Kashmir Trip Cancelled: వెంకయ్య కశ్మీర్ పర్యటన రద్దు
ABN , Publish Date - Apr 24 , 2025 | 03:56 AM
కశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన శ్రీనగర్ పర్యటనను రద్దు చేసుకున్నారు. భద్రతా కారణాలవల్ల ఆయన తిరిగి హైదరాబాద్కు వెళ్లిపోయారు. అదే విధంగా హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ఆత్మకథ ‘జనతా కీ కహానీ మేరీ ఆత్మకథ’ పుస్తకావిష్కరణను వాయిదా వేశారు.

ఢిల్లీలో దత్తాత్రేయ పుస్తకావిష్కరణ వాయిదా
ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): పహల్గాంలో ఉగ్రవాదుల దాడుల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం తన కశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారు. తన సతీమణి ఉషమ్మతో పాటు శ్రీనగర్ వెళ్లి ఈనెల 28 వరకు ఐదు రోజుల పాటు కశ్మీర్లో పహల్గాం సహా వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించాల్సి ఉంది. శ్రీనగర్ రాజ్ భవన్లో ఆయనకు బస ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, ప్రస్తుత అలజడి సద్దుమణిగేవరకూ కశ్మీర్ పర్యటనను రద్దు చే సుకోవాలని భద్రతా వర్గాలు ఆయనకు సలహా ఇవ్వడంతో బుధవారం ఉదయం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయారు. కాగా హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం న్యూఢిల్లీలో జరగాల్సిన తన పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని కూడా పహల్గాం ఘటన నేపథ్యంలో వాయిదా వేసుకున్నారు. ‘జనతా కీ కహానీ మేరీ ఆత్మకథ’ పేరుతో ఆయన రచించిన ఆత్మకథను గురువారం ఉపరాష్ట్రపతి ఆవిష్కరించాల్సి ఉండగా.. వాయిదా పడింది.