Minister Gottipati Ravi: అదానీ మీటర్లపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వండి
ABN , Publish Date - Jun 09 , 2025 | 02:30 AM
అదానీ స్మార్ట్ మీటర్ల పనితీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలించి 24 గంటల్లోగా నివేదికను సమర్పించాలని విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్)లను ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ‘ఆంధ్రజ్యోతి’లో ఆదివారం ‘స్మార్ట్ షాక్’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు.

క్షేత్రస్థాయిలో పనితీరును పరిశీలించండి
డిస్కమ్లకు మంత్రి గొట్టిపాటి ఆదేశం
బిల్లులు ఎక్కువగా వస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని అంగీకారం
కెపాసిటర్లు మార్చుకోవాలని ఏపీసీపీడీసీఎల్ సలహా
నేడు డిస్కమ్ల అత్యవసర సమావేశం
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
అమరావతి, జూన్ 8(ఆంధ్రజ్యోతి): అదానీ స్మార్ట్ మీటర్ల పనితీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలించి 24 గంటల్లోగా నివేదికను సమర్పించాలని విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్)లను ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ‘ఆంధ్రజ్యోతి’లో ఆదివారం ‘స్మార్ట్ షాక్’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు. అదానీ మీటర్ల పనితీరుపై క్షేత్రస్థాయి విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం నాటికి దీనిపై సమగ్ర నివేదికను సమర్పించాలని డిస్కమ్లను ఆదేశించారు. స్మార్ట్ మీటర్లతో బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్న విషయం తన దృష్టికి వచ్చిందని మంత్రి అంగీకరించారు. ఎవరికి కూడా అనవసరంగా ఒక్క రూపాయి కూడా భారం పడేందుకు వీల్లేదని గొట్టిపాటి స్పష్టం చేశారు. కాగా చార్జీలు ఎక్కువగా వస్తున్నాయని తన దృష్టికి వచ్చిందని మంత్రి అంగీకరించగా... ఏపీసీపీడీఎల్ వివరణ పేరిట విడుదల చేసిన ప్రకటనలో అదానీ మీటర్లను వెనకేసుకు వస్తూ వితండవాదం చేసింది. అదానీ మీటర్లను బిగించాక వినియోగదారులు కెపాసిటర్లను మార్చుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చింది. అంటే.. కెపాసిటర్లను మార్చుకోకపోతే చార్జీల భారం తడిసి మోపెడవుతుందని పరోక్షంగా అంగీకరించింది. పవర్ ఫ్యాక్టర్ను సరిగా ఉంచుకోకపోవడం, కెపాసిటర్లను మార్చుకోనందునే విద్యుత్తు బిల్లులు పెరుగుతున్నాయంటూ డిస్కమ్ తన వివరణలో పేర్కొంది. అయితే కెపాసిటర్లను మార్చుకోవాలంటే ఒక్కో పరిశ్రమపై సగటున రూ.25,000 నుంచి లక్ష రూపాయల దాకా, గృహాలకు రూ.5000 నుంచి రూ.10,000 దాకా భారం పడుతుందని అంటున్నారు. అంతేగాక అదానీ మీటర్లు బిగించినందుకు గృహాల నుంచి నెలకు రూ.86 చొప్పున 92 నెలలు రూ.7,912, త్రీఫేజ్ వినియోగదారుల నుంచి నెలకు రూ.176 చొప్పున 92 నెలలు రూ.16,192 అదనంగా వసూలు చేస్తారు. అదానీ మీటర్ల పనితీరును సమీక్షించకుండా, క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా జగన్ జమానాలో తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం యథాతథంగా అమలు చేయడం ఏమిటని ప్రజా సంఘాలు, నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్థాయిలో అత్యున్నత సమీక్ష చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
నేడు డిస్కమ్ల భేటీ
అదానీ మీటర్ల పనితీరుపై సమీక్షించేందుకు డిస్కమ్లు సోమవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం పారిశ్రామిక రంగానికే మీటర్లను బిగించాలన్న నిర్ణయం ఉన్నా.. అదానీ సంస్థ సిబ్బంది వెళ్లి మురికివాడల్లోనూ మీటర్లను బిగిస్తున్నట్లు తెలియడంతో డిస్కమ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మీటర్ల పనితీరు పరీక్షించకుండానే నేరుగా బిగించడాన్ని తప్పు పడుతున్నాయి. మీటర్లను బిగించే ముందు డిస్కమ్ల ఇంజనీరింగ్ అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గృహాలకు స్మార్ట్ మీటర్లను బిగించడంపై ఇంకా స్పష్టత ఇవ్వకముందే.. ప్రస్తుతం ఉన్న మీటర్ల స్థానంలో అదానీ మీటర్లను బిగించే ప్రక్రియను వేగవంతం చేయడంపై డిస్కమ్ల యాజమాన్యాలు మండిపడుతున్నాయి. అదానీ మీటర్లపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం ఇంధన శాఖను కదిలించిందని ఆ శాఖ అధికారులు అన్నారు.
డిస్కమ్ల ఇష్టారాజ్యం
మీటర్ల నుంచి ట్రాన్స్ఫార్మర్ల దాకా కొనుగోళ్లలో డిస్కమ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. 2017లో రాష్ట్రంలో విద్యుత్తు చౌర్యాన్ని సమూలంగా నిర్మూలించేందుకు వీలుగా ఐఆర్డీ స్మార్ట్ వైబ్రేషన్ మీటర్లను కొనుగోలు చేస్తున్నామని అట్టహాసంగా ప్రకటించాయి. ఈ మీటర్ల వాడకంతో డిస్కమ్ల వారీగా ఎంతెంత కరెంటు వినియోగిస్తున్నారో తెలుస్తుందని వెల్లడించాయి. దీనివల్ల డిమాండ్ను బట్టి కరెంటు ఉత్పత్తి హెచ్చుతగ్గులు, బహిరంగ మార్కెట్లో కొనుగోళ్లపై దృష్టి పెడతామని పేర్కొన్నాయి. ఈ మీటర్లను బిగించే ప్రక్రియ పూర్తికాకుండానే అదానీ స్మార్ట్ విద్యుత్తు మీటర్లను తెరపైకి తెచ్చారు. ఇప్పుడు మళ్లీ 2017 నాటి ఐఆర్డీ మీటర్ల కథను సరికొత్తగా చెబుతున్నాయి.