Share News

GHMC: ‘టౌన్‌ప్లానింగ్‌’ వివాదాలకు ట్రైబ్యునల్‌

ABN , Publish Date - Jun 06 , 2025 | 03:19 AM

రాష్ట్రంలో తొలిసారిగా టౌన్‌ప్లానింగ్‌ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయనుంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయాల సముదాయంలోనే ఈ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

GHMC: ‘టౌన్‌ప్లానింగ్‌’ వివాదాలకు ట్రైబ్యునల్‌

  • జీహెచ్‌ఎంసీ కార్యాలయ సముదాయంలోనే ఏర్పాటు

  • కోర్టు సెలవులు ముగిసే నాటికల్లా ప్రారంభానికి కసరత్తు

  • ఇప్పటిదాకా ఆ వివాదాలపై కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి

  • ఇకపై అలాంటి అవసరం ఉండబోదంటున్న అధికారులు

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తొలిసారిగా టౌన్‌ప్లానింగ్‌ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయనుంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయాల సముదాయంలోనే ఈ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, త్వరలోనే అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. భవన నిర్మాణాల విషయంలో పట్టణ ప్రణాళిక విభాగం అభ్యంతరాలను సవాల్‌ చేసేందుకు ఈ ట్రైబ్యునల్‌ ఉపయోగపడనుంది. ఇప్పటిదాకా భవన నిర్మాణ అనుమతుల విషయంలో టౌన్‌ప్లానింగ్‌ విభాగం వేసే కొర్రీలను పరిష్కరించుకోవాలంటే హైకోర్టు లేదా ఇతర కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేది. అక్కడ విచారణ పూర్తయి, ఈ వివాదాలు పరిష్కారమయ్యేందుకు సాధారణంగానే చాలా సమయం పట్టేది. ఈ జాప్యాన్ని నివారించడానికి ఓ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేసుకోవాలనిపలు సందర్భాల్లో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ, గత ప్రభుత్వాలు ఈ అంశంపై దృష్టి పెట్టలేదు. దీనిపై ఇటీవల ఓ ఎన్జీవో కోర్టు ధిక్కరణ కింద ఫిర్యాదు చేయడంతో ట్రైబ్యునల్‌ ఏర్పాటు ఎప్పటిలోపు చేస్తారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని బదులిచ్చిన ప్రభుత్వం.. హైకోర్టు వేసవిసెలవులు ముగిసేలోగా ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ట్రైబ్యునల్‌ చైర్మన్‌గా జిల్లా జడ్జి వ్యవహరించనుండగా, సభ్యుడిగా పట్టణ ప్రణాళికా విభాగం నుంచి అనుభవం ఉన్న అధికారిని నియమించే అవకాశం ఉంది.


గణనీయంగా పెరిగిన కేసులు

రాష్ట్రంలో అనధికారిక నిర్మాణాలు, టౌన్‌ ప్లానింగ్‌ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు గణనీయంగా పెరిగాయి. హైకోర్టు పరిధిలో గత ఐదేళ్ల వ్యవధిలో అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 2.50లక్షల పిటిషన్లు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీలో ప్రతి వారం నిర్వహించే ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల్లో 40-50శాతం నిర్మాణాలకు సంబంధించిన వివాదాలే ఉంటున్నాయి. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం, నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మించడం.. వంటి కేసులు పెరిగిపోతున్నాయి. ఇకపై ఇలాంటి వివాదాలన్నీ ట్రైబ్యునల్‌ పరిధిలోనే పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ ద్వారా మున్సిపల్‌ బిల్డింగ్‌ ట్రైబ్యునల్‌ (ఎంబీటీ) ఏర్పాటుకు మార్గం సుగమం చేసినట్లు సమాచారం. సాధారణ కోర్టుల కంటే వేగంగా కేసులను పరిష్కరించడమే కాకుండా టౌన్‌ప్లానింగ్‌ అధికారుల వేధింపులకు గురయ్యే వారికి ట్రైబ్యునల్‌ తక్షణ సాయం అందించేందుకు దోహదపడనుంది. అదే సమయంలో అనధికారిక నిర్మాణాలను త్వరగా గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

కవితపై కేసీఆర్‌ నారాజ్‌!

ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ

Read Latest Telangana News and National News

Updated Date - Jun 06 , 2025 | 03:19 AM