Share News

Ap Government: ఆరు ఆస్పత్రులకు సీటీ స్కాన్‌ మిషన్లు

ABN , Publish Date - Jun 03 , 2025 | 06:18 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6 ప్రభుత్వ ఆస్పత్రులకు సీటీ స్కాన్ మిషన్లు ఏర్పాటు చేయాలని రూ. 27 కోట్ల నిధులను ఆమోదించింది. అదేవిధంగా 3 ఆస్పత్రుల్లో క్యాథ్‌ల్యాబ్‌లు ఏర్పాటు చేయడానికి రూ. 17 కోట్ల నిధులు విడుదలకు ఆమోదమివ్వబడింది.

Ap Government: ఆరు ఆస్పత్రులకు సీటీ స్కాన్‌ మిషన్లు

  • రూ.27 కోట్లతో ఏర్పాటుకు మంత్రి సత్యకుమార్‌ ఆమోదం

  • రూ.17 కోట్లతో మూడు ఆస్పత్రులకు క్యాథ్‌ల్యాబ్‌లు

అమరావతి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సర్వజనాస్పత్రుల్లో (జీజీహెచ్‌) రోగ నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా జీజీహెచ్‌ల్లో సీటీ స్కాన్లు, క్యాథ్‌ల్యాబ్‌ల ఏర్పాటుకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ఆమోదం తెలిపారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు జీజీహెచ్‌ల్లో సీటీ స్కాన్లు ఏర్పాటు చేయనున్నారు. విశాఖలోని ప్రభుత్వ చెస్ట్‌ అండ్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ ఆస్పత్రిలో తొలిసారిగా సీటీస్కాన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనికి రూ.27 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి, నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని 18జీజీహెచ్‌ల్లో 21 సీటీస్కాన్‌ పరికరాలు ద్వారా రోగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం, నెల్లూరు, తిరుపతి జీజీహెచ్‌ల్లో గుండె పరీక్షలు చేసే క్యాథ్‌ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే ఈ పరికరాల కొనుగోలుకు దాదాపు రూ.17కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ నిధుల విడుదలకు మంత్రి ఆమోదం తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూ లు, కడప, అనంతపురం జీజీహెచ్‌ల్లో క్యాథ్‌ల్యాబ్‌ల ద్వారా యాంజియోగ్రామ్‌, స్టెంట్ల ఏర్పాటుసేవలందిస్తున్నారు.

Updated Date - Jun 03 , 2025 | 06:19 AM