TGSRTC: టార్గెట్.. టెన్షన్.. ఆర్టీసీ కండక్టర్లకు అధికారుల వేధింపులు
ABN , Publish Date - May 15 , 2025 | 10:06 AM
ఆర్టీసీ కండక్టర్లకు ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి వేధింపులు ఎక్కువవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. వారికి రోజువారీ టార్గెట్లను విధిస్తున్నారు. దీంతో ఆ లక్ష్యాన్ని చేరుకోలేక కండక్టర్లు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఓపక్క బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, సిటీలో బస్ పాస్లుండటంతో లక్ష్య చేధన తలకు మించిన భారంగా మారింది.

- రోజుకు రూ. 5-6 వేలు కలెక్షన్ తీసుకురావాలని ఆదేశం
హైదరాబాద్ సిటీ: మహాలక్ష్మి ఉచిత ప్రయాణికులతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 95-100 శాతం నమోదవుతోంది. బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నా.. ఆదాయం పెరగడం లేదు. ఈ నేపథ్యంలో అధికారులు, డిపో మేనేజర్లు కండక్టర్లకు టార్గెట్ విధిస్తున్నారు. రోజుకు కలెక్షన్ రూ. 5 వేల నుంచి రూ. 6 వేలు తీసుకురావాలని ఆదేశిస్తున్నారు. మహాలక్ష్మి ప్రయాణికులతో బస్సులు నిండిపోతుంటే టికెట్ల కలెక్షన్ ఎలా పెంచాలంటూ పలువురు కండక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కట్టెతో కొట్టి, గాజులతో కోసి.. విషయం ఏంటంటే..
ఉచిత ప్రయాణాలతో బస్సుల్లో రద్దీ రెండింతలు పెరగడంతో విధులు నిర్వహించడం కష్టంగా మారిందని కొంతమంది కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా.. ఆర్టీసీకి ఆదాయం పెరిగిందని పనిచేస్తుంటే కొంతకాలంగా కొందరు డిపో మేనేజర్లు నగదు కలెక్షన్ పెంచాలని ఒత్తిడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ గ్రేటర్లో మూడు వేల బస్సులను నడుపుతూ 23-24 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.
సిటీ బస్సుల్లో ప్రయాణించే వారిలో మహిళా ప్రయాణికులు 17 లక్షల మంది ఉంటుండగా, పురుషులు 7 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. ఉదాహరణకు సిటీ బస్సులో 40 మంది ప్రయాణికులుంటే అందులో మహిళా ప్రయాణికులే 25-30 మంది ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయం పెంచడం ఎలా సాధ్యమంటూ కండక్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ఆఫీస్ సమయంలో మహిళలతో బస్సులు నిండిపోవడంతో టికెట్లు తీసుకుని ప్రయాణాలు చేసే వారంతా ఆటోలు, క్యాబ్లతోపాటు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
రోజువారీ ఆదాయం ఇలా..
గ్రేటర్ జోన్లో మహాలక్ష్మి పథకం ప్రారంభించక ముందు రోజువారీ ఆదాయం రూ. 4 కోట్లు. పథకం ప్రారంభించిన తర్వాత రూ. 2 కోట్ల నుంచి రూ. 2.5 కోట్లకు తగ్గింది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణికులతో రోజూ గ్రేటర్లో రూ. 3.5 కోట్ల ఆదాయం వస్తుండగా, ఆ మొత్తాన్ని ప్రతినెలా టికెట్ల లెక్కల ఆధారంగా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తోంది. ఉచిత ప్రయాణాలతో రోజూ టికెట్లతో వచ్చే నగదు కలెక్షన్ భారీగా తగ్గడంతో కొంతమంది డిపో మేనేజర్లు నగదు ఆదాయం పెంచే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
నగదు కలెక్షన్ ఎలా పెంచాలి..
నగదు కలెక్షన్ పెంచాలని కొంతమంది అధికారులు కండక్టర్లను ఇబ్బంది పెడుతున్నారని ఆర్టీసీ జేఏసీ నాయకుడు వెంకన్న అన్నారు. పురుష ప్రయాణికుల సంఖ్య పెంచుకొని ఆర్టీసీకి ఆదాయం తీసుకురావాలని టార్గెట్ విధించడం తగదన్నారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రతీ టికెట్ చార్జీని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తున్నా రోజువారీ కలెక్షన్ పెంచాలని అధికారులు వేధిస్తున్నారని ఆయన వాపోయారు. కలెక్షన్ ఎలా పెంచాలో చెప్పడం లేదని, కండక్టర్లపై వేధింపులను ఆపాలని వెంకన్న డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు
కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులు హతం
High Court: ‘దోస్త్’పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
Read Latest Telangana News and National News