Medak: కొడుకును చూపిస్తామని తీసుకెళ్లి విజయవాడలో వృద్ధురాలి హత్య
ABN , Publish Date - Apr 24 , 2025 | 05:09 AM
విజయవాడలో ఓ వృద్ధురాలిని హత్య చేసిన కేసులో మెదక్ జిల్లా గంగాపూర్కు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు పోచమ్మను తన కొడుకును చూపిస్తామని తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు

మెదక్ జిల్లాలో ఇద్దరిని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు
మెదక్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): మెదక్ జిల్లా హవేళీఘనాపూర్ మండలం గంగాపూర్కు చెందిన ఓ వృద్ధురాలి హత్య కేసులో అదే గ్రామానికి చెందిన ఇద్దరిని ఏపీలోని విజయవాడ పోలీసులు బుధవారం అరెస్టు చేసి తీసుకెళ్లారు. అరెస్టయిన వారిలో ఓ మహిళ, యువకుడు ఉన్నారు. గంగాపూర్కు చెందిన మహేశ్(35) దాదాపు 25 రోజులుగా కనిపించడం లేదు. మహేశ్ అదృశ్యంపై అతని భార్య శశికళ.. హవేళీఘనపురం పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అయితే, మహేశ్ తల్లి పోచమ్మ కొడుకు ఆచూకీ కోసం ఆందోళనలో ఉంది. విజయవాడలో ఓ వృద్ధురాలి మృతదేహాన్ని గుర్తించిన అక్కడి పోలీసులు పోచమ్మగా నిర్ధారించారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, సెల్ఫోన్ నెట్వర్క్ ఆధారంగా గంగాపూర్కు చెందిన ఓ మహిళ, మరో యువకుడిని ఈ కేసులో అనుమానితులుగా గుర్తించారు. వారిద్దరూ పోచమ్మతో కలిసి విజయవాడలోని పలు వీధుల్లో తిరగడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. నగల కోసమే పోచమ్మను హత్య చేసి ఉంటారని భావిస్తున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కొడుకు మహేశ్ ఆచూకీ చూపిస్తామంటూ తీసుకెళ్లి నిందితులు పోచమ్మను హత్య చేసినట్టు భావిస్తున్నారు. కాగా, పోచమ్మ కొడుకు మహేశ్ను తామే హత్య చేసినట్టు నిందితులు పోలీసులు ఎదుట అంగీకరించనట్టు తెలిసింది.