Share News

జంగు నవీన్‌, సజ్జా నాగేశ్వర్‌రావు ఎన్‌కౌంటర్‌లో మృతి

ABN , Publish Date - May 23 , 2025 | 05:59 AM

అబూజ్‌మడ్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేతలు జంగు నవీన్‌ అలియాస్‌ మధు (45), సజ్జా నాగేశ్వర్‌రావు (61) కూడా మృతి చెందినట్టు గుర్తించారు.

జంగు నవీన్‌, సజ్జా నాగేశ్వర్‌రావు ఎన్‌కౌంటర్‌లో మృతి

  • మొత్తం 27 మంది వివరాలు ప్రకటించిన ఛత్తీస్‌‌గఢ్‌ పోలీసులు

  • నంబాల కేశవరావు బృందం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని వెల్లడి

  • సుకుమాలో పేలిన ఐఈడీ.. జవాన్‌ మృతి

  • కగార్‌ ఆపేయాలంటూ రాజధానిలో ధర్నా

చర్ల/హసన్‌పర్తి/విశాఖపట్నం/టెక్కలి, మే 22 (ఆంధ్రజ్యోతి): అబూజ్‌మడ్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేతలు జంగు నవీన్‌ అలియాస్‌ మధు (45), సజ్జా నాగేశ్వర్‌రావు (61) కూడా మృతి చెందినట్టు గుర్తించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావు బృందం మొత్తం తుడిచిపెట్టుకుపోయినట్టు ఛత్తీస్‌‌గఢ్‌ పోలీసులు ప్రకటించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మొత్తం 27 మంది మావోయిస్టుల వివరాలను గురువారం వెల్లడించారు. నారాయణపూర్‌ జిల్లా బీఆర్‌జీ పోలీసులు పక్కా సమాచారంతో కూంబింగ్‌ చేపట్టగా.. ఎదురుకాల్పులు జరిగాయని, 27 మంది మావోయిస్టులు మృతి చెందారని, వీరిలో 14 మంది మహిళలు ఉన్నట్టు ఛత్తీస్‌‌గఢ్‌ డీజీపీ గౌతమ్‌ చెప్పారు. వీరంతా పీఎల్‌జీఏ (పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ) 7వ బెటాలియన్‌ సభ్యులని, వారిపై మొత్తం రూ.3.33 కోట్లు రివార్డు ఉందన్నారు. అబూజ్‌మడ్‌ ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి కంచుకోట అని.. ఇప్పుడక్కడ మావోయిస్టులు లేరన్నారు. అబూజ్‌మడ్‌లో ఆపరేషన్‌ కొనసాగుతోందని చెప్పారు.


బుర్ర రాకేశ్‌.. నంబాల కంప్యూటర్‌ ఆపరేటర్‌

అబూజ్‌మడ్‌ ఎన్‌కౌంటర్‌లో హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టుకు చెందిన రాకేశ్‌ (32) అలియాస్‌ వివేక్‌ మృతి చెందారు. ఆయన మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. రాకేశ్‌ తండ్రి బుర్ర బాబు ఆటో నడుపుతూ, తల్లి స్వరూప స్కూల్‌లో వంట మనిషిగా పనిచేస్తున్నారు. రాకేశ్‌ 2016 మేలో సీకేఎం కళాశాలలో పీజీ చదువుతున్న సమయంలో మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై అడవిబాట పట్టారు. నాటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్న ఆయన.. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. ఇదిలా ఉండగా.. ఛత్తీస్‌‌గఢ్‌లోని సుకుమా జిల్లా అడవుల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి కోబ్రా 210 బెటాలియన్‌ జవాను సోలంకి (30) మృతి చెందారు. మరో ముగ్గురు జవాన్లు విక్రమ్‌ రాణా, మహదేవ్‌, ఆంటోనీరాజ్‌ తీవ్రంగా గాయపడ్డారు. పిడియ గుట్టల్లో కూంబింగ్‌కు వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.


కేశవరావు మృతదేహం అప్పగింతలో జాప్యం!

మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని జీయన్నపేట. అక్కడేఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. మృతదేహాన్ని తెచ్చేందుకు కుటుంబసభ్యులు గురువారం ఛత్తీస్‌‌గఢ్‌లోని జగదల్‌పూర్‌ వెళ్లారు. అక్కడి పోలీసులు మృతదేహాన్ని మూడ్రోజుల తర్వాత అప్పగిస్తామని చెప్పినట్టు సమాచారం. మృతదేహం ఇస్తే తప్ప కదలబోమని కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ‘వెంటనే వెళ్లకుంటే మీపైనా కాల్పులు జరుపుతా’మని పోలీసులు హెచ్చరించడంతో వారు వెనుదిరిగినట్టు తెలిసింది. కాగా కేశవరావు ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కుల సంఘం ప్రతినిధులు శుక్రవారం హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి కేశవరావు తల్లి భారతమ్మ సంతకాలు సేకరించినట్టు సమాచారం.

Updated Date - May 23 , 2025 | 05:59 AM