CM Chandrababu Naidu: ఉపాధ్యాయుడిగా మారిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 10 , 2025 | 06:07 PM
జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పదో తరగతి విద్యార్థులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు.

పండుగ వాతావరణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం
ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి పాల్గొన్న మంత్రి లోకేష్
చంద్రబాబు పాదాలకు నమస్కరించిన లోకేష్
చంద్రబాబుతో కలిసి విద్యార్థులతో ఇష్టాగోష్టి
పాఠాలు చెప్పిన సీఎం చంద్రబాబు.. విద్యార్థిగా మారి శ్రద్ధగా విన్న మంత్రి లోకేష్
పాఠశాలల్లో మార్పులు తీసుకు వచ్చారంటూ మంత్రి లోకేష్ను ప్రశంసించిన సీఎం చంద్రబాబు
పుట్టపర్తి, జులై 10: శ్రీ సత్యసాయి జిల్లా జడ్పీ పాఠశాలలో జరిగిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పీటీఎం 2.0 కార్యక్రమం ఆద్యంతం పండుగ వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతోపాటు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో వారు ముఖాముఖి నిర్వహించారు. తొలుత జిల్లాలో కొత్త చెరువులోని జూనియర్ కళాశాల ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాదాలకు మంత్రి నారా లోకేష్ నమస్కరించారు.
అనంతరం తన నలుగురు పిల్లలకు తల్లికి వందనం పథకం కింద సాయం పొందిన పి. మాధవితోపాటు వారు సీఎం చంద్రబాబు పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం పొందారు. ఆ తర్వాత తల్లల గొప్పదనంతో పాటు తల్లికి వందనం పథకం గురించి తెలియజేసేలా కళాశాలలో ఏర్పాటు చేసిన చిత్రాలను సీఎం పరిశీలించారు. అనంతరం ఎన్సీసీ క్యాడెట్స్ గౌరవ వందనం మధ్య జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.
చంద్రబాబుతో విద్యార్థులు ఇష్టాగోష్టి
ముందుగా జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పదో తరగతి విద్యార్థులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థుల.. ప్రగతి, అభిరుచి, ప్రవర్తన, ఆరోగ్యం హాజరు తదితర అంశాలతో కూడిన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులు పి. రిహాన్ బాష, పి. జిగ్ను ప్రోగ్రెస్ కార్డులను ఆయన పరిశీలించారు.
వారి మార్కులను అడిగి తెలుసుకున్నారు. వారి తల్లిదండ్రులతో సైతం మాట్లాడారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇంకా బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. స్కూల్కు గైర్హాజరైన విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రులకు ఆగష్టు నుంచి మెసేజ్ రూపంలో తెలియజేస్తామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తెలిపారు.
ఉపాధ్యాయుడిగా మారి పాఠాలు చెప్పిన చంద్రబాబు..
పదో తరగతి విద్యార్థులతో ఇష్టాగోష్టి అనంతరం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోని 8వ తరగతి బి సెక్షన్కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఉపాధ్యాయుడుగా మారి విద్యార్థులకు ‘వనరులు’ అనే సబ్జెక్ట్పై క్లాస్ చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థిగా మారిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ముందు బెంచీలో కూర్చొని వారు చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా విన్నారు.
మానవ వనరులు అంటే ఏమిటి, సహజ వనరులు, పునరుత్పాదక వనరులు, పునరుత్పాదకం కాని వనరులపై విద్యార్థులకు ముఖ్యమంత్రి పాఠాన్ని బోధించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి.. వారి నుంచి సమాధానాలు రాబట్టారు. సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని విద్యార్థులకు ఉద్బోధించారు. తద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని వారికి దిశానిర్దేశం చేశారు.
మంత్రి లోకేష్ ను ప్రశంసించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
భవిష్యత్లో విద్యార్థులు ఏం కావాలనుకుంటున్నారని ఈ సందర్భంగా విద్యార్థులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడిగి తెలుసుకున్నారు. పోలీస్, డాక్టర్, ఐఏఎస్, క్రికెట్ ప్లేయర్లు కావాలనుకునే వారు చేతులు పైకి ఎత్తాలని సూచించారు. వారంతా తమ లక్ష్యాన్ని చేతులుపైకి ఎత్తి చెప్పారు. విద్యార్థులకు ఆశయం ఉండాలని.. ఆశయ సాధన కోసం ఇప్పటి నుంచే కష్టపడి చదవాలని మార్గదర్శనం చేశారు. అందరికీ గుడ్ లక్.. ఆల్ ది బెస్ట్ చెప్పారు.
రాజకీయ నాయకులు కావాలనుకునే వారు చేతులు ఎత్తాలని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ అడగగా.. ఎవరూ చేయిపైకి ఎత్తలేదంటూ నవ్వులు పూయించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. నారా లోకేష్ బాగా చదువుకున్నారు. మంత్రి అయ్యారు. తల్లికి వందనం అమలు చేశారా? లేదా?.. పాఠశాలల్లో మార్పులు తీసుకు వచ్చారంటూ ఆయనను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. అనంతరం విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు. మార్కులపై ఆరా తీశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
Read Latest Andhrapradesh News and National News