CM Chandrababu: అన్ని సేవలూ వాట్సాప్లోనే
ABN , Publish Date - May 06 , 2025 | 05:29 AM
ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. డేటా లేక్ పనులు వేగవంతం చేయాలని, వర్క్ ఫ్రం హోం విధానానికి ప్రాధాన్యం కల్పించాలని సూచించారు

వాట్సాప్ గవర్నెన్స్పై అవగాహన పెంచాలి
వర్క్ఫ్రమ్ హోం ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం
డేటా లేక్ పనులు వేగవంతం చేయాలి
ఆర్టీజీఎస్పై సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): ప్రజలకు అన్నిరకాల ప్రభుత్వ సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కార్యకలాపాలపై సోమవారం అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. డేటా లేక్ పనులు కూడా వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. డ్రోన్ల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. పురపాలక శాఖ, ప్రజారోగ్య శాఖలు దోమల నివారణకు డ్రోన్లు ఎక్కువగా వినియోగించాలన్నారు. అలాగే వర్క్ఫ్రమ్ హోంను అమలు చేయాలని, ఈ విధానాన్ని కొనసాగించేలా నిరంతరం కృష్టి చేయాలని సూచించారు.
రాబోయే మూడేళ్లలో ఎన్ని ఉద్యోగాలను కల్పిస్తామో, వారికి ఎలాంటి నైపుణ్యాలు అందిస్తామో అనే అంశంపై కసరత్తు చేయాలని చెప్పారు. ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ.. డేటా లేక్ పనులు దాదాపుగా పూర్తయ్యాయని సీఎంకు వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 273 రకాల సేవలు అందిస్తున్నామని.. ఈ ఏడాది జూన్ 12 నాటికి 370 నుంచి 380 సేవలు అందిస్తామని చెప్పారు. ఆర్జీజీఎస్లో అవేర్ హబ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులను గమనిస్తూ ప్రజలకు సమాచారం అందిస్తామని భాస్కర్ వివరించారు.