం సిద్ధమైంది. కుప్పంలో జరుగుతున్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాలలో చివరి ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనం బుధవారం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం, టీటీడీ తరఫున పట్టు వస్త్రాలతో కూడిన సారెను సమర్పించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ద్రావిడ విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకునే సీఎం రోడ్డు మార్గం ద్వారా వచ్చి కుప్పం పట్టణంలో జరుగుతున్న గంగ జాతర వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్పీ మణికంఠ తదితరులు మంగళవారం సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్తోపాటు, గంగమ్మ ఆలయం, పరిసరాలను పరిశీలించి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా తీసుకోవాల్సిన చర్యల గురించి జాతర నిర్వాహకులతో, అధికార వర్గాలతో చర్చించి పలు సూచనలు చేశారు. అదే సమయంలో అమ్మవారి విశ్వరూప దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.