Share News

తెలుగు రాష్ట్రాల్లో ఘోరం.. ఈతకు వెళ్లి ఏడుగురు యువకులు గల్లంతు..

ABN , Publish Date - Jun 07 , 2025 | 08:48 PM

తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నదీ స్నానానికి వెళ్లి అల్లూరి జిల్లాలో ఒకరు, భూపాలపల్లి జిల్లాలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లో ఘోరం.. ఈతకు వెళ్లి ఏడుగురు యువకులు గల్లంతు..

ఇంటర్నెట్ డెస్క్, జూన్ 7: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే రోజు ఒకే తరహా విషాదాలు చోటు చేసుకున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరు నదిలో సరదాగా నదీ స్నానానికి వెళ్లిన ఐదుగురు యువకులు ప్రవాహ వేగానికి కొట్టుకుపోయారు. అదే సమయంలో స్థానికులు గమనించి యువకులను కాపాడేందుకు ప్రయత్నించారు. వీరిలో నలుగురిని ఒడ్డుకు చేర్చగలిగారు కానీ, అభిలాష్ అనే యువకుడు మాత్రం గల్లంతయ్యాడు. చింతూరు మండలంలోని మోతుగూడెం సమీపంలో ఈ విషాద ఘటన జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు.. నదిలో కొట్టుకుపోయిన యువకుడి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు.


మరోవైపు తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ ఆరుగురు యువకులు నదీ స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ ఎగువ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. గోదావరిలో స్నానానికి వెళ్లిన ఏడుగురు యువకులు ప్రమాదవశాత్తూ కొట్టుకుపోగా.. ఒక్కరు మాత్రమే సురక్షితంగా బయటపడిగలిగారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు. అయితే గల్లంతైన వారిలో నలుగురు యువకులు అంబటిపల్లికి చెందినవారు కాగా.. మిగతా ఇద్దరు కొర్లకుంట గ్రామస్థులు. అంబటిపల్లికి చెందిన నలుగురూ ఒకే కుటుంబానికి చెందినవారని సమాచారం. ప్రమాదం గురించి తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. జాలర్ల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఏపీకి గూగుల్.. స్థలం పరిశీలన పూర్తి

తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 07 , 2025 | 09:46 PM