Share News

Vijayanagaram: కారు డోర్లు లాకై.. నలుగురు చిన్నారులు దుర్మరణం

ABN , Publish Date - May 19 , 2025 | 03:42 AM

విజయనగరం జిల్లా ద్వారపూడిలో ఆట కోసం కారులోకి వెళ్లిన నలుగురు చిన్నారులు, డోర్లు ఆటోమేటిక్‌గా లాకయ్యడంతో ఊపిరాడక మృతి చెందారు.

Vijayanagaram: కారు డోర్లు  లాకై.. నలుగురు చిన్నారులు దుర్మరణం

  • ఆడుకునేందుకు కారెక్కిన చిన్నారులు

  • డోర్లు ఆటోలాక్‌ అవడంతో ఊపిరాడక మృతి

  • విజయనగరం జిల్లా ద్వారపూడిలో విషాదం

  • అందరూ ఎనిమిదేళ్లలోపు వయసున్న పిల్లలే

విజయనగరం, మే 18(ఆంధ్రజ్యోతి): వారంతా అభంశుభం తెలియని చిన్నారులు. ఓ శుభకార్యంలో కలుసుకున్నారు. ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఈ సరదా సమయంలో సమీపంలోని ఓ కారెక్కారు. అందులో ఆడుకునేందుకు ప్రయత్నించారు. కానీ.. అదే వారికి ‘చివరి ఆట’ అవుతుందని ఊహించలేకపోయారు. ఆకస్మికంగా కారు డోర్లు లాక్‌ కావడంతో ఊపిరాడక ఆ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. విజయనగరం సమీపంలోని ద్వారపూడి గ్రామంలో ఆదివారం జరిగిన ఈ విషాద ఘటనలో నలుగురు చిన్నారులు తుదిశ్వాస విడిచారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ద్వారపూడి గ్రామానికి చెందిన జోగ పరమేశ్‌ తన కారును రోడ్డుపై పార్కింగ్‌ చేసి ఇంటికి వెళ్లాడు. అక్కడికి సమీపంలోని ఓ ఇంట్లో శుభకార్యం జరుగుతోంది. దీనికి వచ్చిన నలుగురు చిన్నారులు కంది మనస్వి(7) మంగి ఉదయ్‌(8), బూర్లి జస్విత(7), బూర్లి చారుమతి(5) ఆడుకునేందుకు కారులోకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో వీరు కారులోకి వెళ్లడాన్ని గమనించలేదు. కొద్దిసేపటికి ఆటోమేటిక్‌గా డోర్లు లాక్‌ అయ్యాయి. ఆటలో మునిగిపోయిన చిన్నారులు ఈ విషయాన్ని గుర్తించలేకపోయారు. అయితే.. డోర్లు లాక్‌ కావడంతో వారికి ఊపిరి సలపడం కష్టమైంది. తర్వాత కొద్దిసేపటికే ఊపిరాడక నలుగురూ కారులోనే మృతి చెందారు.


ఇదిలావుంటే, చాలా సేపటి తర్వాత.. శుభకార్యానికి తీసుకువచ్చిన తమ చిన్నారులు కనిపించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆందోళనతో పక్కనే ఉన్న నుయ్యి, రైలు ట్రాక్‌, సమీపంలోని పొలాలు, తోటల్లో వెతికారు. అయినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. అంతలోనే తేలికపాటి వర్షం కురిసింది. చిన్నారుల కుటుంబ సభ్యులు వానలో తడుస్తూనే.. తమ బిడ్డల కోసం వెతుకుతూ కారు వైపుగా వచ్చారు. వర్షం నీటికి కారు అద్దాలు శుభ్రమై లోపలున్న చిన్నారులు అచేతన స్థితిలో కంట పడ్డారు. వెంటనే కారు అద్దాలు పగులగొట్టి వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతి చెందిన చిన్నారుల్లో బూర్లి జస్విత(7) బూర్లి చారుమతి(5) అక్కాచెల్లెళ్లు. మరో బాలిక కంది మనస్వి(7) సురేశ్‌, అరుణ దంపతులకు ఏకైక కుమార్తె. దీంతో ఆ కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఆడుకునేందుకు వెళ్లిన తమ బిడ్డలు విగజీవులుగా మారడం చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిలసేలా రోదించారు. కాగా, విషయం తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనాయడు, విజయనగరం జిల్లా కలెక్టర్‌ అంబేడ్కర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు గ్రామానికి వెళ్లి చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.


చిన్నారుల మృతిపై చంద్రబాబు దిగ్ర్భాంతి

విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో పట్టుమని పదేళ్లు కూడా నిండని ఏడుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యుక్తం చేశారు. ఈ దుర్ఘటనలు తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేవరాజపురంలో ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు గౌతమీ, శాలినీ, అశ్విన్‌ నీటి కుంటలో దిగి ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డల మృతితో తీవ్ర శోకంలో ఉన్న వారి తల్లిదండ్రులకు సీఎం సానుభూతి తెలిపారు. అలాగే, విజయనగరం జిల్లా ద్వారపూడిలో కారు డోర్లు లాక్‌ పడిన ఘటనలో నలుగురు చిన్నారులు చనిపోవడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. కారులో చిక్కుకుని, ఊపిరి అందక ఉదయ్‌, జాశ్రిత, చారులత, మణీశ్వరి ప్రాణాలు కోల్పోవడంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.

Updated Date - May 19 , 2025 | 05:17 AM