Share News

CBI Court: కోర్టు హాల్లో ఇంతమంది ఎందుకు

ABN , Publish Date - Jun 04 , 2025 | 04:40 AM

మద్యం కేసులో 7మంది వైసీపీ నేతల రిమాండ్‌ ఈ నెల 17 వరకు పొడిగిస్తూ సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. కోర్టు హాలులో అనవసరంగా గుమికూడితే తలుపులు మూసే ప్రమాదం ఉందని న్యాయాధికారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

CBI Court: కోర్టు హాల్లో ఇంతమంది ఎందుకు

  • ఇదే పునరావృతమైతే తలుపులు మూసుకుపోతాయి

  • కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు

  • వైసీపీ నేతలను ఉద్దేశించి న్యాయాధికారి వ్యాఖ్యలు

  • ‘మద్యం’ నిందితులకు 17 వరకూ రిమాండ్‌ పొడిగింపు

  • సిట్‌ ఎస్‌ఐపై చిందులు తొక్కిన రాజ్‌ కసిరెడ్డి

  • బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన బాలాజీ గోవిందప్ప

విజయవాడ, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): మద్యం కేసులో నిందితులకు రిమాండ్‌ పొడిగింపునకు ఇంతమంది అవసరమా అని సీబీఐ కోర్టు న్యాయాధికారి సీతారామకృష్ణారావు ప్రశ్నించారు. ఇదే పరిస్థితి పునరావృతమైతే కోర్టు తలుపులు మూసుకుపోతాయని వైసీపీ నేతలు, నిందితుల న్యాయవాదులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మద్యం కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న ఏడుగురు నిందితులకు ఈ నెల 17వరకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, మాజీ ఐఏఎస్‌ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, జగన్‌ ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌ రెడ్డి, కసిరెడ్డి పీఏ పైలా దిలీప్‌, భారతీ సిమెంట్స్‌ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప, చాణక్యను పోలీసులు మంగళవారం కోర్టుకు తీసుకొచ్చారు. ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరావు సెలవులో ఉండటంతో సీబీఐ కోర్టుకు ఇన్‌చార్జి అప్పగించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగానే వారి కుటుంబు సభ్యులు, వైసీపీ నాయకులు కోర్టు హాలులోకి వచ్చారు. రిమాండ్‌ పొడిగింపునకు మోమో దాఖలు చేసేటప్పుడు దర్యాప్తు పురోగతిని అధికారులు కోర్టుకు తెలియజేయడం లేదని నిందితుల తరఫు న్యాయవాదులు ఇంకొల్లు వెంకటేశ్వరరావు మరికొంతమంది న్యాయాధికారికి ఫిర్యాదు చేశారు. సిట్‌ అధికారులు ఒక కాపీని దాఖలు చేసి పొడిగింపు కోరుతున్నారని వివరించారు. దీంతో ప్రాసిక్యూషన్స్‌ ఏడీ రాజేంద్రప్రసాద్‌ను పిలిపించిన న్యాయాధికారి.. డిఫెన్స్‌ న్యాయవాదుల అభ్యంతరాన్ని ఆయనకు తెలియజేశారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను పాటిస్తున్నామని, గతనెల 31 వరకు దర్యాప్తు పురోగతిని కోర్టుకు అందజేశామని ఆయన వివరించారు. న్యాయాధికారి ఆ రికార్డును తెప్పించుకొని పరిశీలించారు. 31న దర్యాప్తు ప్రగతిని కోర్టుకు అందజేశారని, మరో రిపోర్టు సీల్డ్‌ కవర్‌లో ఉందని స్పష్టం చేశారు. రిమాండ్‌ పొడిగింపునకు ఆదేశాలు ఇచ్చే క్రమంలో భోజనం చేసేవరకు సమయం ఇవ్వాలని నిందితులు కోరారు.


పక్కనే ఉన్న కమర్షియల్‌ కోర్టు ఖాళీగా ఉందని, అక్కడ భోజనం చేస్తామని విజ్ఞప్తి చేయగా ఏడీ రాజేంద్రప్రసాద్‌ వ్యతిరేకించారు. ఈ చర్య దర్యాప్తు అధికారులకు లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతుందని, వారి ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు. న్యాయాధికారి స్పందిస్తూ.. పక్క కోర్టు ఖాళీగా ఉంటే అక్కడ భోజనాలు పెట్టమని తాను చెప్పలేనని స్పష్టం చేశారు. ఈ సమయంలో న్యాయాధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సాఫీగా జరిగిపోయే రిమాండ్‌ పొడిగింపునకు కోర్టు హాలులో ఇంతమంది అవసరమా? కోర్టు తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. ఇటువంటి పరిస్థితి పునరావృతమైతే తలుపులు మూసుకుపోతాయి. హడావుడి చేస్తే మీకే ఇబ్బంది. కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడుకునే అవకాశాన్ని కోల్పోతారు’’ అని వ్యాఖ్యానించారు. కాగా, మద్యం కుంభకోణంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న బాలాజీ గోవిందప్ప సీబీఐ కోర్టులో మంగళవారం బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.


నోటికి పనిచెప్పిన రాజ్‌ కసిరెడ్డి

నిందితులను మూడో అంతస్తులో సీబీఐ కోర్టు వద్దకు ఎస్కార్ట్‌ సిబ్బంది తీసుకొచ్చారు. వారితో మాట్లాడటానికి కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు భారీగా వచ్చారు. నిందితులందరినీ ఎస్కార్ట్‌ సిబ్బంది ఒకపక్కన కూర్చోబెట్టారు. రాజ్‌ కసిరెడ్డి మాత్రం అటూ ఇటూ తిరుగుతుండగా సిట్‌ ఎస్‌ఐ అమీద్‌ అడ్డుకున్నారు. దీంతో రాజ్‌ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీ పేరేంటి?’ అంటూ ఆయనతో గొడవకు దిగే విధంగా ప్రవర్తించడంతో పక్కనే ఉన్న సిబ్బంది సర్దిచెప్పి కూర్చోబెట్టారు. లిఫ్టులో నుంచి కోర్టు వద్దకు తీసుకొస్తున్న సమయంలోనూ వైసీపీ న్యాయ విభాగానికి చెందిన ఓ న్యాయవాది వారి వద్దకు వస్తుండగా సిట్‌ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోతూ, అసభ్య పదజాలంతో వారిని దూషించారు. దీనిపై న్యాయాధికారికి ఫిర్యాదు చేయాలని సిట్‌ అధికారులు యోచిస్తున్నారు.

Updated Date - Jun 04 , 2025 | 04:45 AM