Miss World: మన వైభవం చాటి చెప్పేలా
ABN , Publish Date - Apr 28 , 2025 | 03:50 AM
మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు రాష్ట్ర సర్కారు కృషి చేస్తోంది. ఇక్కడి కళలు, సంస్కృతి, వారసత్వ సంపదను విదేశీ అతిథులకు పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

తెలంగాణ ఖ్యాతిని మిస్ వరల్డ్.. పోటీదారులకు చూపేలా ప్రణాళిక
మే 12న అతివల బుద్ధ వనం పర్యటన
13న చార్మినార్, లాడ్ బజార్ సందర్శన
14న రామప్ప, ఓరుగల్లు కోటకు పయనం
హైదరాబాద్/హనుమకొండ కల్చరల్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు రాష్ట్ర సర్కారు కృషి చేస్తోంది. ఇక్కడి కళలు, సంస్కృతి, వారసత్వ సంపదను విదేశీ అతిథులకు పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ దేశాల నుంచి వచ్చే సుందరీమణులు, ఆయా రాజ్యాల ప్రతినిధులు రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన ప్రాంతాల్లో పర్యటించేలా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం, హైదరాబాద్ ముఖ చిత్రంగా ఉన్న చార్మినార్, చేనేత ఇక్కత్ కళకు పేరుగాంచిన పోచంపల్లి, ఆచార్య నాగార్జునుడు నడయాడిన బుద్ధవనం వంటి చారిత్రక ప్రాంతాలను సందర్శించేలా పర్యాటక శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ఆగ్నేయాసియా నుండి వచ్చే మిస్ వరల్డ్ ప్రతినిధులు మే 12 బుద్ధ పూర్ణిమ సందర్భంగా బుద్ధ వనాన్ని సందర్శించనున్నారు. కృష్ణా నదీ తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక ప్రార్థనల్లో వారు పాల్గొంటారు. బుద్ధుని జీవిత చరిత్ర, బౌద్ధ మత సంప్రదాయాలు సహా బౌద్ధానికి సంబంధించిన అనేక విషయాలను వారు తెలుసుకోనున్నారు. ఇక, మే 13న మిస్ వరల్డ్ పోటీదారులు చార్మినార్ వద్ద పర్యటిస్తారు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన చార్మినార్ వైభవాన్ని తిలకించడంతో పాటు అక్కడి లాడ్ బజార్లో లభ్యమయ్యే ముత్యాలు, లక్కగాజుల కేంద్రాలను సందర్శించేలా 13 సాయంత్రం చార్మినార్ వద్ద పర్యాటక అధికారులు హెరిటేజ్ వాక్ను ఏర్పాటు చేస్తున్నారు. మే 13న సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు చార్మినార్ నుంచి లాడ్బజార్, మోతి గల్లీ మీదుగా హెరిటేజ్ వాక్ను చౌమహల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. చౌమహల్లా ప్యాలె్సలో మిస్ వరల్డ్ పోటీదారుల ఫొటో షూట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సూఫీ, ఖవ్వాలీ సంగీతంతో పాటు తెలంగాణ జాన పద సంగీత నృత్య ప్రదర్శనలు మిస్ వరల్డ్ పోటీదారులను అలంరించనున్నాయి.
ఓరుగల్లు కోటకూ మిస్ వరల్డ్ వనితలు..
మే 14న మిస్ వరల్డ్ పోటీదారుల బృందం ఒకటి ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి వెళుతుంది. మరో బృందం వరంగల్లోని వేయి స్తంభాల ఆలయం, ఓరుగల్లు కోట సందర్శనకు వెళుతుంది. ఈ రెండు బృందాలు సాయంత్రం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శిస్తాయి. కాగా, మిస్ వరల్డ్ ప్రతినిధులు తొలుత రామప్పతో పాటు కాళోజీ కళాక్షేత్రాన్ని చూసేలా అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. చారిత్రక వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట ప్రాంతాలను ఆ జాబితాలో చేర్చకపోవడంపై ప్రజల్లో చర్చ జరిగింది. ఈ క్రమంలో ఏప్రిల్ 21న ‘ఆంధ్రజ్యోతి’ ఉమ్మడి వరంగల్ జిల్లా సంచికలో ‘కోట కానరాలేదా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. అది ప్రజల్లో విస్తృత చర్చకు దారితీసింది. దీంతో స్పందించిన పర్యాటక శాఖ అధికారులు సుందరీమణుల పర్యటన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య
Visakhapatnam: యాప్లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు
AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..
Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు
BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..
For Telangana News And Telugu News