Tummala: 25లోపు రైతుభరోసా
ABN , Publish Date - Jun 14 , 2025 | 03:23 AM
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున ఈనెల 25లోపు రాష్ట్రంలోని సాగుచేసే రైతులందరికీ రైతుభరోసా అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.

సాగుచేసే రైతులందరికీ పెట్టుబడి సాయం: తుమ్మల
ఖమ్మం, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున ఈనెల 25లోపు రాష్ట్రంలోని సాగుచేసే రైతులందరికీ రైతుభరోసా అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.10 వేల కోట్లను రైతులకు అందించబోతున్నామన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బాలప్పేటలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈసారి రైతుభరోసా నిబంధనల ప్రకారం 54 ఎకరాల మెట్ట ఉన్న రైతులకు కూడా అందిస్తామని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో 18 ఎకరాలు, చెరువుల కింద 27 ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తామని పేర్కొన్నారు.
అయితే రాష్ట్రంలో ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులు 87శాతం వరకు ఉన్నారని తెలిపారు. అలాగే ఉపాధి హామీ పథకంలో రెండేళ్ల పాటు పనిచేసిన అర్హత ఉన్న వ్యవసాయ కూలీలకు కూడా సహాయం అందిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం సబ్కమిటీ వేయలేదని, రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ప్రాణహిత, దుమ్ముగూడెం, రుద్రంకోట లాంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు అవసరమైన సూచనల కోసం ఆ సబ్కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. అయితే నాటి సబ్కమిటీలో తన పేరు ఉందని, కాళేశ్వరానికి తాము అనుకూలంగా నిర్ణయం తీసుకున్నామని ఈటల రాజేందర్ చెప్పినందునే ఈ అంశంపై తాను స్పందించి కమిషన్కు వాస్తవాలతో కూడిన లేఖ రాశానని చెప్పారు. సబ్కమిటీ కంటే ముందే కాళేశ్వరంపై నిర్ణయం జరిగిందని ఆయన తెలిపారు.