Share News

Sand Scam Probe: ఇసుకాసురులపై సిట్‌

ABN , Publish Date - May 24 , 2025 | 03:24 AM

వైసీపీ హయాంలో రూ.2,566 కోట్ల ఇసుక అక్రమాలకు సంబంధించి ఏసీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మైనింగ్‌ అధికారుల, వైసీపీ నేతల పాత్రపై ఆధారాలు సేకరించి విచారణ ప్రారంభమైంది.

Sand Scam Probe: ఇసుకాసురులపై సిట్‌

  • వైసీపీ హయాంలో రూ.2,566 కోట్ల అక్రమాలు

  • నేతలు జిల్లాలను పంచుకుని అడ్డంగా తవ్వేశారు

  • డబ్బు మూటలతో రీచ్‌లను గుప్పిట పట్టిన అరాచకం

  • మరో భారీ కుంభకోణం వెలికితీతకు ఏసీబీ ‘సిట్‌’

  • రాయలసీమ జేడీ రాజశేఖర్‌రావు నేతృత్వంలో ఏర్పాటు

  • ఏఎస్పీ, నలుగురు డీఎస్పీలు, 9మంది సీఐలూ..

  • నాటి కాంట్రాక్టు కంపెనీలు, మైనింగ్‌ అధికారులు, వైసీపీ నాయకుల పాత్రపై ఆధారాలు

  • ఎక్కడెక్కడ తవ్వారు, సహకరించిన మైనింగ్‌ అధికారులు, చోద్యం చూసిన సెబ్‌ అధికారులపై ఆరా!

  • ఇటు లిక్కర్‌.. అటు ఇసుక.. రెండు భారీ స్కామ్‌లలో కీలక వ్యక్తి కాఫీ షాప్‌ ఓనర్‌

  • రెండు కేసుల్లోనూ వినిపిస్తున్న పేరు బాలం సుధీర్‌

వైసీపీ హయాంలో జరిగిన రూ. కోట్ల ఇసుక దోపిడీ గుట్టును తవ్వి తీసేందుకు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి 2,566 కోట్ల రూపాయల నష్టం కలిగించిన అక్రమార్కుల పని పట్టబోతోంది.

అమరావతి, మే 23 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వంలో ఇసుక దోపిడీకి పాల్పడ్డ ఇసుకాసురుల పని పట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) బృందాన్ని ఏర్పాటు చేసింది. పద్నాలుగు మందితో కూడిన ఈ సిట్‌కు రాయలసీమ జాయింట్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌ రావు నేతృత్వం వహిస్తారని తెలిపింది. అడిషనల్‌ ఎస్పీ దిలీ్‌పకుమార్‌, డీఎస్పీలు కిశోర్‌(దర్యాప్తు అధికారి), సుబ్బరాజు, రామకృష్ణ, జెస్సీ ప్రశాంతి ఈ బృందంలో కీలకంగా వ్యవహరిస్తారు. వారికి సహాయకులుగా తొమ్మిదిమంది సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు ఉంటారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా... ఇలా మూడు జోన్లుగా విభజించి ఏ జోన్లో ఎన్ని ఇసుక రీచ్‌లు ఉన్నాయి.. వాటిలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఇసుక తవ్వారు.. కాంట్రాక్టు కంపెనీయా లేదా స్థానిక వైసీపీ నాయకులా అనేదానితోపాటు, ఇందుకు .సహకరించిన మైనింగ్‌ అధికారులు.. చోద్యం చూసిన సెబ్‌ అధికారులు.. తవ్విన ప్రొక్లయినర్ల్లు, ఇసుక తీసుకెళ్లిన లారీలు చేరిన గమ్యం.....ఇలా ప్రతి విషయాన్నీ విశ్లేషించుకుని పూర్తి స్థాయిలో ఉచ్చు భిగించేందుకు ఏసీబీ సిట్‌ నడుం భిగించింది. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలను సైతం ధిక్కరించి రాత్రింబవళ్లూ నదీగర్భాన్ని తవ్వి తరలించిన ప్రతి ఒక్కరి పనీ ‘సిట్‌’ పట్టబోతోంది. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక తవ్వకాల కాంట్రాక్టు కంపెనీలు, సబ్‌ కాంట్రాక్టు తీసుకున్న సంస్థలు, జిల్లాల్లో అడ్డూఅదుపు లేకుండా తవ్వేసి తరలించిన వైసీపీ నేతలు, పూర్తిగా సహకరించిన మైనింగ్‌ అధికారుల పాత్రపై ఆధారాలను ఏసీబీ ఇప్పటికే సేకరించింది. ఏపీలోని నదులు, వాగుల నుంచి పొరుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి మహా నగరాలకు అక్రమ ఇసుక ఎలా తరలి వెళ్లిందో ఏసీబీ పసిగట్టింది. తాడేపల్లిలోని సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ కార్యాలయం నుంచి ఏసీబీ సిట్‌ తన పని మొదలు పెట్టనుంది.

జిల్లాలను పంచుకుని తవ్వేశారు

గత జగన్‌ పాలనలో ఇసుక తవ్వకాల పేరుతో భారీ అవకతవకలకు 2021 మే నుంచి బీజం పడింది. జిల్లాల్లో అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు ఇసుక అక్రమంగా తరలించి భారీగా లాభపడుతున్నట్లు జగన్‌ తాను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పసిగట్టారు. స్థానిక నేతలు ఆర్థికంగా బలపడితే తన మాట వినరనే ఆలోచనతోపాటు అవినీతిని కేంద్రీకృతం చేస్తే వేల కోట్లు తనకే చేరతాయనే అసలు లక్ష్యంతో ఇసుక రీచ్‌లను టెండర్‌ పద్ధతిలో కట్టబెట్టారు. జై ప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌(జేపీ వెంచర్స్‌) నవంబర్‌ 2023 వరకూ ‘కాగితాల’పై తవ్వకాలు చేపట్టినా ఏడాదిలోనే తన వల్ల కాదంటూ చేతులెత్తేసింది. ఆర్నెల్లు బలవంతంగా టెండర్‌ పొడిగించి, ఆ తర్వాత టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌కు అప్పగించారు. ఎక్కడికక్కడ వైసీపీ నేతలు (చిత్తూరులో పెద్దిరెడ్డ్డి, నెల్లూరులో వైసీపీ నేతలు, గుంటూరులో నందిగం సురేశ్‌, కృష్ణాలో కొడాలి నాని, గోదావరి జిల్లాల్లో అక్కడి నేతలు, ఉత్తరాంధ్రలో అప్పటి వైసీపీ 2పేరుతో) ఇసుక తవ్వుకొని తీసుకెళుతుంటే ‘మా వల్ల కాదం’టూ టర్న్‌ కీ దండం పెట్టేసింది. మూడో కృష్ణుడి రూపంలో ప్రతిమా అనే కంపెనీ ముందుకొచ్చినా రాజస్థాన్‌కు చెందిన జీసీకేఎల్‌కు మొత్తంగా ఇచ్చేసింది. ఏదీ సాధ్యం కాకపోవడంతో జిల్లాల్లోని నేతలకే ఎక్కడికక్కడ కట్టబెట్టేందుకు గత ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ పెద్దలు ముందుగా ఎవరు టేబుల్‌పై డబ్బులు పెడితే వారికే ఇసుక రీచ్‌లు అంటూ ఆఫర్‌ ఇచ్చారు. ఆశపడి రూ.పది కోట్టు ఇచ్చుకున్న గోదావరి జిల్లాల్లో ఓ కాంట్రాక్టరు చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

వెంకటరెడ్డితో మొదలుపెట్టి..

వైసీపీ ప్రభుత్వంలో ఇసుక టెండర్లు, తవ్వకాల్లో భారీగా జరిగిన అక్రమాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 2,566 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కూటమి ప్రభుత్వం నిర్ధారించింది. మైనింగ్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వెంకట రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. ఇండియన్‌ కోస్ట్‌గార్డులో సీనియర్‌ సివిలియన్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తోన్న వెంకటరెడ్డి ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు. గనుల శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి 2020 నుంచి అక్రమాలకు పాల్పడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత విచారణకు ఆదేశించడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ప్రాథమిక విచారణలో కీలక ఆధారాలు బయటపడ్డాయి. దీంతో ఏసీబీ అధికారులు వెంకట రెడ్డిపై అవినీతి నిరోధక చట్టంతోపాటు ఇండియన్‌ మినరల్స్‌ యాక్టు, ఐపీసీలోని నేరపూరిత కుట్ర, మోసం సెక్షన్లతో అభియోగాలు మోపారు. సహ నిందితులుగా అనిల్‌ ఆత్మారామ్‌ కామత్‌ (జేపీవీఎల్‌), పి.అనిల్‌ కుమార్‌ (ప్రతిమా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌); ఆర్‌.వెంకటకృష్ణారెడ్డితోపాటు(జేసీకేఎల్‌ ప్రాజెక్ట్స్‌ అండ్‌ వర్క్స్‌) జేపీవీఎల్‌, ప్రతిమా సంస్థలను కూడా చేర్చింది. విచారణకు పిలుద్దామని ఏసీబీ అధికారులు ప్రయత్నించగా వెంకటరెడ్డి పరారయ్యారు. చివరికి గతేడాది సెప్టెంబరు చివరి వారంలో హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని విజయవాడ జైలుకు పంపారు. కండీషన్‌ బెయిల్‌పై విడుదలై వారానికి రెండుసార్లు ఏసీబీ కార్యాలయానికి వచ్చి వెంకటరెడ్డి సంతకం చేసి వెళుతున్నారు. ఇక...ఆయన సహ నిందితులకూ ఉచ్చు బిగించేందుకు ‘సిట్‌’ సిద్ధమవుతోంది.

ఇటు లిక్కర్‌లో.. అటు ఇసుకలో..

రెండు భారీ స్కామ్‌లలో కీలక వ్యక్తి కాఫీ షాప్‌ ఓనర్‌

రెండు కేసుల్లోనూ వినిపిస్తున్న ఏకైక పేరు బాలం సుధీర్‌

అమరావతి, మే 23(ఆంధ్రజ్యోతి): ‘నేను తెలుగు భాష లెక్క.. ఆడా ఉంటా, ఈడా ఉంటా’.. ఇది ఒక సినిమాలో హీరో అల్లు అర్జున్‌ చెప్పే ఫేమస్‌ డైలాగ్‌.. ‘నేను వైసీపీ పాలనలో స్కాముల లెక్క.. అందులోనూ ఉంటా, ఇందులోనూ ఉంటా’ అంటున్నాడు ఓ కాఫీ షాప్‌ ఓనర్‌. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన బాలం సుధీర్‌ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ‘బియాండ్‌ కేఫ్‌’ పేరుతో కాఫీ షాప్‌ నిర్వహిస్తున్నారు. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘కాఫీ షాపు వర్కర్‌ లిక్కర్‌ కథ ఇదీ’ అంటూ ప్రచురితమైంది. ఆ వార్తలో పురుషోత్తం వరుణ్‌ కుమార్‌ అనే రూ.32 వేల ఉద్యోగికి లిక్కర్‌ స్కామ్‌లో పాత్ర ఎలా ఉందనే సమాచారం ఇటు లిక్కర్‌ సిట్‌.. అటు ఏసీబీ అధికారుల్లో చర్చకొచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని కాఫీ షాపు గురించి ఆరా తీసిన దర్యాప్తు సంస్థలకు సుధీర్‌ పేరు తెలిసింది. లిక్కర్‌ స్కామ్‌లో ఏ1 రాజ్‌ కసిరెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన సుధీర్‌ కేఫ్‌లో మద్యం అక్రమార్కులు తరచూ కలిసేవారని సిట్‌ అధికారులకు సమాచారం ఉంది. మద్యం వ్యాపారుల నుంచి ముడుపులు అందుకున్న క్యాష్‌ హ్యాండ్లర్లు పలుమార్లు ఇదే కాఫీ షాపులోకి రాజ్‌ కసిరెడ్డి సూచన మేరకు డబ్బు సంచులు ఇచ్చి వెళ్లినట్లు ఆధారాలున్నాయి. ఈ నేపథ్యంలో లిక్కర్‌ సిట్‌ అధికారులు కూపీ లాగుతున్నా రు. కాగా.. ఇసుక అక్రమ తవ్వకాల కేసు దర్యాప్తు చేస్తోన్న ఏసీబీ అధికారులు ఇటీవల సుధీర్‌ను పిలిచి విచారించారు. కాకినాడకు చెందిన ఒక వైసీపీ నాయకుడి సహకారంతో ఇసుక అక్రమ తవ్వకాల్లోకి ప్రవేశించిన సుధీర్‌ భారీగా హైదరాబాద్‌కు ఇసుక అక్రమంగా తరలించినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. ఎంపీ అయ్యేందుకు పార్టీలు మారి ఓటమిలో రికార్డు సృష్టించిన ధనికుడి ద్వారా రాజ్‌ కసిరెడ్డితోనూ పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇదే పరిచయంతో పురుషోత్తం వరుణ్‌ కుమార్‌ను ఏపీలో లీలా డిస్టిలరీ్‌సకు ఇన్‌ఛార్జిగా ముందు పెట్టి మొత్తం బాగోతం సుధీర్‌ నడిపించినట్లు సమాచారం.

Updated Date - May 24 , 2025 | 03:25 AM