Pressure Cooker Bomb Blast: మావోయిస్టుల ప్రెషర్ బాంబు పేలి.. ఒకరికి గాయాలు
ABN , Publish Date - Jul 04 , 2025 | 09:32 PM
ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బొంగుల కోసం అడవిలోకి వెళ్లిన వ్యక్తి మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుపై కాలు వేశారు. దీంతో అతడి కాలు నుజ్జు నుజ్జు అయింది.

ములుగు, జులై 04: వెదురు బొంగుల కోసం వ్యక్తి అడవిలోకి వెళ్లి.. మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుపై కాలు వేశాడు. దీంతో ఆ బాంబు పేలి.. అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ముకునూరు పాలెం గ్రామంలో చోటు చేసుకుంది. ముకునూరు పాలెం గ్రామానికి చెందిన సోయం కామయ్య శుక్రవారం వెదురు బొంగుల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లారు. అనంతరం అతడు ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ప్రెషర్ బాంబుపై కాలు వేశాడు. దీంతో ఆ బాంబు పేలింది. అతడి కాలు నుజ్జునుజ్జు అయింది. అయితే బాంబు పేలుడు విని.. ఆ సమీపంలోని పలువురు వ్యక్తులు పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు.
రక్తం మడుగులో సోయం కామయ్య పడిపోయి ఉన్నారు. దీంతో ఈ విషయాన్ని గ్రామస్తులకు వారు తెలియజేశారు. వారి సహయంతో కామయ్యను ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో అతడిని కుటుంబ సభ్యుల సహాయంలో హైదరాబాద్ తరలించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అటవీ ప్రాంతానికి చేరుకుని.. ప్రెషర్ బాంబు పేలిన ప్రదేశాన్ని పరిశీలించారు.
ఈ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులకు తెలిపారు. ఇక మావోయిస్టుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. అలాంటి వేళ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాగి ఉండవచ్చునని పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాలింపు చేపట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మద్యం స్కామ్లో పెరిగిన నిందితుల సంఖ్య
Read latest Telangana News And Telugu News