భద్రాచలంలో పెరిగిన భక్తుల రద్దీ..
ABN , Publish Date - Apr 12 , 2026 | 10:40 AM
వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆదివారం తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్నారు.
భద్రాచలం, ఏప్రిల్ 12: వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో భద్రాచలంలో కొలువుదీరిన శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆదివారం తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా శ్రీరామ నామస్మరణతో మార్మోగిపోయింది. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి వారి దర్శనానికి వెళ్లారు. భక్తులతో క్యూ లైన్లు అన్నీ నిండిపోయాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అంతరాయంలోని మూలమూర్తులను భక్తులు దర్శించుకొంటున్నారు.
మరోవైపు భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. భక్తులు భారీగా తరలి రావడంతో.. భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, ట్రాఫిక్ను క్రమబద్దీకరిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం గోదావరి ఘాట్ వద్ద నదికి హారతి ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.