Chandrababu: జగన్ రాజకీయ భూతం
ABN , Publish Date - Jun 12 , 2025 | 03:13 AM
ఈ ఏడాది పాలన సుపరిపాలన దిశగా వేసిన తొలి అడుగు మాత్రమే. మున్ముందు మరింత మెరుగైన పాలనతో ప్రజలకు సేవ చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. సుస్థిర పాలనకు కులమతాలకు అతీతంగా ఆలోచించి...

భూస్థాపితం చేయకుంటే రాష్ట్రానికి అధోగతే
జనాన్ని మభ్యపెట్టేందుకే పత్రిక, చానల్ నడుపుతున్నారు
రాజకీయ ముసుగులో ఉన్నా వదిలిపెట్టను: సీఎం
సుపరిపాలన దిశగా ‘ఏడాది’ తొలి అడుగు
ఇబ్బందులెన్ని ఉన్నా.. హామీల అమలు
నేడే ‘తల్లికి వందనం’ నిధులు జమ
ఈనెల 20నే ‘అన్నదాత సుఖీభవ’ సొమ్ము
ఆగస్టు 15 నుంచి మహిళలకు ‘ఉచిత బస్సు’
నిరుద్యోగ భృతిపై వర్కౌట్ చేస్తున్నాం
పీ4, ప్రభుత్వ ధనంతో మహిళలకు రూ.1500
సుస్థిర ప్రభుత్వంతోనే సత్ఫలితాలు
రాష్ట్రాభివృద్ధిని ‘వైకుంఠపాళి’లోకి నెట్టొద్దు
2019 ఎన్నికల్లో ఓటమికి 2 ప్రధాన కారణాలు
వైసీపీ దుష్ప్రచారాన్ని అడ్డుకోలేకపోవడం.. కార్యకర్తలను సమాయత్తం చేయకపోవడం
పార్టీ నియమావళి, కార్యకర్తల మనోభావాల మేరకే లోకేశ్కు పదవి
‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో సీఎం చంద్రబాబు
వదిలే ప్రసక్తే లేదు
శివలింగంపై తేలులా రాజకీయం ముసుగులో ఉండటంతో జగన్ను ఎదుర్కోవడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయినా వదిలిపెట్టను. ఇలాంటి వారిని కంట్రోల్ చేయకుంటే రాష్ట్రానికి నష్టం. రౌడీలెవరూ రాష్ట్రంలో ఉండకూడదు. రాష్ట్రం నుంచి బాయ్కాట్ చేయాలి. జగన్లాంటి భూతాన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తాను. లేకుంటే రాష్ట్రాన్ని జగన్ అధోగతి పాల్జేస్తారు.
- ముఖ్యమంత్రి చంద్రబాబు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘‘ఈ ఏడాది పాలన సుపరిపాలన దిశగా వేసిన తొలి అడుగు మాత్రమే. మున్ముందు మరింత మెరుగైన పాలనతో ప్రజలకు సేవ చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. సుస్థిర పాలనకు కులమతాలకు అతీతంగా ఆలోచించి... సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ వివేకా హత్య, అమరావతిపై విద్వేషపూరిత వ్యాఖ్యలు, తాజాగా పొదిలిలో మహిళలపై రాళ్ల దాడి వంటి ఘటనలను ప్రస్తావిస్తూ... విపక్ష నేత జగన్ అరాచక శక్తి అని మండిపడ్డారు. ఇలాంటి నేరమనస్తత్వం ఉన్న వ్యక్తితో రాజకీయం చేయాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సుడిగుండంలోకి నెట్టారని మండిపడ్డారు. ‘‘తాను ఏంచేసినా కరెక్ట్ అని నమ్మించడం కోసమే పత్రిక, చానల్ నడుపుతున్నారు. శివలింగంపై తేలులా రాజకీయం ముసుగులో ఉండటంతో జగన్ను ఎదుర్కోవడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయినా వదిలిపెట్టను. ఇలాంటి వారిని కంట్రోల్ చేయకుంటే రాష్ట్రానికి నష్టం. రౌడీలెవరూ రాష్ట్రంలో ఉండకూడదు. రాష్ట్రం నుంచి బాయ్కాట్ చేయాలి. జగన్లాంటి భూతాన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తాను. లేకుంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారు’’ అని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం రెండింటికీ ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. కూటమి పాలనకు ఏడాది అయిన సందర్భంగా... ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’కు చంద్రబాబు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇవీ ఆ వివరాలు...
మీరు ముఖ్యమంత్రి కావడం ఇది నాలుగోసారి. అంతకు ముందుతో పోల్చితే... ఇప్పుడు పరిస్థితి ఏమిటి?
ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు. 1995లో ప్రత్యేక పరిస్థితుల్లో సీఎం అయ్యాను. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక ఇబ్బందులున్నా పాలనను గాడిలో పెట్టాను. 1999లో మళ్లీ సీఎంగా కొనసాగాను. 2014లో సీఎం అయ్యాక రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకుంటూ... విభజిత రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నించాను. ఇప్పుడు... మొదటి మూడుసార్లకంటే ఊహించని, భయంకర పరిస్థితులను ఎదుర్కొని మరీ సీఎంగా బాధ్యతలు చేపట్టాను. సమస్యలన్నింటినీ జటిలం చేసి రాష్ట్రాన్ని ఒక సుడిగుండంలా తయారు చేశారు. అంతుచిక్కని అగాథంలా మార్చేశారు. దీనిని గాడిన పెట్టడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాం.
రాజధాని, పోలవరం ప్రాజెక్టులకు జరిగిన నష్టం మాటేమిటి?
ఆటోపైలట్లా పూర్తికావాల్సిన రాజధానికి ఎన్నో ఆటంకాలు కల్పించారు. విధ్వంసం సృష్టించారు. రాష్ట్రానికి ఆస్తి లాంటి పోలవరాన్ని పాడుపెట్టారు. 2014-19 మధ్య 70 నుంచి 80 సార్లు పోలవరంపై సమీక్షలు నిర్వహించాను. డయాఫ్రంవాల్ పూర్తి చేశాం. వైసీపీ అధికారంలోకి రాగానే కక్ష, విద్వేషం, చేతగానితనంతో వచ్చిన రోజునే కాంట్రాక్టు ఏజెన్సీని మార్చేసింది. వైసీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రంవాల్ దెబ్బతినింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిపుణులు వచ్చి చెబితే కానీ డయాఫ్రంవాల్ దెబ్బతినిందని తెలుసుకోలేని పరిస్థితి. రూ.450 కోట్లతో పూర్తికావాల్సిన డయాఫ్రంవాల్ వైసీపీ నిర్లక్ష్యం కారణంగా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే కానీ పూర్తికావడంలేదు. భగవంతుడు నా ద్వారానే పోలవరాన్ని పూర్తి చేయాలని సంకల్పించారు. ఎట్టి పరిస్థితుల్లో 2027 డిసెంబరు నాటికి పూర్తి చేసి తీరుతాం!
ఎన్నికల్లో ఘన విజయంతో ఒక సిక్సర్ కొట్టారు. ప్రజల కోసం మరో ‘సిక్సర్’ (హామీల అమలు) కొట్టాల్సి ఉంది. అది ఎప్పుడు?
సంపద సృష్టిస్తాం.. ఆదాయం పెంచుతాం.. అందరికీ పంచుతాం! ఇదే నేను చెబుతున్నా! నా వల్ల కాదని ఎప్పుడూ చెప్పను. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. అదే నా బలం.. దటీజ్ సీబీఎన్! ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా.. చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చి తీరుతాం. ఆర్థికంగా వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని బయటికి తీసుకొచ్చాం. పేదలకు పింఛను రూ.4వేలకు పెంచాం. గత ప్రభుత్వం ఇవ్వకుండా నిలిపివేసిన 80వేల మంది వితంతువులకు మా ప్రభుత్వం పింఛన్లు ఇచ్చింది. మా ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా... గురువారం ‘తల్లికి వందనం’ డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాలో వేస్తున్నాం. బడికి వెళ్లే పిల్లలందరికీ ఇది వర్తిస్తుంది. ఒకటో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులకు మాత్రం... అడ్మిషన్లు పూర్తి అయిన వెంటనే డబ్బులు జమ చేస్తాం. ఈనెల 20న ‘అన్నదాత సుఖీభవ’ కింద నిధులు ఇస్తాం. ఆగస్టు 15న ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నాం. వారికి నిరుద్యోగ భృతిపై వర్కౌట్ చేస్తున్నాం. ఆడబిడ్డ నిధి పేరుతో మహిళలకు ఇస్తామన్న నెలకు రూ.1500ను పీ4 పథకంతో అనుసంధానించి అమలు చేసే ప్రయత్నం మొదలుపెట్టాం. ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఇచ్చే డబ్బులతోపాటు ప్రభుత్వం కూడా ఆడబిడ్డ నిధి కింద సాయం చేస్తుంది.
గత ప్రభుత్వ హయాంలో రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయి. ‘కనెక్టివిటీ’పై దృష్టి సారిస్తారా?
ఏపీని లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దాలంటే రోడ్, పోర్టు, ఎయిర్పోర్టు కనెక్టివిటీ ఎంతో ముఖ్యం. మనకు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. 20 పోర్టులు నిర్మించుకునే అవకాశం ఉంది. ఆ దిశగా దృష్టి పెట్టాం. సుమారు 14 ఎయిర్పోర్టులు నిర్మించుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లు ఉన్నాయి. పంచాయతీరాజ్ రోడ్లను అభివృద్ధి చేయడానికి లాజిస్టిక్ కార్పొరేషన్ ద్వారా నిధులు సమకూరుస్తున్నాం.
మీ ఆలోచనలు భారీగా ఉంటాయి. చిన్న రాష్ట్రానికి 14 ఎయిర్పోర్టులు అవసరమా? ఇంత భారీ ఎత్తున రాజధాని అవసరమా... అనే అభిప్రాయాలపై మీరు ఎలా స్పందిస్తారు?
మౌలిక సదుపాయాలే ప్రజల ఆస్తి. వాటిని పెంచుకుంటే ఆదాయం పెరుగుతుంది. అమెరికాలో సుమారు 350 విమానాశ్రయాలు ఉన్నాయి. దానితో పోల్చుకోలేకపోయినా భవిష్యత్తులో ఇంటర్ కనెక్టివిటీ అనేది చాలా ప్రాముఖ్యం వహిస్తుంది. గమ్యస్థానాలకు ఎంత త్వరగా చేరుకోవాలని ఆలోచించే వారు ఉంటారు. అప్పటికప్పుడు విమానాశ్రయాలను. రాజధానిని నిర్మించుకోలేం. దూరదృష్టితో ఆలోచిస్తే రాబోయే రోజుల్లో వాటి అవసరాన్ని గుర్తిస్తే వాటి ప్రాధాన్యం తెలుస్తుంది. నేను హైటెక్ సిటీ ఆలోచన చేసినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. ఐటీ పాలసీలో నేనూ భాగస్వామిని. అప్పట్లో దానిపైనా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు హైటెక్ సిటీతో హైదరాబాద్ అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా రూపుదిద్దుకుంది. ఐటీ పాలసీతో సెల్ఫోన్ విప్లవం వచ్చింది. కంప్యూటర్లు, సెల్ఫోన్లు కూడు పెడతాయా అని నాడు విమర్శించిన వారు నేడు ఏమంటారు? ముందుచూపు లేని వారే విమర్శలు చేస్తారు. వారి అజ్ఞానాన్ని, చేతగానితనాన్ని విమర్శ రూపంలో ప్రదర్శిస్తారు.
దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వరుస విజయాలతో స్థిరంగా ఉంటున్నాయి. టీడీపీ ఎందుకు స్థిరంగా కొనసాగలేకపోతోంది?
1995, 1999లో టీడీపీ ప్రభుత్వాలు కొనసాగాయి. దాని వల్ల మంచి ఫలితాలు కనిపించాయి. గుజరాత్లో స్థిరమైన ప్రభుత్వం వల్ల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏదైనా పాలసీ అమలు చేయాలంటే సుస్థిర ప్రభుత్వాలు ఉండాలి. నేను రాష్ట్ర ప్రజలకు కూడా అదే చెబుతున్నా! రాష్ట్రాభివృద్ధిని మరోసారి వైకుంఠపాళిలోని పాము నోట్లో పెట్టొద్దని కోరాను... ఇప్పుడూ కోరుతున్నాను. ఒక్కోసారి ప్రజలకు సరిగ్గా చెప్పడంలో నేను విఫలమవుతుంటాను. ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో రాజకీయాన్ని వదిలేస్తుంటాను. దాని ఫలితం 2019లో చూశాం!
2019లో ఘోర ఓటమికి కారణాలు ఏమనుకుంటున్నారు?
ప్రత్యర్థి చేసిన దుష్ప్రచారాన్ని సరిగ్గా అడ్డుకోలేకపోవడం, యుద్ధం చేయాల్సిన కార్యకర్తలను సమాయత్తం చేయలేకపోవడమే ప్రధాన కారణాలు. మా కార్యకర్తలకు కోపం వస్తే ఎక్కడికీ పోరు. కానీ, అలిగి ఇంట్లో ఉండిపోతారు. దాని ఫలితం 2019 ఎన్నికల్లో చూశాం. ఈసారి అటు రాష్ట్ర ప్రజలతోపాటు పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న రూ.2.66 లక్షల తలసరి ఆదాయాన్ని 2047నాటికి రూ.54 లక్షలకు చేర్చే లక్ష్యంతో పనిచేస్తున్నాం. 2019లో 13.5 శాతం అభివృద్ధి నమోదైతే దాన్ని 15 శాతం లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం.
బిల్గేట్స్ ఫౌండేషన్తో అవగాహన పెట్టుకున్నాం. ఆరోగ్య, విద్య, వ్యవసాయ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతికతను బిల్గేట్స్ ఫౌండేషన్ రాష్ట్రానికి తీసుకొస్తుంది. దాన్ని ఇక్కడ అమలు చేసి వారికి ‘ప్రూఫ్ ఆఫ్ కాన్సె్ప్ట్’గా రాష్ట్రాన్ని చూపిస్తాం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సుమారు 500 సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎవ్వరూ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా చేస్తున్నాం. ఇదంతా రాష్ట్రం కోసం చేస్తున్నాం. అదే సమయంలో పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం.
ఈసారి అధికారం చేపట్టిన తర్వాత ‘1995 సీబీఎన్‘ని చూస్తారని చెబుతూ వచ్చారు. సీబీఎన్ 4.0 చూపిస్తున్నారా?
1995లో అధికారయంత్రాంగాన్ని గాడిన పెట్టేందుకు ఆకస్మిక తనిఖీలు చేసే వాడిని. పాలన విషయంలో కఠినంగా వ్యవహరించేవాడిని. ఇప్పుడు కూడా ఆకస్మిక తనిఖీలు చేపడతాను. అయితే ఇప్పుడు ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు చాలా మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. దాన్ని అధికారులకు చెప్పి సరిదిద్దుకోమని చెబుతున్నాం. అప్పటికీ వినకపోతే 1995 సీబీఎన్ని చూపిస్తాను.
కొంత మంది ఎమ్మెల్యేల అవినీతిపై....
అందరూ అలాంటి వారు ఉండరు. కొందరు ఉంటారు. వారందరికీ నేను ఒక్కటే చెబుతున్నా. ఎవ్వరూ వైసీపీని ఆదర్శంగా తీసుకోవద్దు. ‘1995 సీబీఎన్’ అని అందుకే చెబుతున్నా. నేను రాష్ట్రాభివృద్ధి కోసం యజ్ఞం చేస్తుంటే దానికి విఘాతం కలిగించే వారిని ఉపేక్షించను. అవసరమైతే అలాంటి వారిని వదులకునేందుకూ సిద్ధం.
మీ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నాం. పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నది నా జీవితాశయం. పేదవారు మరింత పేదవారిగా.. కోటీశ్వరులు మరింత కోటీశ్వరులుగా మారుతున్నారు. ఈ పరిస్థితి నుంచే పీ4 ఆలోచన పుట్టింది. సమాజంలో అత్యున్నత స్థానంలో ఉన్న వారు అట్టడుగునున్న 20 శాతం పేదలను అక్కున చేర్చుకుని వారి అభ్యున్నతికి కృషి చేయాలి. నేటి బంగారు కుటుంబాలు భవిష్యత్తులో మార్గదర్శులుగా మారాలి. ఇదే నా ఆలోచన.. ఆశయం.
లక్ష కోట్లు...
ఆర్థిక సంస్కరణతో భారీ ప్రాజెక్టుల ఆలోచనకు శ్రీకారం జరిగింది. గతంలో లక్ష కోట్ల ప్రాజెక్టులు ఊహకే అందేవి కావు. ఇప్పుడు ఏపీలోనే లక్ష కోట్లపైచిలుకు ప్రాజెక్టులు చాలావస్తున్నాయి. ఆర్సెలార్ మిట్టల్ తొలి దశలో లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది. రెండో దశలో 50వేల కోట్ల రూపాయలు పెడుతోంది. ఈ రెండు దశలు పూర్తయితే మరో స్టీల్ సిటీ రాష్ట్రానికి వస్తుంది. ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్టు విలువ లక్షా యాభైవేల కోట్ల రూపాయలు! బీపీసీఎల్తోపాటు మరెన్నో ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తున్నాయి. భవిష్యత్తు కోసం ఆలోచన చేసినప్పుడు ఇలాంటి ప్రాజెక్టులను సాకారం చేయగలం. వైసీపీ హయాంలో ఇవన్నీ ఎందుకు రాలేదు! నమ్మకం లేకే రాలేదు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారుల్లో మళ్లీ నమ్మకాన్ని కలిగించాం. బ్రాండ్ ఇమేజ్ తీసుకురాగలిగాం.
జగన్ అరాచక శక్తి!.. బరితెగింపు మాటలు, చేష్టలు
నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాష్ట్ర, జాతీయస్థాయిలో చాలా మంది రాజకీయ నాయకులను చూశాను. వారందరితో సిద్ధాంతపరంగా పోరాడానే తప్ప ఎప్పుడూ వ్యక్తిగతంగా పోలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గతంలో రాజకీయ నాయకులు నేరగాళ్లను కలవాలంటేనే భయపడేవారు. ఇప్పుడు నేరగాళ్లే రాజకీయాలు చేస్తున్నారు. బాబాయ్ని చంపేసి సీఎంనే ముద్దాయి అంటున్నారు. ఎలాంటి నేరమనస్తత్వం ఉన్న వాళ్లు రాజకీయాలు చేస్తున్నారో అర్థం చేసుకోండి. వివేకా చనిపోయిన రోజు జగన్ చానల్లో గుండెపోటు అని వస్తే అదే నిజమని నమ్మాం. వివేకా కుమార్తె సునీత పోస్టుమార్టం కోరడంతో గుండెపోటు గొడ్డలిపోటుగా వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే నింద నాపై వేసి వారి పత్రికలో ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ రాసుకొచ్చారు. కోడికత్తి, గులకరాయి డ్రామాలు.. బాబాయ్ను చంపి మరొకరిపై నింద వేయడం! ఇలాంటి వ్యక్తులతో రాజకీయం చేస్తున్నామన్న ఆవేదన.. కోపం కలుగుతోంది. అలాంటి వ్యక్తులు రాజకీయాలకు అనర్హులు. మావాళ్లు ఒకరు జగన్ సతీమణిని దూషిస్తే వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాం. తప్పు చేసిన వారిని ఎవ్వరినీ క్షమించేది లేదు అన్న సంకేతాన్ని ప్రజల్లోకి పంపాం. కానీ... జగన్ మనుషులు అమరావతి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే నాలుగు రోజులైనా వారిలో పశ్చాత్తాపం లేదు. పైగా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. దాడులు చేస్తున్నారు. పొగాకు రైతుల కోసమని పొదిలి వెళ్లారు. దానికి 10-15వేల మందితో హడావిడి అవసరమా? రైతుల కోసం వెళ్లి పోలీసులు, మహిళలపై దాడులు చేయడం ఏమిటి? అంటే... ‘నేను రౌడీయిజం చేస్తా! నా ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తా!’ అని చెప్పడమేనా? తెనాలి విషయంలోనూ అలాగే వ్యవహరించారు. గంజాయిబ్యాచ్ను పరామర్శించడం ఏమిటి? అమ్మ.. ఆలికి తేడా లేకుండా ప్రవర్తించే గంజాయి బ్యాచ్ విషయంలో అలాగేనా ప్రవర్తించేది. గంజాయి తాగి, అశ్లీల చిత్రాలు చూసి అమ్మాయిలను వేధించే వారికి అండగా ఉంటామన్న సంకేతాలను ఓ మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పంపుతున్నాడంటే కండకావరం తప్ప మరొకటి కాదు. జగన్ బరితెగింపు మనస్తత్వానికి నిదర్శనం.
జగన్ మళ్లీ అధికారంలోకి రాడు అని చెప్పగలరా?
జగన్కు మళ్లీ అధికారం ఇవ్వకూడదని ప్రజలను కన్విన్స్ చేయగలననే నమ్మకం నాకుంది. కులమతాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మనం మన బిడ్డకు పెళ్లి చేయాలంటే ఎన్ని రకాలుగా ఆలోచిస్తాం. రాష్ట్రానికి పాలకుడిని ఎన్నుకునే సమయంలోనూ అదే విధంగా ఆలోచించాలి. రాష్ట్రాభివృద్ధి విషయంలోనూ అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి. విధ్వంస పాలన వద్దనుకునే... 2024లో కూటమికి 93 శాతం స్ట్రైక్ రేటుతో విజయాన్ని కట్టబెట్టారు. దాన్నే కొనసాగించాలని ప్రజలను కోరుతున్నాను. నేను అభివృద్ధి యజ్ఞం చేస్తున్నాను. దానికి ప్రజల సహకారం కోరుతున్నాను.
లోకేశ్కు పార్టీ పగ్గాలు ఎప్పుడు ఇస్తున్నారు?
పార్టీ నియమావళి అనేది ఒకటి ఉంటుంది. టీడీపీలో యువతరానికి పెద్దపీట వేస్తున్నాం. దేశంలో యువ ఎంపీలు, యువ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నది టీడీపీలోనే. కేంద్ర క్యాబినెట్లో యంగ్ మినిస్టర్ మా పార్టీ నుంచే ఉన్నారు. విద్యార్హతల పరంగా కూడా మా పార్టీనే ముందుంది. లోకేశ్ కార్యకర్తల సంక్షేమానికి చాలా చేస్తున్నాడు. పార్టీ నియమావళి ప్రకారం.. కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని లోకేశ్ విషయంలో నిర్ణయం తీసుకుంటాం.
భవిష్యత్తులో భువనేశ్వరి, బ్రాహ్మణి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా?
వారికి అలాంటి ఆలోచన లేదు.తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది?తెలుగుజాతి కోసం పెట్టిన పార్టీ టీడీపీ. తెలుగువారు ఉన్న అన్ని ప్రాంతాల్లో కచ్చితంగా టీడీపీ తన ఉనికిని చాటుకుంటుంది.
కూటమి పార్టీల ప్రస్థానం ఎలా ఉంది?
విధ్వంస రాష్ట్రాన్ని గాడిన పెట్టాలన్న ఒకే ఒక లక్ష్యంతో పవన్, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావడం.. రాష్ట్రంలోనూ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉండటం వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు కలుగుతోంది. అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ప్లాంట్కు కేంద్రం చేయూత లభించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాల్సిన అవసరం రాదు. విశాఖ ఉక్కును నిలబెట్టుకునే బాధ్యత ఉద్యోగులందరిపైనా ఉంది. లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ప్రైవేటు వ్యక్తులు లాభాలు ఆర్జిస్తున్నారు. సుమారు 20వేల ఎకరాలు.. లక్ష కోట్ల విలువైన ఆస్తులున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాలబాట పట్టించాల్సిన బాధ్యత ఉద్యోగులతోపాటు మనందరిపైనా ఉంది.
పవన్తో సంబంధాలు ఎలా ఉన్నాయి?
పవన్ మంచి మిత్రుడుగా సహకరిస్తున్నారు. 2014లో బీజేపీ మంత్రులు ఉన్నా ఈసారి మాత్రమే తొలిసారి సంకీర్ణ ప్రభుత్వం అనే భావనతో పాలన సాగిస్తున్నాం. అందరి సహకారంతో ఒక బాధ్యతగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నాం.