Siddipet: చచ్చేవారికి సిరప్ ఎందుకు?
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:07 AM
తీవ్ర అస్వస్థతకు గురైన రెండేళ్ల బాలికను ఆస్పత్రికి తీసుకెళితే.. ‘‘చచ్చేవాళ్లకు సిరప్ ఎందుకు?’’ అని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆ వైద్యుడు. సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వాస్పత్రిలో ఈ ఘటన జరిగింది.

రెండేళ్ల పాపను ఆస్పత్రికి తీసుకెళితే డాక్టర్ వ్యాఖ్యలు
ఉన్నతాధికారులకు ఆ చిన్నారి తండ్రి ఫిర్యాదు
చేర్యాల, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): తీవ్ర అస్వస్థతకు గురైన రెండేళ్ల బాలికను ఆస్పత్రికి తీసుకెళితే.. ‘‘చచ్చేవాళ్లకు సిరప్ ఎందుకు?’’ అని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆ వైద్యుడు. సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వాస్పత్రిలో ఈ ఘటన జరిగింది. ఆ పట్టణానికి చెందిన డి.అనిల్కుమార్ కూతురు సుదీక్ష (2) ఆదివారం రాత్రి 11గంటలకు తీవ్ర అస్వస్థతకు గురైంది.. అప్పటికే ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్ షాపులు బంద్ కావడంతో కూతురును అనిల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. డ్యూటీలో ఉన్న డాక్టర్ కల్యాణ్ చక్రవర్తికి.. తన కూతురు కడుపునొప్పితో ఏడుస్తోందని, చికిత్స చేయాలని, ఏదైనా సిరప్ ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు.
అయితే ఆ వైద్యుడు, అనిల్పై రుసరుసలాడుతూ.. సచ్చేటోళ్లకు సిర్పలు పోయరు. గ్లూకోజ్లు, ఇంజెక్షన్లే ఇస్తాం. ఆర్నెల్లుగా ఆస్పత్రిలో మందులే లేవు’’ అని మండిపడ్డాడు. ఇలా మాట్లాడుతున్నారేమిటి? అంటూ అనిల్ ప్రశ్నించగా.. ‘‘ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారా? ఇక్కడ కాకపోతే ఏ చెట్టుకింద కుర్చీ వేసుకొని కూర్చున్నా నేను బతకగలను’’ అని కల్యాణ్ నిర్లక్ష్యంగా మాట్లాడారు. దిక్కుతోచని స్థితిలో కూతురును తీసుకొని అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయిన అనిల్.. తనకు పరిచయం ఉన్న మెడికల్ షాపు నిర్వాహకుడి ఇంటికి వెళ్లి.. షాపు ఓపెన్ చేయించి, సిరప్ బాటిల్ తీసుకెళ్లాడు. కాగా, డాక్టర్ కల్యాణ్పై ఇన్చార్జి డాక్టర్ దామోదర్కు లిఖితపూర్వకంగా, జిల్లా కోఆర్డినేటర్కు ఫోన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.