Share News

ఉగాదికి గద్దర్‌ అవార్డుల ప్రదానం

ABN , Publish Date - Jan 19 , 2025 | 04:06 AM

ఈ ఏడాది ఉగాది నుంచి ప్రతి ఏటా గద్దర్‌ తెలంగాణ చలనచిత్ర అవార్డులను ప్రదానం యాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అవార్డుల కమిటీ సభ్యులు, అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు.

ఉగాదికి గద్దర్‌ అవార్డుల ప్రదానం

  • సినీ రంగంలో ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్‌

  • గత పదేళ్లలో చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేశారు

  • అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఉగాది నుంచి ప్రతి ఏటా గద్దర్‌ తెలంగాణ చలనచిత్ర అవార్డులను ప్రదానం యాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అవార్డుల కమిటీ సభ్యులు, అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. శనివారం సచివాలయంలో గద్దర్‌ అవార్డుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి, ప్రశంసిస్తూ అవార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. జాతీయ సమైక్యత పెంపు, సాంస్కృతిక, విద్య, సామాజిక సంబంధిత చిత్రాలు, అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువలతో కూడిన చిత్రాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ అవార్డులు ఇవ్వనున్నామని పేర్కొన్నారు.


అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయ స్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహించాలని సూచించారు. గద్దర్‌ ప్రతిష్ఠను పెంచేలా అవార్డుల లోగో ఉండాలన్నారు. సినిమా రంగం లో హైదరాబాద్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. గత పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించినవారు చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేశారని, అవార్డుల ప్రదానం జరగలేదన్నారు. ఫీచర్‌ ఫిల్మ్‌ లు, బాలల చిత్రాలు, తెలుగు సినిమాలపై పుస్తకాలు వంటి వివిధ విభాగాల కింద అవార్డులు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. అవార్డుల్లో నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రాలను అందజేస్తారు. ఈ సమావేశంలో టీఎ్‌ఫడీసీ చైర్మన్‌ దిల్‌రాజు, ఎండీ హరీశ్‌, కమిటీ చైర్మన్‌ బి.నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2025 | 04:06 AM