నేడు యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రారంభం
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:33 AM
సైనిక పాఠశాలల తరహాలో పోలీసుల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలో తొలి స్కూల్ను సీఎం రేవంత్రెడ్డి గురువారం ఉదయం ప్రారంభిస్తున్నారు.

50% సీట్లు పోలీసుల పిల్లలకు, మిగిలినవి ఇతరులకు..
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్య
సైనిక పాఠశాలల తరహాలో బోధన
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి) : సైనిక పాఠశాలల తరహాలో పోలీసుల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలో తొలి స్కూల్ను సీఎం రేవంత్రెడ్డి గురువారం ఉదయం ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు హాజరవుతున్నారు. అమరులైన పోలీసుల పిల్లలకు ఇందులో తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాత సర్వీసులో ఉన్న కానిస్టేబుల్ నుంచి ఐపీఎ్సల కుటుంబాల పిల్లలకు 50 శాతం సీట్లు కేటాయించారు. మరో 50 శాతం సీట్లు స్థానికులకు కేటాయించారు. విధి నిర్వహణలో ఉండి పోలీసు అధికారులు కుటుంబాలకు తక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారని, అలాంటపుడు వారి పిల్లల చదువు సవాలుగా మారుతుందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
ఆ లోటును భర్తీ చేసే విఽధంగా పోలీసుల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్తమ విద్యను అందించడానికి యంగ్ ఇండియా పోలీసు స్కూళ్లు పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ శిక్షణతో పాటు విద్యార్థులకు నూతన ఆవిష్కరణలను పరిచయం చేస్తూ క్రమశిక్షణ కలిగిన పౌరులుగా మార్చడానికి యంగ్ ఇండియా పోలీసు స్కూళ్ల ప్రాజెక్టు ఒక అవకాశం అని డీజీపీ జితేందర్ అన్నారు. ఈ స్కూలు తెలంగాణ పోలీసు చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని తెలంగాణ పోలీసులు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.