Share News

Bus Accident: పెళ్లింట విషాదం

ABN , Publish Date - May 21 , 2025 | 04:14 AM

వికారాబాద్ పరిగి మండలంలో పెళ్లి బస్సు రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మంది మృతి, 14 మంది తీవ్ర గాయాలు పొందారు.

Bus Accident: పెళ్లింట విషాదం

  • రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొట్టిన పెళ్లి బస్సు

  • వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం రంగాపూర్‌ వద్ద ప్రమాదం

  • బస్సులోని వారిలో నలుగురి మృతి

  • 14 మందికి తీవ్రగాయాలు

  • పెళ్లి విందుకు వెళ్లి వస్తుండగా ఘటన.. వధూవరులు క్షేమం

  • ప్రమాదంపై సీఎం రేవంత్‌, స్పీకర్‌, మంత్రి దామోదర విచారం

పరిగి, వికారాబాద్‌, హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): పెళ్లి వేడుక ముగిసి.. అంతే ఘనంగా విందు కార్యక్రమం నిర్వహించిన కొద్దిసేపటికే వధువు తరఫువారికి చేదు వార్త చెవిన పడింది. వరుడి తరఫువారు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైందని.. కొందరు దుర్మరణం పాలయ్యారని.. ఇంకొందరు గాయపడ్డారని! ఫలితంగా అప్పటిదాకా ఆనందం వెల్లివిరిసిన ఆ పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం రంగాపూర్‌ గ్రామ శివారులోని హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ఓ పెళ్లి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 14మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 17మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు, క్షతగాత్రులంతా రంగారెడ్డి జిల్లావాసులే.. అంతా వరుడి తరఫువారే! వఽధూవరులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం చందనవెల్లికి చెందిన సతీష్‌ కుమార్‌, పరిగి పట్టణానికి చెందిన మళ్లీశ్వరికి నాలుగు రోజుల క్రితం పెళ్లయింది.


సోమవారం రాత్రి పరిగిలో విందు జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు చందనవెల్లి నుంచి వరుడి తండ్రి రామస్వామి.. 45 మంది బంధువులతో కలిసి ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు పరిగి వెళ్లారు. అక్కడ విందు పూర్తయ్యాక అర్ధరాత్రి దాటాక 1:40 గంటలకు అంతా కలిసి అదే బస్సులో పరిగి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. రంగాపూర్‌ శివారులో ఈ బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న వాహనం లైట్ల వెలుతురుకు ఏమీ కనిపించకపోవడంతో రోడ్డు పక్కన సిమెంట్‌ బస్తాల లోడుతో నిలిపి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమవైపు భాగం పూర్తిగా దెబ్బతింది. బస్సులో ఉన్నవారిలో షాబాద్‌ మండలం సీతారాంపూర్‌ గ్రామానికి చెందిన మంగలి మల్లేశ్‌ (35), సోలిపేట్‌ గ్రామానికి చెందిన మంగలి బాలమ్మ (60) చేవెళ్ల మండలం రావుపల్లి గ్రామానికి చెందిన మంగలి హేమలత (35), ఫరూక్‌నగర్‌ మండలం కిషన్‌నగర్‌ గ్రామానికి చెందిన సందీప్‌ (28) తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. 31 మందికి గాయాలయ్యాయి. వధువు మల్లీశ్వరి, వరుడు సతీశ్‌ కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

రేవంత్‌ విచారం

రంగాపూర్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స, తక్షణ సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, మంత్రి దామోదర విచారం వ్యక్తం చేశారు.

తల్లి మృతి.. కూతురు చావుబతుకుల్లో

మృతులంతా వరుడికి సమీపబంధువులే. మల్లేశ్‌ వరుడికి సొంతబావ, హేమలత చిన్నమ్మ, బాలమ్మ అమ్మమ్మ, సందీప్‌ మేనభావ అవుతారు. మృతురాలు హేమలత కూతురు మోక్షిత(6)కు తీవ్రగాయాలు కాగా, నిలోఫర్‌లో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వారిలో కొందరిని వికారాబాద్‌లోని ఆస్పత్రికి, హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన వారికి పరిగి అస్పత్రిలోనే చికిత్స అందించి ఇంటికి పంపించి వేశారు.

Updated Date - May 21 , 2025 | 04:15 AM