AP CM Chandrababu: మూడు ముక్కలాటకు ఇక చెల్లు
ABN , Publish Date - May 09 , 2025 | 03:12 AM
ఆంధ్రప్రదేశ్కు అమరావతినే ఏకైక శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విభజన చట్టంలో సవరణ చేయాలని కోరింది. రాజధాని మార్పుల గందరగోళానికి ఫుల్స్టాప్ పెట్టే దిశగా కేబినెట్ తీర్మానం ఆమోదించింది

అమరావతే ఏకైక శాశ్వత రాజధాని
విభజన చట్టంలో చేర్చాలని కేంద్రానికి వినతి
సెక్షన్-5ను సవరించాలని అభ్యర్థన
సదరు తీర్మానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం
రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రధానికి ధన్యవాదాలు
ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారుస్తామనకుండా.. ఆ పేరుతో మూడు ముక్కలాట ఆడకుండా అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అమరావతినే ఆంధ్రప్రదేశ్కు ఏకైక, శాశ్వత రాజధానిగా పేర్కొంటూ రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాల్సిందిగా కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం తీర్మానం ఆమోదించింది. కేంద్రం ఈ దిశగా చర్యలు తీసుకుంటే.. రాష్ట్రానికి చట్టబద్ధమైన రాజధానిగా అమరావతి ఆవిర్భవిస్తుంది. విభజన చట్టం-2014లోని సెక్షన్-5, సబ్సెక్షన్-2లో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఆ తర్వాత తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని.. ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటవుతుందని పేర్కొన్నారు.
కేంద్రం ఏపీ కొత్త రాజధాని అమరావతి అని పేర్కొంటూ సదరు సెక్షన్ను సవరిస్తే అమరావతి చట్టబద్ధమవుతుంది. రాజధాని మార్పు నాటకాలకు దాంతో తెరపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై ఇప్పుడు కేబినెట్లో చర్చించి తీర్మానం ఆమోదించారు. అలాగే అమరావతికి వచ్చి రాజధాని పున్నర్నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రధాని మోదీకి మంత్రిమండలి ధన్యవాదాలు తెలిపినట్లు మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు తెలిపారు. ‘గత ఐదేళ్లలో ఏపీ రాజధాని ఏదీ అనడిగితే చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితి ఉన్న విషయం తెలిసిందే. వాళ్ల ఇష్టం వచ్చినట్లు 3రాజధానులు, రకరకాల పేర్లు పెట్టి ఏ రాజధానినీ నిజం చేయలేదు. భవిష్యత్లో ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో.. రాష్ట్రానికి గర్వించదగిన రాజధానిని నిర్మించాలని సీఎం సంకల్పించారు. అమరావతిని రాజధానిగా పేర్కొంటూ కేంద్రం సదరు చట్టంలో సవరణ చేయాలనే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇక భవిష్యత్లో ఎవరూ రాజధానితో పిచ్చి ఆటలు ఆడకుండా, ప్రజల్లో గందరగోళం సృష్టించకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాం’ అని కొలుసు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో.. రూరల్ టూరిజం ప్రమోట్..
ఆపరేషన్ సిందూర్పై చైనా, అమెరికా స్పందన
For More AP News and Telugu News