Share News

Balakrishna: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సిందే

ABN , Publish Date - May 05 , 2025 | 05:33 AM

పద్మభూషణ్‌ అందుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణకు హిందూపురంలో ఘన పౌరసన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తన తండ్రి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు

Balakrishna:  ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సిందే

  • ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

హిందూపురం, మే 4(ఆంధ్రజ్యోతి): దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి నందమూరి తారకరామారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని ఎంజీఎం క్రీడా మైదానంలో ఆదివారం ఆయనకు పౌరసన్మాన సభ ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు, అభిమానులు ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి సింహాసనం, గద, కత్తి, పిల్లనగ్రోవిని బహూకరించారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ విజయం సాధించానని, అది హిందూపురం ప్రజల విజయమని అన్నారు. తనకు పద్మభూషణ్‌ ప్రదానం చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు ఇచ్చి వారినివారే గౌరవించుకోవాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలను కోరారు. అనంతరం మంత్రి సవిత, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, కందికుంట వెంకట ప్రసాద్‌, పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తదితరులు బాలకృష్ణను ఘనంగా సత్కరించారు.

Updated Date - May 05 , 2025 | 05:36 AM