AP High Court: డీఎస్సీపై జోక్యం చేసుకోం
ABN , Publish Date - Jun 03 , 2025 | 02:34 AM
హైకోర్టు డీఎస్సీ పరీక్షలపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది, పరీక్షలు జూన్ 6న యథాతథంగా నిర్వహించాలని తీర్పు వెలడించింది.సీబీఎస్ఈ అభ్యర్థుల అర్హతలపై పలు పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.

ఈ దశలో ‘స్టే’ విధించలేం
అలా చేస్తే.. ఉద్యోగార్థుల ప్రయోజనాలకు తీవ్ర నష్టం
స్పష్టం చేసిన హైకోర్టు
అమరావతి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): ‘మెగా డీఎస్సీ’ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్లలో జోక్యం చేసుకోబమని హైకోర్టు స్పష్టం చేసింది. పరీక్షలను నిలుపుదల చేసేందుకు సహేతుక కారణాలు కనిపించడం లేదని పేర్కొంది. ఉద్యోగార్థుల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పరీక్షల నిర్వహణపై స్టే విధించలేమని తెలిపింది. ఇప్పటికే హాల్ టికెట్లు జారీ చేశారని, పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొంది. ప్రస్తుత పిటిషన్ల ఆధారంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే ఉద్యోగార్థుల ప్రయోజనం ప్రమాదంలో పడుతుందని తెలిపింది. ఉద్యోగాల భర్తీ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకొనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. డీఎస్సీ నోటిఫికేషన్ ఆధారంగా ఈ నెల 6 నుంచి నిర్వహించనున్న పరీక్షలను నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలైన అన్ని అనుబంధ పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు.
ఇవీ పిటిషన్లు..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన వి. సాంబశివరావు సహా నలుగురు పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఎస్ఈ 10వ తరగతిలో తెలుగు సెకండ్ లాంగ్వేజ్గా ఎంచుకున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్లో టీచర్ పోస్టుల భర్తీకి మొదటి భాషగా తెలుగు చదివి ఉండాలని పేర్కొందని, ఈ కారణంతో తమ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. సీబీఎస్ఈ చదివే విద్యార్థులకు మొదటి భాషగా ఆంగ్లం ఉంటుందని తెలిపారు. తమ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని, డీఎస్సీ పరీక్షలు రాసేందుకు అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
ప్రభుత్వం 2011లో జీవో 51కి అనుగుణంగా విద్యా సంవత్సరంలో రెండుసార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహించకుండా స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరుతూ విజయనగరంజిల్లాకు చెందిన ఎం. షరీఫ్ సహా ఆరుగురు హైకోర్టులో పిటిషన్లు వేశారు. బీఈడీ, డీఈడీ చివరి సంవత్సరం చదువుతున్నవారిని డీఎస్సీ పరీక్షలకు అనుమతించాలని కోరారు. పరీక్షకు సిద్ధమయ్యేందుకు కనీసం 90 రోజులు గడువు ఉండేలా నోటిఫికేషన్ను రీషెడ్యూల్ చేసేలా అధికారులను ఆదేశించాలని అభ్యర్థించారు. ప్రస్తుత నోటిఫికేషన్ను రద్దు చేయాలని కోరారు.
కొన్ని పోస్టులకే అలా..
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్జీపీ) ఎస్. ప్రణతి వాదనలు వినిపిస్తూ.. నిర్దిష్ఠ పోస్టులు తప్ప మిగిలిన పోస్టులకు సీబీఎ్సఈలో మొదటి భాష ఆంగ్లం చదివినవారు కూడా అర్హులేనని తెలిపారు. వయోపరిమితి పెంచాలని కోరుతున్న పిటిషనర్లకు 2024 నోటిఫికేషన్ నాటికే అర్హత లేదన్నారు. ఏడాదికి రెండుసార్లు ‘టెట్’ నిర్వహించాల్సిన అవసరం లేదని తెలిపారు. దీనిపై 2021, మార్చిలో సవరణ జీవో ఇచ్చారన్నారు. 2024, నవంబరు నుంచి డీఎస్సీ-2025 సిలబస్ వెబ్సైట్లో అందుబాటులో ఉందని, పరీక్షకు సిద్ధమయ్యేందుకు తగినంత సమయం ఇచ్చామని వివరించారు. 90 రోజుల సమయం ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఏడాదికి ఒకసారి టెట్ నిర్వహిస్తే సరిపోతుందని 2021, మార్చి 17న ప్రభుత్వం జీవో ఇచ్చిందని తెలిపారు. పరీక్షకు 90 రోజుల గడువు ఇవ్వాలనే హక్కు పిటిషనర్లకు లేదన్నారు.