Yadagirigutta: ధ్వజారోహణం, దేవతాహ్వానం
ABN , Publish Date - Mar 03 , 2025 | 04:48 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి సన్నిధిలో ఆధ్యాత్మిక ఉత్సవ సంరంభం నెలకొంది. బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు ధ్వజారోహణం, దేవతాహ్వానం, భేరిపూజ ఆగమశాస్త్రం ప్రకారం సంప్రదాయ రీతిలో నిర్వహించారు.

గుట్ట బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఆధ్యాత్మిక సంరంభం
యాదాద్రి, మార్చి2(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి సన్నిధిలో ఆధ్యాత్మిక ఉత్సవ సంరంభం నెలకొంది. బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు ధ్వజారోహణం, దేవతాహ్వానం, భేరిపూజ ఆగమశాస్త్రం ప్రకారం సంప్రదాయ రీతిలో నిర్వహించారు. తిరుకల్యాణ వేడుకలకు ముక్కోటి దేవతలను శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడిని ఆవాహణ చేసి, ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు. ముక్కోటి దేవతలను అర్చించి గరుత్మంతుడి చిత్రపటాన్ని శ్వేత ధ్వజ పతాకంపై చిత్రించి ధ్వజస్తంభంపైకి ఆరోహణ చేశారు. గరుత్మంతుడిని ఆహ్వానించడానికి గరుడ ముద్దలను నివేదించారు. ఇంద్ర, యమ, వరుణ, కుబేరాది గణాలను ఆవాహన చేసి గరుడ మూలమంత్ర పారాయణాలు చేస్తూ గరుడ ప్రసాదాన్ని పైకి విసిరే కార్యక్రమం శాస్త్రోక్తంగా సాగింది. అంతకు ముందు యాగశాలలో హవనం కార్యక్రమం నిర్వహించారు.