CM Revanth Reddy: ప్రభుత్వ నిర్ణయంతో వారి జీవితాల్లో మార్పు
ABN , Publish Date - Dec 26 , 2024 | 04:07 AM
రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్లు కొంతమంది ట్రాఫిక్ పోలీసు ఫోర్స్ అసిస్టెంట్లుగా నియామకమై వెంటనే విధులు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియామకమైన ట్రాన్స్జెండర్లపై సీఎం రేవంత్
హైదరాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్లు కొంతమంది ట్రాఫిక్ పోలీసు ఫోర్స్ అసిస్టెంట్లుగా నియామకమై వెంటనే విధులు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘‘తరతరాల నుంచి ట్రాన్స్జెండర్లను జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చే విషయం ఎవరూ ఆలోచించలేదు. వాళ్ల శక్తిని సమాజానికి మంచి చేసే విధంగా ఉపయోగించుకోవడానికీ ఆలోచన చేయలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ పోలీసు ఫోర్స్ అసిస్టెంట్లుగా నియమించింది. అందుకోసం వారిని గుర్తించి, శిక్షణ ఇచ్చి ఆ పోస్టుల్లో నియమించింది. నియామకమైన మొదటి రోజు నుంచే వాళ్లు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం గర్వంగా ఉంది. వాళ్ల జీవితాల్లో వచ్చిన ఈ మార్పు విజయవంతం అయ్యేందుకు అందరం సహకరిద్దాం.’’ అంటూ సీఎం రేవంత్ బుధవారం తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు.