ఏపీ లిక్కర్ స్కామ్.. రాజ్ కసిరెడ్డి రెగ్యులర్ బెయిల్కు సుప్రీంకోర్టు నిరాకరణ
ABN , Publish Date - Feb 12 , 2026 | 11:29 AM
ఏపీ లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. రాజ్ కసిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం(AP Liquor Scam) కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి (Raj Kasireddy) సుప్రీంకోర్టు (Supreme Court) బిగ్ షాక్ ఇచ్చింది. ఈ కేసులో రాజ్ కసిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి ఉన్నతన్యాయస్థానం నిరాకరించింది. గురువారం నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. లిక్కర్ కుంభకోణం చాలా పెద్దదని సీజేఐ అభిప్రాయపడ్డారు.
కసిరెడ్డి అడ్వైజర్ కాదు.. ఆర్కిటెక్ట్: సీజేఐ
ఏపీ లిక్కర్ కుంభకోణంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు కుమ్మక్కు కాకపోతే ఇటువంటి పెద్ద కుంభకోణాలు జరగవని అన్నారు. కుంభకోణంలో పాత్ర వహించిన అధికారులను అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరమని చెప్పుకొచ్చారు. లిక్కర్ కుంభకోణం చాలా పెద్దదని సీజేఐ అభిప్రాయపడ్డారు. కసిరెడ్డి అడ్వైజర్ కాదని.. ఈ కుంభకోణానికి ఆర్కిటెక్ట్(రూపకర్త) అని అన్నారు. ఈ కుంభకోణంలో చాలామంది లబ్ధిదారులు ఉన్నా కసిరెడ్డి మాత్రం ప్రధాన సూత్రదారుడని సీజేఐ వెల్లడించారు. నిర్ణయం తీసుకునే పదవిలో ఉన్నవారి ప్రోద్భలం లేకుండా అధికారులు ఇలా విచ్చలవిడిగా వ్యవహరించే అవకాశం లేదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
గతంలో ఏపీ హైకోర్టు.. కసిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దానిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కసిరెడ్డి. ఇక్కడ కూడా ఆయనకు ఊరట దక్కలేదు. రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి సుప్రీం నిరాకరించడంతో కసిరెడ్డి తరపు లాయర్లు.. పిటీషన్ను ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో రాజ్ కసిరెడ్డి ఇప్పటికే 9 నెలలకు పైగా జైల్లో ఉన్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు... కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
సభలో వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆవేదన
Read Latest AP News And Telugu News