Budda Venkanna: రంగాతో వంశీకి పోలికా
ABN , Publish Date - May 26 , 2025 | 04:00 AM
టీడీపీ బుద్దా వెంకన్న, పేర్ని నాని పై కఠిన విమర్శలు చేశారు. వంశీని స్వాతంత్య్ర సమరయోధుడిగా పోల్చినందుకు పేరు నాని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

వంశీ ఏమైనా స్వాతంత్య్ర సమరయోధుడా?
పేర్ని నాని క్షమాపణ చెప్పాలి: బుద్దా వెంకన్న
విజయవాడ(వన్టౌన్), మే 25(ఆంధ్రజ్యోతి): ‘నీకు అసలు సిగ్గుందా? బియ్యం కుంభకోణంలో తప్పుడు పనులు చేసి, నీ భార్య పేరు పెడతావా? చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పిన నీవు విశ్వాసఘాతకుడిగా మాట్లాడుతున్నావు. వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పు’ అని మాజీ మంత్రి పేర్ని నానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న హితవు పలికారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వల్లభనేని వంశీని స్వాతంత్య్ర సమరయోధుడిగా పేర్ని నాని పోల్చారని తప్పుబట్టారు. పేదల కోసం పాటుపడిన వంగవీటి రంగాతో వంశీని పోల్చడం ఏమిటని మండిపడ్డారు. పేదలను అడ్డం పెట్టుకుని డబ్బు దండుకున్న వ్యక్తి వంశీ అన్నారు. పేర్ని నాని మోకాళ్లపై కూర్చుని రంగా అభిమానులకు, ఆయన కుమారుడు రాధాకృష్ణకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు తీసుకెళ్తుండగా వంశీ వాంతులు చేసుకున్నాడని, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, వంశీ వాంతులు చేసుకోవడం పేర్ని నాని చూశారా అని ప్రశ్నించారు.