AP PGCET Exam: రేపటి నుంచి ఏపీ పీజీసెట్
ABN , Publish Date - Jun 08 , 2025 | 04:06 AM
సోమవారం నుంచి ఏపీ పీజీ సెట్- 2025 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 9, 10, 11, 12 తేదీల్లో మూడు షిఫ్టులుగా పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 12.30 నుంచి..

తిరుపతి(విద్య), జూన్ 7(ఆంధ్రజ్యోతి): సోమవారం నుంచి ఏపీ పీజీ సెట్- 2025 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 9, 10, 11, 12 తేదీల్లో మూడు షిఫ్టులుగా పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు, మూడవ సెషన్ సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు జరుగనున్నాయి. మొదటి రోజు 17 సబ్జెక్టులకు, రెండో రోజు 7 సబ్జెక్టులకు, మూడవ రోజు 5 సబ్జెక్టులకు, నాల్గవ రోజు 2 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ సహా మన రాష్ట్రంలోని 30 కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయి. ఈ ఏడాది పీజీ సెట్లో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, టూరిజం, లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్లకు కలిపి ఒకే పరీక్షగా నిర్వహించనున్నారు. ఫలితంగా విద్యార్థులు ఒక్క పరీక్షతో ఏడు సబ్జెక్టుల్లో సీట్లు పొందే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు మొత్తం 31 సబ్జెక్టుల్లో పరీక్షలు జరుగనున్నాయి. ప్రశ్నపత్రాలను ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో సిద్ధం చేశారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషా సంబంధిత సబ్జెక్టులు మాత్రమే ఆయా మాధ్యమాల్లో ఉంటాయి. కాగా 9వ తేదీన పీజీసెట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్షతోపాటు డీఎస్సీ పరీక్ష కూడా ఉండటంతో రెండింటికీ హాజరుకానున్న అభ్యర్థుల కోసం ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్షను 10వ తేదీ మధ్యాహ్నం సెషన్లో నిర్వహించనున్నారు. పీజీసెట్ ఫలితాలను ఈనెల 25వ తేదీలోపు ప్రకటిస్తామని పీజీసెట్ చైర్మన్, ఎస్వీయూ వీసీ సీహెచ్ అప్పారావు చెప్పారు.